పారిశ్రామికంగా రంగారెడ్డి జిల్లా ఏటేటా పురోగతిని సాధిస్తూ పరిశ్రమల ఖిల్లాగా మారుతున్నది. ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో పారిశ్రామిక అభివృద్ధికి బాటలు పడుతున్నాయి. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ‘టీఎస్ఐపాస్’తో త్వరితగతిన అనుమతులను ఇవ్వడంతో పాటు సకల సౌకర్యాలను కల్పిస్తున్నది. దీంతో జిల్లాకు ఇప్పటి వరకు రూ.45573.40 కోట్ల పెట్టుబడులు రాగా, 1615 ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు వివిధ శాఖల నుంచి అనుమతులు లభించాయి. ఇందులో ఇప్పటికే 1211 పరిశ్రమలను నెలకొల్పారు. గతేడాది డిసెంబర్ 31వ తేదీ వరకు జిల్లాలో 213 పరిశ్రమలను స్థాపించడం విశేషం. వీటిలో సూక్ష్మ, చిన్న, మధ్య, పెద్ద తరహా, భారీ, మెగా మౌలిక పరిశ్రమలు ఉన్నాయి. ఈ పరిశ్రమల ఏర్పాటు వల్ల 5,12,486 మందికి ఉపాధి లభిస్తుండడం గమనార్హం.
– రంగారెడ్డి, మే 16 (నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి, మే 16(నమస్తే తెలంగాణ): గత పాలకుల హయాంలో కోల్పోయిన అంశాలన్నింటినీ తిరిగి పొందేందుకు, రాష్ట్రం పలు రంగాల్లో పురోగమించేందుకు అభివృద్ధి దిశగా తెలంగాణ అడుగులు వేస్తున్నది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఒక్కొక్క అంశం వారీగా అభివృద్ధి పథంలోకి పయనిస్తున్నది. ఐటీ, పారిశ్రామిక శాఖ మంత్రి కే తారకరామారావు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పారిశ్రామిక అభివృద్ధికి బాటలు పడుతున్నాయి. హైదరాబాద్ మహా నగరానికి రంగారెడ్డి జిల్లా అనుకూలంగా, అందుబాటులో ఉండటంతో జిల్లాకు రోజురోజుకూ కొత్త పరిశ్రమలు వస్తున్నాయి. ఉపాధి, ఉద్యోగ కల్పనకు, పారిశ్రామిక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నూతన ఆవిష్కరణలు చేపడుతున్నది. వేలు, లక్షలాది మంది నిరుద్యోగులు, యువతకు ఉపాధి మార్గాలు చూపించే దిశగా అడుగులు పడుతున్నాయి.
రంగారెడ్డి జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి పథంలో నడుస్తూ, దినదినాభివృద్ధి చెందుతున్నది. జిల్లాలో వేల కోట్ల పెట్టుబడులతో పలు రకాల పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు ఎంతో మంది పారిశ్రామికవేత్తలు ఉత్సాహంతో ముందుకు వస్తున్నారు. తొమ్మిదేండ్లుగా రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ, అధికార యంత్రాంగం ప్రోత్సాహం కొనసాగింది. జిల్లాలోని రవాణా పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు, భూ భౌతిక పరిస్థితులన్నీ పెట్టుబడులు, పారిశ్రామిక యూనిట్లు నెలకొల్పేందుకు అనుకూలంగా ఉన్నాయి. పరిశ్రమలు స్థాపించేందుకు కావాల్సిన వివిధ అనుమతులను తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక అనుమతులు, స్వీయ ధ్రువీకరణ విధాన చట్టం 2014 ప్రకారం, అనుమతులు నిర్దేశిత కాల పరిమితితో మంజూరు చేస్తూ, నూతన సంస్థలను స్వాగతిస్తున్నది. గతేడాదిలో ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే దాదాపు 20వేల మందికి ప్రభుత్వం ఉపాధి కల్పించింది.
టీఎస్ ఐ పాస్ ద్వారా స్థాపించిన పరిశ్రమలు..
