నాడు కరెంట్ కోతలు, పవర్ హాలిడేస్తో సమైక్య పాలకులు పారిశ్రామిక రంగానికి పాతరేస్తే.. నేడు స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలో పరిశ్రమల జాతర కొనసాగుతున్నది. టీఎస్ఐపాస్తో పరిశ్రమల ఏర్పాటుకు కేవలం 15 రోజుల్లోనే అనుమతులివ్వడం, అవసరమైన మౌలిక వసతులు సమకూర్చడం, 24 గంటలూ నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తుండడంతో కార్పొరేట్ సంస్థలు, పెద్ద, పెద్ద కంపెనీలు తమ యూనిట్ల ఏర్పాటుకు క్యూ కడుతున్నాయి. తొమ్మిదేండ్లలో ఏర్పాటైన వేల పరిశ్రమలతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇండస్ట్రియల్హబ్గా అవతరించింది. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలు హైదరాబాద్ను ఆనుకొని ఉండడం, అనుకూలమైన వాతావరణం, మెరుగైన రవాణా సౌకర్యం ఉండడంతో ఎన్నో పరిశ్రమలు ఇక్కడ కొలువుదీరాయి. ఇప్పటివరకు రంగారెడ్డి జిల్లాకు 1252 పరిశ్రమల ఏర్పాటుతో రూ.47062.2 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 5,15,851 మందికి ఉపాధి లభించింది. అలాగే వికారాబాద్ జిల్లాలో టీఎస్ఐపాస్ ద్వారా రూ.1676 కోట్ల పెట్టుబడులు రాగా.. వేల మందికి ఉద్యోగావకాశాలు లభించాయి. దశాబ్ది వేడుకల్లో భాగంగా మంగళవారం పారిశ్రామిక ప్రగతి ఉత్సవం నిర్వహించనున్నారు.
వికారాబాద్ జిల్లాకు రూ.1676 కోట్ల పెట్టుబడులు..
వికారాబాద్ జిల్లాలో ఇప్పటికే శివారెడ్డిపేట్, రాకంచర్లలో పారిశ్రామిక కేంద్రాలుండగా, మరో రెండు పారిశ్రామిక కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. శివారెడ్డిపేట్ పారిశ్రామిక కేంద్రంలో ఇప్పటికే పరిశ్రమలను నెలకొల్పగా రాకంచర్ల పారిశ్రామిక కేంద్రంలో ఫార్మా రీసైక్లింగ్ పరిశ్రమలు, ఆయిల్ మిల్, పౌల్ట్రీ పరిశ్రమ, పన్నీర్, నెయ్యి తయారీ పరిశ్రమ, తోలు చర్మశుద్ధి పరిశ్రమల్లో ఫార్మా రీసైక్లింగ్ పరిశ్రమలు ఏర్పాటు కాగా, మిగతా పరిశ్రమల ఏర్పాటు ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది. త్వరలో జిల్లాలోని అర్కతల, జిన్గుర్తిలలో ఆహార ఇండస్ట్రియల్ పార్కులు అందుబాటులోకి రానున్నాయి. పరిశ్రమలకు నిరంతర విద్యుత్తు సరఫరా చేస్తుండడంతో పారిశ్రామికవేత్తలు ఉత్సాహం చూపుతున్నారు.
పరిశ్రమల ఏర్పాటుతో వికారాబాద్ జిల్లాలో ఇప్పటివరకు రూ.1676 కోట్ల పెట్టుబడులు పరిశ్రమల ఏర్పాటు నిమిత్తం పెట్టారు. ఇందులో సోలార్, పవన విద్యుత్తు పరిశ్రమల ఏర్పాటుతో రూ.1000 కోట్ల పెట్టుబడులు పెట్టగా, మిగతా చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుతో రూ.600 కోట్లకుపైగా పెట్టుబడులు వచ్చాయి. జిల్లాలో ప్రధానంగా పవర్, ఫార్మా రీసైక్లింగ్, ఐరన్, ప్లాస్టిక్, గ్లాస్, మైనింగ్, పర్యాటక రంగం, విత్తనోత్పత్తి పరిశ్రమలను ఏర్పాటు చేశారు. జిల్లాలో పవన విద్యుత్తు పరిశ్రమకు సంబంధించి ఇప్పటికే నజీరాబాద్ కేంద్రంగా పవన విద్యుత్ ఉత్పత్తి కేంద్రం కొనసాగుతుండగా, మరొక పవన విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. ప్రధానంగా జిల్లాలో సోలార్ పవర్ పరిశ్రమను మరింత అభివృద్ధి చేసే దిశగా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టారు.
