సైన్స్ పరిశోధనలకు రూపం ఇచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర సాంకేతిక సమితి (టీఎస్ కాస్ట్) ఆధ్వర్యంలో నగరంలో ఇన్నోవేషన్ హబ్ రూపుదిద్దుకుంటున్నది. తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదిత ప్రమోషన్ ఆఫ్ కల్చర్ ఆఫ్ సైన్స్ పథకంలో భాగంగా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియమ్స్ (ఎన్సీఎస్ఎం) ఈ ప్రాజెక్టును మంజూరు చేసింది. హనుమకొండ హంటర్ రోడ్డులోని రాష్ట్రంలోనే ఏకైక రీజినల్ సైన్స్ సెంటర్లో దీని నిర్మాణ పనులు చేపట్టింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో రూ.1.60కోట్లతో గత డిసెంబర్లో ప్రక్రియ మొదలైంది. డిస్కవరీ హాల్, ఇన్నోవేషన్ రీసెర్చ్ సెంటర్, ఐడియా ల్యాబ్, డిజైన్ స్టూడియోల నిర్మాణం పూర్తి కావస్తున్నది. ఫర్నిచర్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ఆవిష్కరణలకు అవసరమైన పరికరాలను ముంబై, ఢిల్లీ నుంచి తెప్పించి త్వరలోనే అమర్చనున్నారు.
వరంగల్, జనవరి 2 తెలంగాణ ప్రతినిధి : నగరంలో మరో వినూత్న ప్రాజెక్టు రూపుదిద్దుకుంటున్నది. మొదటి నుంచి విద్యా కేంద్రంగా ఉన్న వరంగల్లో పరిశోధనలకు రూపం వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్రంలోని ఏకైక రీజినల్ సైన్స్ సెంటర్లో ఇన్నోవేషన్ హబ్ నిర్మాణం పూర్తవుతున్నది. ఇప్పటికే ఫర్నిచర్ కూడా ఏర్పాటు చేశారు. ఆవిష్కరణల రూపకల్పనకు అవసరమైన పరికరాలను అమర్చే పనులు త్వరలోనే పూర్తి కానున్నాయి. ఆయా పరికరాలను ముంబై, ఢిల్లీ నుంచి తీసుకువచ్చేందుకు అంతా సిద్ధమైంది. ఇన్నోవేషన్ హబ్ కోసం సైన్స్ సెంటర్లో శాశ్వత ప్రాతిపదికన నిర్మాణ పనులు చేస్తున్నారు. డిస్కవరీ హాల్, ఇన్నోవేషన్ రీసెర్చ్ సెంటర్, ఐడియా ల్యాబ్, డిజైన్ స్టూడియోలను నిర్మిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సాంకేతిక సమితి(టీఎస్ కాస్ట్) ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టును ఏర్పాటు జరుగుతున్నది. తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదన ప్రమోషన్ ఆఫ్ కల్చర్ ఆఫ్ సైన్స్ పథకంలో భాగంగా వరంగల్లోని రీజినల్ సైన్స్ సెంటర్కు ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటవుతున్నది.
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియమ్స్ (ఎన్సీఎస్ఎం) ఈ ప్రాజెక్టును మంజూరు చేసింది. రూ.1.60కోట్లతో ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు ప్రక్రియ గత డిసెంబర్లో మొదలు కాగా, మూడేళ్లలో దీన్ని ఏర్పాటు చేస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం నిధులు ఇచ్చేలా ఈ ప్రాజెక్టు ఉంది. స్కూల్ పిల్లల్లో ఉన్న సృజనాత్మక, సైన్స్ ఆవిష్కరణలు, సంపద్రాయ సైన్స్లోని ఆలోచనలు దాల్చేలా కేంద్ర ప్రభుత్వం రీజినల్ సైన్స్ సెంటర్ల ఏర్పాటు ప్రక్రియను మొదలుపెట్టింది. ప్రక్రియలో భాగంగా 1986లో కేంద్ర ప్రభుత్వం వరంగల్, విజయవాడ, తిరుపతిలో సైన్స్ సెంటర్లను మంజూరు చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు నాడు తెలంగాణలో ఏకైక రీజినల్ సైన్స్ సెంటర్ ఏర్పాటుపై నిర్లక్ష్యంగా వ్యవహరించాయి. దశాబ్దాలుగా పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ప్రత్యేకంగా దృష్టిసారించింది. రూ.5.87కోట్లతో ఎత్తయిన ప్రాంతంలో మూడు అంతస్తులతో రీజినల్ సైన్స్ సెంటర్ను నిర్మించింది.
పాఠ్యపుస్తకాల్లోని క్లిష్టమైన అంశాలను స్కూల్ విద్యార్థులకు సులువుగా తెలియజేయడమే లక్ష్యంగా సైన్స్సెంటర్ నిర్మాణం జరిగింది. శాస్త్ర, సాంకేతిక అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకే సైన్స్ సెంటర్ ఏర్పాటైంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో వరంగల్ సైన్స్ సెంటర్ నిర్మాణం జరిగింది. స్కూల్ పిల్లలకు సైన్స్ ఆవిష్కరణలపై అవగాహన పెంచడం, వారి ఆలోచనలకు కార్యరూపం దాల్చడమే లక్ష్యంగా రీజినల్ సైన్స్ సెంటర్ ఏర్పాటైంది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టులోని అంశాలను పిల్లలకు సులభంగా అవగాహన కలిగించేలా సైన్స్ సెంటర్లో ఎగ్జిబిట్లను ఏర్పాటు చేశారు. సైన్స్ సెంటర్ భవనంలో ఏడు విశాలమైన హాళ్లు, స్పేస్ సోలార్ పవర్, 5డి థియేటర్, పర్యావరణ కాలుష్యం, మానవ శరీర నిర్మాణ నమూనాలు, ఎడ్యుకేషన్ త్రూ శాటిలైట్ హాల్ ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక సాంకేతిక సంస్థల్లో జరిగే వైజ్ఞానిక సదస్సులను వరంగల్ రీజినల్ సైన్స్ సెంటర్లోని హాల్లో ప్రత్యక్షంగా చూడవచ్చు. చర్చల్లోనూ వరంగల్ సెంటర్ నుంచి పాల్గొనవచ్చు. ఈ సెంటర్లోనే తాజాగా ఇన్నోవేషన్ హబ్ నిర్మాణం జరుగుతున్నది. తెలంగాణ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక శాఖ ఆధ్వర్యంలోని టీఎస్కాస్ట్ దీన్ని నిర్వహిస్తుంది.