రంగారెడ్డి, జూన్ 20 (నమస్తే తెలంగాణ) : సర్వమత సౌరభమైన ఉమ్మడి జిల్లా ఆధ్యాత్మిక ఖిల్లాగా వెలుగొందుతున్నది. తెలంగాణ ప్రభుత్వం ఆలయాలు, మసీదులు, చర్చిల అభివృద్ధికి చర్యలు తీసుకుంటుండడంతో జిల్లా ఆధ్యాత్మిక వైభవాన్ని సంతరించుకున్నది. భక్తుల కోసం సకల సౌకర్యాలు కల్పించింది. ఆలయాలకు పునరుజ్జీవం కల్పించేందుకు ధూప, దీప నైవేద్య పథకాన్ని అమలు చేస్తున్నది. దీని కింద ప్రతి నెలా చెల్లిస్తున్న రూ.6వేలను.. రూ.10 వేలకు పెంచింది. రంగారెడ్డి జిల్లాలో 66 ఆలయాలు, వికారాబాద్ జిల్లాలో 63 ఆలయాలకు ధూప, దీప, నైవేద్య సాయం అందుతున్నది. అర్చకుల గౌరవ వేతనాన్ని రూ.2500 నుంచి రూ.5వేలకు పెంచింది. అంతేకా కుండా గౌరవ వేతనం అందుకునేందుకు వయోపరిమితిని 75 సంవత్సరాల నుంచి 65 ఏండ్లకు తగ్గించింది.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రార్థనా మందిరాలకు మంచి రోజులు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషితో మందిరాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్నది. గత తొమ్మిదేండ్లలో ఆలయాలు, మసీదులు, చర్చిల అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన కృషితో రాష్ట్ర ప్రభుత్వం సర్వమత సర్కారుగా పేరొందింది. ప్రధానంగా సమైక్య రాష్ట్రంలో పూర్తిగా నిరాదరణకు గురైన ఆలయాలకు ప్రభుత్వం పునర్వైభవం తీసుకువచ్చింది. గతంలో మాదిరిగా కాకుండా ఆదాయంలేని ఆలయాలకు ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. స్వతహాగా ఆధ్యాత్మికపరుడైన ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర దేవాదాయ శాఖపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. ఆలయాల అభివృద్ధి, ధూప దీప నైవేద్యం వంటి వినూత్న పథకాలను అమలులోకి తేవడంతో దేవాదాయ ధర్మాదాయ శాఖలో నవశకం ఆరంభమైంది. ఆలయాల అభివృద్ధికి ‘ప్రసాద్’ పథకం కింద కేంద్రం నిధులిచ్చే అవకాశం ఉన్నప్పటికీ మొండిచెయ్యి చూపుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వమే నిధులు కేటాయిస్తున్నది. ఆలయాలు, మసీదులు, చర్చిల మరమ్మతులకు నిధులు కేటాయించడమే కాకుండా సర్వ మతాల కోసం అనేక కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నది.
ఆలయాల్లో ధూప, దీప, నైవేద్య పథకం
ప్రతి ఆలయంలో దీపం వెలగాలనే సంకల్పంతో ధూప దీప నైవేద్య పథకానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. ఆదాయం లేని ఆలయాలకు 2015 జనవరి 9 నుంచి ప్రతి నెలా రూ.6వేల చొప్పున ప్రభుత్వం అందజేస్తూ వస్తున్నది. ఇందులో రూ.2వేలను ధూప దీప నైవేద్యాలకు, మిగిలిన రూ.4వేలను అర్చకులకు అందజేస్తున్నది. తాజాగా.. ఈ మొత్తాన్ని రూ.10వేలకు పెంచుతూ సీఎం కేసీఆర్ ఇటీవలనే ప్రకటించారు. అర్చకుల గౌరవ వేతనంగా రూ.5వేలు, నిత్య పూజల నిమిత్తం రూ.5వేలను నిర్ణయించింది. ఇప్పటివరకు 75 ఏండ్లు ఉన్నవారికే ఈ గౌరవ వేతనం వర్తించేది. ఇప్పుడు వయోపరిమితిని 65 ఏండ్లకు తగ్గించారు. గతంలో వేద పాఠశాలలకు స్థాయిని బట్టి రూ.50వేలు, రూ.75వేలు, రూ.లక్ష చొప్పున ప్రభుత్వం ఇచ్చేది. ఇప్పుడు ప్రతి వేద పాఠశాలకు ఏటా రూ.2లక్షలను ప్రభుత్వం ఇవ్వనున్నది. అలాగే ఆలయాల వద్ద దుకాణాలను ఏర్పాటు చేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం బ్రాహ్మణ ఎంపవర్మెంట్ స్కీం కింద గరిష్ఠంగా రూ.5లక్షల గ్రాంటును అందజేస్తున్నది. దీనివల్ల అనేక మంది బ్రాహ్మణులకు ఉపాధి లభిస్తున్నది. బ్రాహ్మణ పిల్లలు చదువుకునేందుకు విద్యా రుణాలను కూడా ఇస్తున్నది.
