మహిళల ఆర్థిక అభ్యున్నతే లక్ష్యంగా సర్కార్ ముందుకెళ్తున్నది. అందుకోసం ఏటా సంఘాలవారీగా, వ్యక్తిగతంగా వడ్డీ లేని, స్వల్ప వడ్డీకే రుణాలను అందించి స్వయం ఉపాధి కల్పిస్తున్నది. ఈ ఆర్థిక సంవత్సరంలో మరింతమందికి తోడ్పాటునందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఎస్హెచ్జీల రుణ పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. ఒక్కొక్క స్వయం సహాయక సంఘానికి గరిష్ఠంగా రూ.20లక్షల వరకు రుణం మంజూరు చేయనున్నది. పనితీరును బట్టి వీలైనంత ఎక్కువ సంఘాలకు అధిక మొత్తంలో రుణాలు అందించనున్నది. రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 1000 ఎస్హెచ్జీలు గరిష్ఠ రుణాలను పొందేందుకు అర్హత సాధించినట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు తెలిపారు. మిగతా సంఘాలకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు రుణం ఇవ్వనున్నారు. ఈసారి జిల్లాలో బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి పథకం కింద రూ.750 కోట్ల రుణాలను అందించడమే లక్ష్యంగా అధికారులు ముందుకు సాగుతున్నారు. జిల్లాలో మొత్తం 19,157 స్వయం సహాయక సంఘాలు ఉండగా 2,17,417 మంది సభ్యులు ఉన్నారు.
రంగారెడ్డి, ఏప్రిల్ 21, (నమస్తే తెలంగాణ): మహిళా స్వయం సహాయక సంఘాలను(ఎస్హెచ్జీ) మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. సంఘాల వారీగా కాకుండా వ్యక్తిగతంగా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వడ్డీలేని రుణాలతోపాటు స్వల్పకాలిక వడ్డీతో కూడిన రుణాలనూ అందిస్తున్నది. అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని పలు ఎస్హెచ్జీలకు రుణ పరిమితిని పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏడాదికి గరిష్ఠంగా రూ.20లక్షల మేర రుణాలను మం జూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. జిల్లాలోని 1000 స్వయం సహాయక సంఘాలు గరిష్ఠంగా రూ.20లక్షల మేర రుణాలు పొందేందుకు అర్హత సాధించినట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు తెలిపారు. జిల్లాలో 19,157 ఎస్హెచ్జీలుండగా వెయ్యిసంఘాలకు రూ.20 లక్ష ల మేర రుణాలు, మిగతా సంఘాలకు రూ.10 లక్షలు, రూ.5 లక్షల మేర రుణాలను మంజూరు చేయనున్నది. ఇందుకు బ్యాంకర్లు కూడా ముం దుకొచ్చాయి. అయితే ఎస్హెచ్జీ సభ్యులు అధికంగా కిరాణా షాపులు, గేదెలు, గొర్రెలు, మేకల కొనుగోలుకు, కూరగాయల వ్యాపారం చేసుకునేందుకు రుణాలను తీసుకుంటున్నారు. కాగా గత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి పథకం కింద లక్ష్యానికి మించి వారికి రుణాలను మంజూరు చేశారు. అదేవిధంగా ఎప్పటికప్పుడు రుణాలను చెల్లించి తిరిగి పొందుతున్న స్వయం సహాయక సంఘాలకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు అధిక ప్రాధాన్యమిస్తున్నారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో స్వయం సహాయక సంఘాలకు గతేడాదికి మించి రుణాలను మం జూరు చేయాలని అధికారులు నిర్ణయించారు. అయితే ఈ ఏడాది జిల్లాలోని ఎస్హెచ్జీలకు బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి పథకంలో భాగంగా మంజూరు చేసే రుణాలను గతేడాదితో పోలిస్తే రూ.100 కోట్లకుపైగా పెంచాలని, వాటి లక్ష్యాన్ని రూ.750 కోట్లుగా పెట్టుకున్నారు. బ్యాంకు లిం కేజీ కింద రూ.600 కోట్లు, స్త్రీనిధి కింద రూ. 150 కోట్ల రుణాలను మంజూరు చేయాలని నిర్ణయించారు. అయితే ఈ ఏడాది కొత్త స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు కావడంతోపాటు ఎస్హెచ్జీ మహిళల కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన దృష్ట్యా ఈ ఏడాది రుణాల లక్ష్యాన్ని పెంచాలని నిర్ణయించారు. గతేడాది బ్యాంకు లింకేజీ కింద రూ.562 కోట్లు, స్త్రీనిధి పథకం కింద రూ.100 కోట్లను మంజూరు చేయాలని నిర్ణయించుకున్న జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు లక్ష్యానికి మిం చి రుణాలను అందించారు. బ్యాంకు లింకేజీ కింద రూ.562 కోట్లను లక్ష్యంగా నిర్దేశించుకోగా 103.64 శాతం మంజూరు చేశారు. జిల్లాలోని 12,114 ఎస్హెచ్జీలకు రూ.582 కోట్ల రుణాలను అందించారు. గతేడాది బ్యాంకు లింకేజీ కింద మహేశ్వరం మండలాన్ని మినహాయిస్తే మిగతా అన్ని మండలాల్లో వంద శాతానికి మిం చి రుణాలను మంజూరు చేశారు.
అదేవిధంగా నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్హెచ్జీలకు వాటి కార్యకలాపాలను కొనసాగించేందుకు తొలుత రూ.60 వేల గ్రాంటును జాతీయ జీవనోపాధి పథకం ద్వారా మంజూరు చేసిన ప్రభుత్వం, ఈ ఆర్థిక సంవత్సరం నుంచి రుణ పరిమితిని పెంచనున్నది. జిల్లాలో 19,157 ఎస్హెచ్జీలుండగా 2,17,417 మంది సభ్యులున్నారు, వీరిలో 2,752 స్వయం సహాయక సంఘాలు కొత్తగా ఏర్పాటుకాగా 29,450 మంది సభ్యులున్నారు.
కాగా జిల్లాలో మొండికేసిన ఎస్హెచ్జీలు 408 ఉన్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు గుర్తించారు. అత్యధికంగా షాబాద్ మండలంలో 102 సంఘాలుండగా, కందుకూరు మండలంలో 50, యాచారం, మొయినాబాద్ మండలాల్లో 41సంఘాలు రుణాలను తిరిగి చెల్లించడంలో మొండికేసినట్లు రూ.2.98 కోట్ల బకాయిలున్నట్లు అధికారులు తేల్చారు. అత్యధికంగా షాబాద్ మండలంలో రూ.1.07 కోట్లు, కందుకూరు మండలంలో రూ. 52.82 లక్షల బకాయిలు వసూలు కావాల్సి ఉందన్నారు.