జిల్లాలో పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం, ఇంకా జిల్లా పరిశ్రమల కేంద్రం నిత్యం కృషి చేస్తున్నది. 20 ఫిబ్రవరి 2023 వరకు పలు యూనిట్లు నెలకొల్పేందుకు గాను ఆన్లైన్లో మొత్తం 1615 ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు వివిధ శాఖల నుంచి అనుమతులు లభించాయి. కాగా, వీటిలో 1211 యూనిట్లు పలు రకాలుగా అనుమతులు పొంది, పరిశ్రమలను స్థాపించాయి. వాటిలో సూక్ష్మ, చిన్న, మధ్య, భారీ, మెగా – తయారీ, మెగా – మౌలిక తరహా పరిశ్రమలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే జిల్లాలో రూ.254 కోట్ల పెట్టుబడితో 452 సూక్ష్మ తరహా పరిశ్రమలను నెలకొల్పగా 8,221 మందికి ఉపాధి లభిస్తున్నది. రూ.2005.40 కోట్ల పెట్టుబడితో 522 చిన్న తరహా పరిశ్రమలను నెలకొల్పగా 17,905 మందికి ఉపాధిని ఇస్తున్నది. రూ.1028.78 కోట్ల పెట్టుబడితో 66 మధ్య తరహా పరిశ్రమలను నెలకొల్పగా 6,678 మందికి ఉపాధిని అందిస్తుంది. రూ.4,140 కోట్ల పెట్టుబడితో 83 భారీ తరహా పరిశ్రమలను నెలకొల్పగా 22,714 మందికి ఉపాధి లభిస్తున్నది. రూ.5768.77 కోట్ల పెట్టుబడితో 19 మెగా తయారీ తరహా పరిశ్రమలను నెలకొల్పగా 8,781 మందికి ఉపాధి లభిస్తుంది. రూ.32376 కోట్ల పెట్టుబడితో 69 మెగా – మౌలిక తరహా పరిశ్రమలను నెలకొల్పగా 4,48,187 మందికి ఉపాధి లభిస్తున్నది. మొత్తంగా జిల్లాలో రూ.45573.40 కోట్లతో 1211 యూనిట్లను నెలకొల్పగా 5,12,486 మంది యువత, నిరుద్యోగులకు ఉపాధిని అందిస్తున్నాయి.
గతేడాది 213 పరిశ్రమలు..
గతేడాది డిసెంబర్ 31వ తేదీ వరకు జిల్లాలో 213 పరిశ్రమలను తెలంగాణ ప్రభుత్వం, జిల్లా పరిశ్రమల కేంద్రం అనుమతితో ఔత్సాహికులైన పారిశ్రామిక వేత్తలు స్థాపించారు. ఈ సంస్థల ద్వారా 4,549 మంది యువత, స్థానికులకు ఉపాధి లభించింది. అయితే, సూక్ష్మ, చిన్న, మధ్య, పెద్ద తరహా, భారీ (మెగా) యూనిట్లు 204 ప్రారంభమయ్యాయి. కాగా, 204 యూనిట్ల ద్వారా 13,907 మందికి ఉద్యోగ భృతి లభించింది. జిల్లాలో మొత్తంగా 18,456 మందికి ఉపాధి మార్గాలు ఏర్పడ్డాయి. ఫార్మా కంపెనీలు, ఐటీ ప్రాజెక్టులు, ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థలు మరెన్నో జిల్లాకు మున్ముందు రానున్నాయని పలువురు పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నిపుణులు చెబుతున్నారు. రంగారెడ్డి జిల్లా భూములకు మరింత గిరాకీ పెరగనుందని పలువురు పేర్కొనడం గమనిస్తున్నాం.
జిల్లాకు దిగ్గజ కంపెనీలు..
