ఇబ్రహీంపట్నం, ఆగస్టు 14 : రంగారెడ్డిజిల్లాలో 75వ స్వాతంత్య్ర దినోత్సవానికి సైబరాబాద్ కమిషనర్రేట్ పరిధిలోని గచ్చిబౌలి పరేడ్ గ్రౌండ్లో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వేడుకలను పురస్కరించుకుని జిల్లావ్యాప్తంగా ఇప్పటికే అధికారులు అనేక కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఇప్పటికే గ్రామగ్రామాన పండుగ వాతావరణం నెలకొంది. నేడు జరుపుకోనున్న స్వాతంత్య్ర దినోత్సవాన్ని గ్రామగ్రామాన పండుగలా నిర్వహించేందుకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై విద్యుత్ దీపాలను అలంకరించటంతోపాటు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తిచేశారు. జిల్లా నుంచి నిర్వహించనున్న వేడుకలకు మంత్రి సబితాఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జెండా ఆవిష్కరించనున్నారు.
* 10:10కి పోలీస్ కమిషనర్ సైబరాబాద్, కలెక్టర్, జిల్లా మెజిస్ట్రేట్ల ఆగమనం
* 10:15కు ముఖ్య అతిథిగా విద్యాశాఖమంత్రి సబితారెడ్డి ఆగమనం
* 10:30కి జాతీయ పతాకావిష్కరణ, * 10:35కు పోలీసుల గౌరవ వందనం
* 10:45కు మంత్రి సబితారెడ్డి సందేశం
* 11 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు
* 11:20కి శకటముల ప్రదర్శన
* 11:30కి స్వాతంత్య్ర సమరయోధుల సన్మాన కార్యక్రమం
* 11:45కు ఉత్తమ సేవా సర్టిఫికెట్ల ప్రదానం
* 12:15కు వివిధ శాఖల స్టాళ్లు సందర్శన, అసెట్స్ పంపిణీ
* 12:45కు వందన సమర్పణతో కార్యక్రమం ముగింపు
పరిగి, ఆగస్టు 14 : వికారాబాద్లోని ఎస్పీ కార్యాలయం పరేడ్ గ్రౌండ్ ప్రాంగణంలో సోమవారం స్వాతంత్య్ర దినోత్సవ నిర్వహణకు ఘనంగా ఏర్పాట్లు చేపట్టారు. సోమవారం ఉదయం 10.30కి వేడుకలు ప్రారంభమవుతాయి. 10.30కి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ టి.పద్మారావు జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు. 10.35కు పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తారు. 10.40 కి పద్మారావు సందేశం ఇస్తారు. 10.50కి సాంస్కృతిక కార్యక్రమాలు, 11.20కి జిల్లా ఉత్తమ సేవా అవార్డుల ప్రదానం, 11.40 గంటలకు వివిధ శాఖల స్టాళ్ల సందర్శన ఉంటుంది. ఈ కార్యక్రమంలో జిల్లాలోని ఎమ్మెల్సీ, జిల్లా పరిషత్ చైర్పర్సన్, ఎమ్మెల్యేలు, కలెక్టర్, వివిధ శాఖలకు చెందిన జిల్లాస్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొననున్నారు.