బొంరాస్పేట, మే 31 : వేసవి సెలవుల అనంతరం 2023-24 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ తరగతులు గురువారం నుంచి ప్రారంభమవుతున్నాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మొదటి సంవత్సరంలో చేరడానికి ప్రభుత్వం ఇప్పటికే ప్రవేశ షెడ్యూల్ను ప్రకటించింది. మే 15వ తేదీ నుంచి పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల హాజరును పెంచడానికి ఇప్పటికే ఇంటర్ అధికారులు ప్రచారం ప్రారంభించారు.
ప్రభుత్వ కళాశాలల్లో అందిస్తున్న ఉచిత పాఠ్య పుస్తకాలు, నాణ్యమైన విద్య, ఉపకార వేతనాలు, మౌలిక వసతుల కల్పన వంటి అంశాలను విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు వివరిస్తున్నారు. ప్రైవేటు కళాశాలల్లో కంటే ప్రభుత్వ కళాశాలల్లో చేరితేనే మంచి అవకాశాలు ఉంటాయని ప్రచారం చేస్తున్నారు. వికారాబాద్ జిల్లాలో 2022-23 విద్యా సంవత్సరంలో ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ కళాశాలలు మెరుగైన ఫలితాలను సాధించాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్లో 62 శాతం ఉత్తీర్ణత ఉంటే వికారాబాద్ జిల్లాలో 60 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ప్రైవేటు కళాశాలలకు దీటుగా ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు 972, 952, 951 మార్కులు సాధించి సత్తా చాటారు. జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చేరడానికి విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు.
జిల్లాలో 9 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 2,940 సీట్లు
వికారాబాద్ జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్, మర్పల్లి, దోమ, పెద్దేముల్, మోమిన్పేట, నవాబుపేటల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ, ఎంఈసీ కోర్సుల్లో విద్య అందిస్తుండగా ఈ కోర్సుల్లో మొదటి సంవత్సరంలో చేరే విద్యార్థులకు 2,940 సీట్లు అందుబాటులో ఉన్నాయి. పదో తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే ఎస్సెస్సీలో సాధించిన మార్కులు, రోస్టర్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం విద్యార్థులకు కళాశాలల్లో సీట్లు కేటాయిస్తారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు వారికి ఏ కళాశాలలో ఏ కోర్సులో సీటు వచ్చిందనే విషయాన్ని వారి మొబైల్కు సమాచారం అందిస్తారు. విద్యార్థులు సమాచారంలో పేర్కొన్న ప్రకారం సర్టిఫికెట్లను నిర్ణీత తేదీలలో కళాశాలల్లో సమర్పించి ప్రవేశం పొందాలి. ప్రస్తుతం మొదటి దశ ప్రవేశాలు జరుగుతున్నాయని, ఇంకా రెండు, మూడు దశల్లో ప్రవేశాలు ఉంటాయని ఇంటర్ అధికారులు తెలిపారు.
ఉచిత పాఠ్య పుస్తకాలు, నాణ్యమైన విద్య
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన, గుణాత్మకమైన విద్య అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నది. ప్రైవేటు కళాశాలలకు దీటుగా ప్రభుత్వ కళాశాలల్లో మౌలిక వసతుల కల్పన, లెక్చరర్ల నియామకం చేపడుతున్నది. జిల్లాలోని 9 ప్రభుత్వ కళాశాలల్లో తెలుగు, ఇంగ్లిష్ మీడియంలతో పాటు కొడంగల్, తాండూరు, మర్పల్లి, వికారాబాద్ జూనియర్ కళాశాలల్లో ఉర్దూ మీడియంలో కూడా బోధన అందిస్తున్నారు. విశాలమైన తరగతి గదులతో పాటు విద్యార్థులకు నిర్బంధ విద్య కాకుండా చదువులో స్వేచ్ఛ ఇస్తారు. మెరుగైన ఫలితాల సాధనకు స్టడీ అవర్స్, స్లిప్ టెస్టులు నిర్వహిస్తారు. ఇంటర్లో చేరిన విద్యార్థులకు ప్రభుత్వం ఏడాదికి రూ.5 వేలు ఉపకార వేతనంగా అందజేస్తున్నది. నాణ్యమైన విద్య, పారదర్శక పరీక్షల నిర్వహణ విధానం, మౌలిక వసతులకు విద్యార్థులు ఆకర్షితులై ప్రభుత్వ కళాశాలల్లో చేరడానికి మొగ్గు చూపుతున్నారు. గత ఏడాది జిల్లాలోని 9 కళాశాలల్లో అన్ని సీట్లు భర్తీ అయ్యాయి. తాండూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రవేశాల్లో రాష్ట్రంలోనే మూడో స్థానంలో నిలిచింది.
కళాశాలల్లో 129 మంది అధ్యాపకులు
జిల్లాలోని 9 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యా బోధనకు ఎలాంటి ఆటంకం కలుగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. కళాశాలల్లో రెగ్యులర్ లెక్చరర్లు ఐదుగురు పని చేస్తుండగా ఇటీవల కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులరైజ్ చేయడంతో జిల్లాలో పని చేస్తున్న 69 మంది కాంట్రాక్టు లెక్చరర్లు రెగ్యులరయ్యారు. దీంతో రెగ్యులర్ అధ్యాపకుల సంఖ్య 74కు చేరింది. మరో 55 మంది అతిథి అధ్యాపకులు కూడా కళాశాలల్లో అందుబాటులో ఉన్నారు. అన్ని కళాశాలల్లో విద్యార్థులకు అవసరమైన ఫర్నిచర్, తరగతి గదులు అందుబాటులో ఉన్నాయి. తాండూరు, వికారాబాద్ కళాశాలల్లో అదనపు తరగతి భవనాల నిర్మాణం పూర్తి కావస్తుండగా కొడంగల్లో అదనపు తరగతి గదుల నిర్మాణానికి ప్రభుత్వం రూ.2 కోట్లు మంజూరు చేసింది. వీటి నిర్మాణానికి త్వరలో భూమి పూజ నిర్వహించనున్నారు.
నాణ్యమైన విద్య అందిస్తున్నాం..
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పేద, బడుగు, వెనుకబడిన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి కృషి చేస్తున్నాం. ఇప్పటికే అడ్మిషన్లు జరుగుతున్నాయి. విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. కళాశాలల్లో చేరిన విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు, ఉపకార వేతనాలు అందిస్తున్నాం.
– శంకర్నాయక్, ఇంటర్ జిల్లా నోడల్ అధికారి