జిల్లాలో ఇటీవల తైవాన్కు చెందిన ‘ఫాక్స్కాన్’ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు భూమిపూజ జరిగింది. రూ.4వేల కోట్ల పెట్టుబడితో ఈ సంస్థను నెలకొల్పుతున్నారు. కాగా, మొదటి దశలో 35వేల మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలను ఈ సంస్థ అందించనున్నది. అంతే కాకుండా 2 వేల కోట్లతో వెల్స్పన్ కంపెనీని చందనవెల్లిలో నెలకొల్పారు. వేలాది మందికి శిక్షణతో పాటు భృతిని అందిస్తున్నారు. కాగా, 2022లో తొమ్మిది ప్రముఖమైన, ప్రధాన సంస్థలు ఏర్పడ్డాయి. రూ.1400 కోట్ల పెట్టుబడితో ఈస్టర్ ఫిల్మ్ టెక్నాలజీ సంస్థ చందనవెల్లిలో ఏర్పడింది. రూ.625.87 కోట్ల పెట్టుబడితో మేధా సర్వో డ్రైవ్స్ కొండకల్లో నెలకొల్పారు. 50మందికి ఉపాధిని కల్పించింది. రూ.350కోట్ల పెట్టుబడితో చిరిపాల్ పాలీ ఫిల్మ్స్ లిమిటెడ్ కంపెనీ మంఖాన్లో ఏర్పాటు చేశారు. 75 మందికి ఉపాధిని అందించింది.
రూ.20కోట్ల పెట్టుబడితో రేడియెంట్ అప్లియెన్సెస్ సంస్థ రావిరాలలో ఏర్పడింది. 2800 మందికి ఉపాధిని కల్పించింది. రూ.304.13 కోట్ల పెట్టుబడితో అమెజాన్ డాటా సర్వీసెస్ సంస్థ చందన్వెల్లిలో ఏర్పడి, 34 మందికి ఉపాధిని అందించింది. రూ.214.50 కోట్ల పెట్టుబడితో ప్రిమియర్ ఎనర్జీస్ సంస్థ మహేశ్వరంలో ఏర్పడి, 100 మందికి ఉపాధిని అందించింది. రూ.214 కోట్లతో స్పిన్మ్యాక్స్ టైర్స్ సంస్థ కందువాడలో ఏర్పడి, 100 మందికి ఉపాధి మార్గాలను అందించింది. రూ.200 కోట్ల పెట్టుబడితో ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ సంస్థ పెంజెర్లలో ఏర్పడి, 200 మందికి ఉపాధిని అందించింది. కాగా, రూ.102 కోట్ల పెట్టుబడితో ఆర్పీఏ యూనిబేక్స్ కంపెనీ చిన్న ఎల్కిచెర్లలో ఏర్పడి, 1000 మందికి ఉపాధిని కల్పించింది. ఈ కంపెనీల ద్వారా జిల్లాలో మొత్తంగా 4,549 మందికి ఉపాధి అందింది. ఒక్క సంవత్సరంలోనే రంగారెడ్డి జిల్లా పారిశ్రామికంగా ముందుకు సాగుతుంది. ఇప్పటికే జిల్లా పరిశ్రమల ఏర్పాటుకు కేంద్రంగా నిలిచింది.
ఫాక్స్కాన్ లాంటి పరిశ్రమలు మరెన్నో..
తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధికి అడుగులు వేస్తున్నది. కొత్త కొత్త పరిశ్రమల ఏర్పాటుకు, ఉద్యోగ, ఉపాధి కల్పనకు తోడ్పాటును ఇస్తుంది. గతంతో పోల్చుకుంటే జిల్లా పారిశ్రామికంగా పురోగమనం దిశగా పయనిస్తున్నది. అధికార యంత్రాంగంతో పాటు ప్రభుత్వ యంత్రాంగం జిల్లా పరిశ్రమల కేంద్రం ఔత్సాహిక యూనిట్లకు ప్రోత్సాహాన్ని ఇస్తున్నాయి. జిల్లాలో కొత్త యూనిట్లు ప్రారంభమవుతూనే ఉన్నాయి. మరిన్ని ఆవిష్కరణలు రంగారెడ్డి జిల్లాలోనే నెలకొల్పనున్నారు. ఫాక్స్కాన్ లాంటి సంస్థలు మరెన్నో రానున్నాయి.
– రాజేశ్వర్రెడ్డి, జిల్లా పరిశ్రమల అధికారి, రంగారెడ్డి జిల్లా