నోరూరించే ఫిష్ వంటకాల పండుగకు నగరంలోని సరూర్నగర్ ఇండోర్స్టేడియంసిద్ధమవుతున్నది. ఈ నెల 8వ తేదీ నుంచి 10వ తేదీవరకు రంగారెడ్డి జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో ‘ఫిష్ ఫుడ్ ఫెస్టివల్’ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 20 స్టాళ్లలో 30 రకాల చేపల వంటకాలు అందుబాటులో ఉంచనున్నారు. ఫుడ్ ఫెస్టివల్లో ప్రధానంగా మహిళా సొసైటీలను భాగస్వామ్యం చేస్తూ వివిధ రకాల వంటకాలు తయారు చేసేలా ప్రోత్సహిస్తున్నారు. చేపలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, పలు రకాల చేపల వంటకాలపై ప్రజలకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ ఫెస్టివల్ను నిర్వహిస్తున్నారు.
-రంగారెడ్డి, మే 31(నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి, మే 31(నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ జంట నగరవాసులకు నోరూరించే ఫుడ్ ఫెస్టివల్ వస్తున్నది. పలు రకాల చేపల వంటకాలను రుచి చూడాలనుకునే ఫుడ్డీస్ కోసం ‘చేప వంటల ఉత్సవం’ జంట నగరాల్లో వేదిక కాబోతున్నది. పలు రకాల చేపల వంటకాలను ఈ వేదికపై వండి వడ్డించనున్నారు. కుంటలు, చెరువుల్లో దొరికే పరకల నుంచి సముద్రంలో లభించే పీతలు, సొర చేపల వరకు ఈ ఉత్సవంలోని స్టాల్స్లో పెట్టనున్నారు. రంగారెడ్డి జిల్లా మత్స్య శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ను నిర్వహిస్తున్నారు.
ఎల్బీ నగర్ పరిధిలో సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో మూడు రోజుల పాటు ఈ పండుగను నిర్వహించనున్నారు. స్టేడియం అంతటా మొత్తం 20 స్టాళ్లను ఏర్పాటు చేసి, “నోరూరించే చేపల వంటకాలు, సంప్రదాయక రుచులు, సీ ఫుడ్, ఎండు చేపలు, రెడీ టూ ఈట్ చేపలు”ను అందరికీ అందుబాటులో ఉంచనున్నారు. ఈ పండుగ ద్వారా ప్రజలకు చేపల వంటకాలపై అవగాహన పెంచడంతో పాటు ఆరోగ్యం కోసం ఏఏ చేపల ఆహారం తీసుకోవాలో ఆ విభాగానికి సంబంధించిన అధికారులు వివరిస్తారు. చేపల ఉత్పత్తులు, వినియోగంపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా అవగాహన కల్పించనున్నారు.
దశాబ్ది ఉత్సవాలు, మృగశిర కార్తె సందర్భంగా…
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు, మృగశిర కార్తె సందర్భంగా జిల్లా అధికారులు ప్రత్యేకంగా ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహణకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలోని 161 మత్స్య పారిశ్రామిక సహకార సొసైటీలు ఉండగా, ఇందులో 14 మహిళా సొసైటీలు ఉన్నాయి. ఫుడ్ ఫెస్టివల్లో ప్రధానంగా మహిళా సొసైటీలను భాగస్వామ్యం చేస్తూ వివిధ రకాల వంటకాలు తయారు చేసేలా ప్రోత్సహిస్తున్నారు. ఎవరైనా ప్రైవేటు వ్యక్తులు ఫెస్టివల్లో స్టాల్స్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తే అవకాశం కల్పించనున్నారు. మూడు రోజులు నోరూరించే ఫిష్ వంటకాలతో పాటు ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
వంటకాలు ఇవే..
చేపలు అనగానే చేపల ఫ్రై, చేపల పులుసు మాత్రమే గుర్తుకు వస్తాయి. చేపలతోని ఆ వంటకాలు మాత్రమే చేసుకోవచ్చనే అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాల్లో ఉన్నవాళ్లు రకరకాల వంటకాలను రుచి చూసినప్పటికీ ఇంకా తెలియని, కొత్త రుచులు సైతం స్టాల్స్ ద్వారా పరిచయం చేస్తున్నారు. ఫిష్ బిర్యాని, పీతల ఫ్రై, ఫిష్ అప్పడాలు, ఫిష్ కట్లెట్, చేపల పులుసు, ప్రాన్స్ ఫ్రై, ఫిష్ రోల్, ఫిష్ సమోసా, ఫిష్ ఫ్రై, ఫిష్ బర్గర్, ఫిష్ పకోడి, ఇలా ఏకంగా 20 నుంచి 30 రకాల నోరూరించే చేపల వంటకాలను జిల్లావాసులకు, ప్రధానంగా హైదరాబాద్ జంట నగరవాసులకు అందించనున్నారు. ఫిష్ ఫుడ్ ఫెస్టివల్లో భాగంగా చేపల రకాలు, ఆరోగ్యంపై కూడా అవగాహన కల్పిస్తారు. వలలు, ఊతలతో చేపట్టే విధానాన్ని ఈ వేదికపై ఆసక్తి గలవారికి చెబుతారు.
పండుగను విజయవంతం చేయండి..
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుంచి సీఎం కేసీఆర్ నేతృత్వంలో ‘మిషన్ కాకతీయ’తో కుంటలు, చెరువులన్నీ నిండాయి. తద్వారా నీలి విప్లవం అభివృద్ధి చెందింది. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు, మృగశిర కార్తె సందర్భంగా ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ను నిర్వహిస్తున్నాం. ఈ ఉత్సవంలో 20 వరకు స్టాల్స్ను ఏర్పాటు చేస్తున్నాం. జిల్లాలోని మహిళా మత్స్య శాఖ సహకార సొసైటీలను భాగస్వామ్యం చేస్తున్నాం. ప్రైవేట్ వ్యక్తులు ముందుకు వస్తే వారికీ స్టాల్స్ కేటాయిస్తాం.
– ఏ సుకీర్తి, జిల్లా మత్స్యశాఖ అధికారి, రంగారెడ్డి జిల్లా