పండుగలకు కానుకలు
సర్వమత ప్రభుత్వంగా పేరొందిన బీఆర్ఎస్ సర్కారు ఆలయాలతోపాటు మసీదులు, చర్చిల అభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిస్తూ వస్తున్నది. పేద ముస్లింలు, క్రైస్తవులకు రంజాన్, క్రిస్మస్ సందర్భంగా కానుకలను అందజేస్తున్నది. మహిళలకు చీర, జాకెట్, పురుషులకు షర్ట్, ప్యాంట్, పిల్లలకు కుర్తా, పైజామాతో కూడిన గిఫ్ట్ ప్యాక్లను ప్రభుత్వం ప్రతి రంజాన్ పండుగకు ముందు అందజేస్తున్నది. అంతేకాకుండా ముస్లింలకు ఇఫ్తార్ విందును కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఇఫ్తార్ విందు నిమిత్తం ఒక్కొక్కరికి రూ.200 చొప్పున ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది. క్రిస్మస్ పండుగకు క్రైస్తవ మహిళలకు చీర, జాకెట్, మగవాళ్లకు ప్యాంట్, షర్ట్, ఆడపిల్లలకు పంజాబీ డ్రెస్తో కూడిన గిఫ్ట్ ప్యాక్లను ప్రభుత్వం ప్రతి ఏటా అందజేస్తున్నది. వికారాబాద్ జిల్లాలోని 63 ఆలయాలు, రంగారెడ్డి జిల్లాలోని 66 ఆలయాలకు ప్రతి నెలా ప్రతినెలా రూ.10వేల చొప్పున రూ.12.90 లక్షలను ఖర్చు చేస్తున్నది.
మైసిగండి ఆలయ అభివృద్ధికి రూ.2.46 కోట్లు
రంగారెడ్డి జిల్లాలో మైసిగండి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పించి రూ.2.46కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ నిధులతో ఆలయ పరిసరాల్లో భక్తులకు అవసరమైన సౌకర్యాలు, సదుపాయాలను ప్రభుత్వం కల్పించనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలతో విహార యాత్రలకు బదులు ఆధ్యాత్మిక యాత్రలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో 602 వరకు మసీదులు, 200లకు పైగా చర్చిలు ఉండగా వాటి మరమ్మతులకు కూడా ప్రభుత్వం నిధులు అందించింది. ఇమామ్లకు నెలకు రూ.5వేల వేతనాన్ని అందజేస్తున్నది.
బీఆర్ఎస్ పాలనలో ఆలయాల అభివృద్ధి ; అనీల్కుమార్ పంతులు, చిలుకూరు, మొయినాబాద్
బీఆర్ఎస్ ప్రభుత్వం బ్రాహ్మణ వ్యవస్థ బలోపేతానికి అన్ని విధాలుగా కృషి చేస్తున్నది. సీఎం కేసీఆర్ ఆలయాలను అభివృద్ధి చేశారు. యాదగిరి గుట్టను తెలంగాణ తిరుపతిగా మార్చారు. ఆలయాల ఆదాయం పెరిగేలా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. దేశంలో ఎక్కడా లేనివిధంగా హైదరాబాద్లో బ్రాహ్మణ భవనాన్ని నిర్మించడం చారిత్రాత్మకమైన విషయమని చెప్పవచ్చు. అర్చకుల్లో మనోధైర్యం పెంచేలా ప్రభుత్వ నిర్ణయాలున్నాయి. ఆలయాల పునర్నిర్మాణానికి సర్కారు కృషి చేస్తున్నది.
సీఎం కేసీఆర్ హయాంలో వెల్లివిరుస్తున్న ఆధ్యాత్మికత..
దేవాలయాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారు. ధూప,దీప నైవేద్య పథకాన్ని అంచలంచెలుగా వృద్ధి చేస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏడాదికి రూ.200 కోట్ల నుంచి రూ.250 కోట్ల వరకు ఆలయాల్లో పని చేస్తున్న అర్చకులు, ఇతర ఉద్యోగుల జీత భత్యాల కోసం వెచ్చించడం గొప్ప విషయం. ధూప, దీప నైవేద్యం పథకం కింద ఆలయాలకు ఇచ్చే రూ.6 వేల సాయాన్ని రూ.10 వేలకు పెంచడం హర్షణీయం. సీఎం కేసీఆర్ హయాంలోనే ఆధ్యాత్మికత వెల్లివిరుస్తున్నది. అందుకు నిలువెత్తు నిదర్శనం యాదాద్రి ఆలయ పునర్నిర్మాణమే. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఆలయాలను పునరుద్ధరిస్తున్నారు.
-రంగరాజన్, చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు, మొయినాబాద్