మొబిలిటీ వ్యాలీతో మారనున్న జిల్లా ముఖచిత్రం..
రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో అతిపెద్ద ప్రాజెక్టు వికారాబాద్ జిల్లాలో ఏర్పాటు కానున్నది. మోమిన్పేట్ మండలం ఎన్కతలలో ఏర్పాటు చేసే మొబిలిటీ వ్యాలీ జిల్లాకు మణిహారంగా మారనున్నది. మొబిలిటీ వ్యాలీ ఏర్పాటుతో వెనుకబడిన వికారాబాద్ జిల్లాలో అభివృద్ధి పరుగులు పెట్టనున్నది. ప్రత్యేక వికారాబాద్ జిల్లాగా ఏర్పాటైన అనంతరం జిల్లాకు భారీ ప్రాజెక్టు రావడంపై జిల్లా ప్రజానీకం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలతోపాటు వాహనాల విడి భాగాల తయారీ యూనిట్లతో కూడిన మొబిలిటీ వ్యాలీ ప్రాజెక్టుతో జిల్లా రూపురేఖలు మారనున్నాయి. రానున్న ఐదేండ్లలో రూ.50 వేల కోట్ల పెట్టుబడులతోపాటు 4 లక్షల మందికి ఉద్యోగాలను కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నది. జిల్లా కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేయనున్న మొబిలిటీ వ్యాలీ ప్రాజెక్టుతో మోమిన్పేట్, నవాబుపేట మండలాలతోపాటు వికారాబాద్ జిల్లా కేంద్రం వరకు అభివృద్ధి విస్తరించనున్నది. మొబిలిటీ వ్యాలీ అందుబాటులోకి వచ్చినట్లయితే మరిన్ని పరిశ్రమలు చుట్టూ పక్కల వెలిసే అవకాశాలున్నాయి. 1200 ఎకరాల్లో ఏర్పాటు చేసే మొబిలిటీ వ్యాలీ ప్రాజెక్టుతో వికారాబాద్ జిల్లా కేంద్రంతోపాటు ముంబై జాతీయ రహదారికి వెళ్లే సదాశివపేట, జిల్లాలోని మర్పల్లి వరకు భవిష్యత్తులో అనేక ప్రాజెక్టులు వచ్చే అవకాశాలు మెండుగా ఉండడంతోపాటు వేల మంది నిరుద్యోగులకు ఉపాధి లభించనున్నది.
ఫుడ్ ఇండస్ట్రియల్ పార్కులు..
రైతుకు లాభాన్నందించడంతోపాటు రైతును రాజుగా చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. త్వరలో వికారాబాద్ జిల్లాలో రెండు ఫుడ్ ఇండస్ట్రియల్ పార్కులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందులో నవాబుపేట మండలం అర్కతలతోపాటు తాండూరు మండలం జిన్గుర్తిలో ఫుడ్ ఇండస్ట్రియల్ పార్కులు అందుబాటులోకి రానున్నాయి. తాండూరు మండలం జిన్గుర్తిలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు సంబంధించి భూసేకరణ ప్రక్రియ పూర్తికాగా, నవాబుపేట మండలం అర్కతలలో భూసేకరణ ప్రక్రియ పూర్తి కావడంతోపాటు సంబంధిత భూములను జిల్లా రెవెన్యూ యంత్రాంగం టీఎస్ఐఐసీకి అప్పగించింది. నవాబుపేట మండలం అర్కతలలోని సర్వే నంబర్లు 32, 12లోని 192 ఎకరాల భూముల్లో ఫుడ్ ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేసేలా వేగంగా అడుగులు పడుతున్నాయి.
టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో సంబంధిత భూమిని డెవలప్మెంట్ చేసే పనులు వేగంగా జరుగుతున్నాయి. ఐదారు నెలల్లో ఇండస్ట్రియల్ పార్కు అభివృద్ధితోపాటు అవసరమైన వసతులను టీఎస్ఐఐసీ అందుబాటులోకి తీసుకురానున్నది. జిల్లాలో ఇప్పటికే శివారెడ్డిపేటతోపాటు రాకంచర్లలో పారిశ్రామిక కేంద్రాలుండగా ఏడాదిలోగా మరో రెండు పారిశ్రామిక కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి. వికారాబాద్ మున్సిపాలిటీలోని శివారెడ్డిపేట ఇండస్ట్రియల్ పార్కులో అన్ని రకాల పరిశ్రమలుండగా, రాకంచర్ల పారిశ్రామిక కేంద్రంలో స్టీల్ పరిశ్రమలు మాత్రమే ఉన్నాయి. సంబంధిత ఆహార ఇండస్ట్రియల్ పార్కులో పూర్తిగా ఆహార ఉత్పత్తులకు సంబంధించిన పరిశ్రమలను ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలో ఏర్పాటు కానున్న ఆహార పార్కుల్లో ఆహార శుద్ధి కేంద్రాలతోపాటు రైస్, పప్పు, నూనె మిల్లులకు సంబంధించిన పరిశ్రమలను ఏర్పాటు చేయనున్నారు. ఆయా ప్రాంతాల్లో పండించే పంటలకు సంబంధించిన పరిశ్రమలను ఆహార పార్కులో ఏర్పాటు చేయనున్నారు. కొత్తగా ఏర్పాటుకానున్న ఆహార ఇండస్ట్రియల్ పార్కులకు సంబంధించిన పరిశ్రమలతో మరో 15-20 వేల మందికి ఉపాధి లభించనున్నది.
రంగారెడ్డిజిల్లా పరిశ్రమల ఖిల్లా..
పారిశ్రామిక రంగంలో విప్లవాత్మక మార్పు చోటుచేసుకోవడంతో రంగారెడ్డిజిల్లా పరిశ్రమల ఖిల్లాగా మారింది. హైదరాబాద్ మహా నగరానికి చేరువలో ఉండడం, పరిశ్రమల స్థాపనకు అనువైన వాతావరణం, రవాణా సౌకర్యం ఉండడంతో పారిశ్రామిక వేత్తలు ఆసక్తిని కనబర్చుతున్నారు. రూ.వేల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలను స్థాపించేందుకు పారిశ్రామికవేత్తలు ఉత్సాహంతో ముందుకొస్తున్నారు. తొమ్మిదేండ్లలో వందలాది పరిశ్రమలు ఏర్పాటు కాగా, లక్షలాది మందికి ఉపాధి లభించింది. పరిశ్రమలు స్థాపించేందుకు కావాల్సిన వివిధ అనుమతులను రాష్ట్ర పారిశ్రామిక అనుమతులు, స్వీయ ధ్రువీకరణ విధాన చట్టం 2014 ప్రకారం, నిర్దేశిత కాల పరిమితితో తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేస్తున్నది.
తొమ్మిదేండ్ల కింద జిల్లాలో పలు సూక్ష్మ, చిన్న, మధ్య, పెద్ద తరహా, భారీ (మెగా) యూనిట్లు మొత్తం 2,777 ప్రారంభించబడ్డాయి. 1988 (పెట్టుబడి – రూ.534.67 కోట్లు) సూక్ష్మ తరహా పరిశ్రమలు, 744 (పెట్టుబడి – రూ.1189.97 కోట్లు) చిన్న తరహా, 11 (పెట్టుబడి – రూ.586.52 కోట్లు) మధ్య తరహా, 32 (పెట్టుబడి – రూ.336.92 కోట్లు) పెద్ద తరహా, 2 (పెట్టుబడి – రూ.680.6 కోట్లు) భారీ తరహా పరిశ్రమలు స్థాపించబడ్డాయి. రాష్ట్రం ఏర్పడక ముందు రూ.3,328.68 కోట్ల పెట్టుబడితో 45,763 మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించారు.
తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక, 2014 నుంచి 2023 వరకు టీఎస్ ఐపాస్ ద్వారా పలు రకాల పరిశ్రమలు ఏర్పడ్డాయి. జిల్లాలో టీఎస్ ఐపాస్తో రూ.47,062.2 కోట్ల పెట్టుబడులతో 1,252 యూనిట్లను నెలకొల్పి 5,15,851 మందికి ఉపాధి లభించింది. రూ.274.07 కోట్ల వ్యయంతో 470 సూక్ష్మ తరహా యూనిట్లు ప్రారంభమయ్యాయి. 8538 మందికి ఉపాధిని కల్పించాయి. రూ.2069.81 కోట్ల వ్యయంతో 541 చిన్న తరహా యూనిట్లు ప్రారంభమయ్యాయి. 18609 మందికి ఉపాధి కల్పించాయి. రూ.1031.1 కోట్ల వ్యయంతో 67 మధ్య తరహా యూనిట్లు ప్రారంభమయ్యాయి. 6,688 మందికి ఉపాధిని కల్పించాయి. రూ.4140.45 కోట్ల వ్యయంతో 83 పెద్ద తరహా యూనిట్లు ప్రారంభమయ్యాయి. 22,714 మందికి ఉపాధిని కల్పించాయి. రూ.39546.77 కోట్ల వ్యయంతో 91 (మెగా) భారీ తరహా యూనిట్లు ప్రారంభమయ్యాయి. 4,59,302 మందికి ఉపాధిని కల్పించాయి. జిల్లాలో మొత్తంగా ప్రస్తుతం రూ.50,390.88 కోట్ల పెట్టుబడులతో 4029 యూనిట్లు నెలకొల్పడం వల్ల 5,61,614 మందికి ఉపాధి దొరికింది. 2014లో టీఎస్ ఐ-పాస్ ప్రవేశపెట్టిన తరువాత రూ.8,0217.08 కోట్లతో 1,715 పరిశ్రమలకు అనుమతులు మంజూరయ్యాయి. రాష్ట్రంలో 9,75,979 మందికి ఉపాధి అవకాశాలు ఏర్పడ్డాయి.
2014 నుంచి 2023 వరకు ఏర్పడిన పార్కులు..
జిల్లాలో 2014 నుంచి 2023 వరకు పలు పారిశ్రామిక పార్కులు వచ్చాయి. మంఖాల్లో 179.13 ఎకరాల్లో ప్లాస్టిక్ పార్కు, చందనవెల్లిలో 1454.03 ఎకరాల్లో పారిశ్రామిక పార్కు, 240 ఎకరాల్లో ఇబ్రహీంపట్నంలో పారిశ్రామిక పార్కు, ఇబ్రహీంపట్నంలో ఎంఎస్ఎంఈ పార్కు, 1140 ఎకరాల్లో సీతారాంపూర్ పారిశ్రామిక పార్కు, 195 ఎకరాల్లో నాగిరెడ్డిపల్లిలో పారిశ్రామిక పార్కు (వస్తున్నది), 19046.25 ఎకరాల్లో ఫార్మా సిటీ (వస్తున్నది), ఎలిమినేడులో 600 ఎకరాల్లో పారిశ్రామిక పార్కు, 314 ఎకరాల్లో సిద్ధాపూర్లో పారిశ్రామిక పార్కు, గచ్చిబౌలిలో పారిశ్రామిక పార్కు, హ్యూండాయ్ పార్కు ఇజ్జత్నగర్లో, మంచిరేవులలో ట్రేడ్ టవర్స్, ఐటీ పార్కు ల్యాంకో హిల్స్లో, దివ్యశ్రీ ఎన్ఎస్ఎల్ ఐటీ పార్కు రాయదుర్గ్, మణికొండలలో ఐటీ పార్కులు వచ్చాయి.
జిల్లాకు పరిశ్రమలు రావడానికి ఇవే కారణాలు..
పరిశ్రమల కేంద్రంగా జిల్లా..
పరిశ్రమల కేంద్రంగా రంగారెడ్డి జిల్లా మారింది. పారిశ్రామిక రంగంలో వినూత్న మార్పులు చోటుచేసుకున్నాయి. సీఎం కేసీఆర్ ప్రభుత్వం పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహాన్ని అందిస్తుండడంతో ఎన్నో కొత్త పరిశ్రమలు నెలకొల్పబడ్డాయి. పరిశ్రమల ఏర్పాటుకు జాప్యం లేకుండా టీఎస్ ఐ-పాస్తో వెంటనే అనుమతులు మంజూరు చేస్తున్నది. తొమ్మిదేండ్లలో రంగారెడ్డి జిల్లాలో రూ.47,062.2 కోట్ల నిధులతో 1,252 కొత్త యూనిట్లు స్థాపించబడ్డాయి. 5,15,851 మందికి ఉపాధి లభించి
– రాజేశ్వర్ రెడ్డి, జిల్లా పరిశ్రమల అధికారి, రంగారెడ్డి జిల్లా