బియ్యం ధరలు పిరమైనయ్.. సామాన్యులు కొనలేని, తినలేని పరిస్థితి నెలకొంటున్నది. మార్కెట్లో డిమాండ్ను ఆసరాగా చేసుకుని వ్యాపారులు బ్లాక్ చేస్తుండడంతో ఒక్కసారిగా బియ్యం ధరలకు రెక్కలొచ్చాయి. వారం రోజుల్లోనే క్వింటాల్ బియ్యంపై రూ.700 నుంచి రూ.1000 వరకు పెరుగడంతో సామాన్యులు ఆందోళనకు గురవుతున్నారు. ఇక్కడ పండించిన వరి ధాన్యాన్ని మిల్లర్లు, దళారులు నేరుగా రైతుల వద్ద కొనుగోలు చేస్తూ బియ్యంగా మార్చి ఇతర రాష్ర్టాలకు తరలిస్తున్నారు. ఎన్నడూలేని విధంగా బియ్యం ధరలు ఉడుకుతుండడంతో నిరుపేదలు పస్తులుండే దుస్థితి వస్తున్నది.
రంగారెడ్డి జిల్లాలో సన్నాల సాగు తగ్గడం..మిగ్జాం తుఫాన్ వల్ల పంటలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. దీనికితోడు వ్యాపారులు, మిల్లర్లు ధాన్యాన్ని మిల్లింగ్ స్టాక్ చేసి పెట్టుకోవడంతో పాటు బ్రాండ్లుగా ముద్రించి ప్రైవేటు దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. మున్ముందు ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉండడంతో నిరుపేదలు బెంబేలెత్తుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుని సామాన్యులకు అందుబాటులో బియ్యం ధరలు ఉండేలా చూడాలని జిల్లావాసులు కోరుతున్నారు.
– రంగారెడ్డి, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ)
బియ్యం ధరలు పెరుగడంతో సామాన్యులకు మోయలేని భారమవుతున్నది. ఎన్నడూ లేని విధంగా సన్న బియ్యం ధరలు పెరిగాయి. వానకాలం సీజన్లో పండించిన క్వింటాలు వరి ధాన్యం ధర రూ.3 వేల నుంచి రూ.3,500 వరకు పలుకుతున్నది. ఇదే అదునుగా వ్యాపారులు మార్కెట్లో కొత్త రకం బియ్యం క్వింటాలు రూ.4,500 నుంచి రూ.5 వేలు, పాత రకం బియ్యం రూ.5,500 నుంచి రూ.6 వేల వరకు అమ్ముతున్నారు. ధరలను నియంత్రించకుంటే పేదలు పస్తులుండే పరిస్థితి వస్తుంది. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
-రామకృష్ణ, కడ్తాల్ మండలం
రంగారెడ్డి, డిసెంబర్ 17(నమస్తే తెలంగాణ): బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలకు రెక్కలొచ్చాయి. వారంలోనే క్వింటాల్పై రూ.700 నుంచి రూ.1000 వరకు పెరుగడం సామాన్యులను ఆందోళనకు గురి చేస్తున్నది. రానున్న రోజుల్లో మరింతగా పెరిగే అవకాశం ఉండడం ప్రజానీకంలో గుబులు పుట్టిస్తున్నది. మార్కెట్లో డిమాండ్ను ఆసరాగా చేసుకుని బియ్యా న్ని బ్లాక్ చేస్తూ వ్యాపారులు పెద్ద ఎత్తున దండుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బియ్యం ధరలను సామాన్య ప్రజానీకానికి అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని జిల్లావాసులు కోరుతున్నారు.
ఇక్కడ పండించిన సన్నాలను ఇతర రాష్ర్టాలకు తరలిస్తుండడం, మిల్లర్లు, దళారులు నేరుగా రైతుల వద్ద సన్న వడ్లను కొని బియ్యంగా మార్చి నిల్వ చేస్తున్నా రు. మార్కెట్లో డిమాండ్ను ఆసరాగా చేసుకుని బియ్యం వ్యాపారులు ఇష్టారీతిన ధరలు పెంచుతున్నారన్న విమర్శలున్నాయి. ప్రస్తుత మార్కెట్లో వివిధ రకాలకు చెందిన పాత బియ్యం రూ.6,400 వరకు ధర పలుకుతుండగా.. కొత్త బియ్యం క్వింటాలుకు రూ.5,400 వరకు ఉన్నది. గతేడాది పాత బియ్యం ధర రూ.4,400 నుంచి రూ.4,800 వరకు ఉండగా.. ప్రస్తుతం ధర రూ.వెయ్యి వరకు పెరిగింది. మునుపెన్నడూ లేని విధంగా ధరలు పెరుగడంతో సామాన్యులు బియ్యం కొనలేని పరిస్థితి నెలకొంది. ఇక నిరుపేదలు కడుపునిండా తినలేక పస్తులుండే దుస్థితి తలెత్తింది. సన్న వడ్లకు మార్కెట్లో మంచి ధర పలుకుతుండడంతో రైతుల్లో మాత్రం హర్షం వ్యక్తమవుతున్నది.
రానున్న రోజుల్లో సన్న బియ్యం ధరలు మరింత పెరిగే అవకాశం లేకపోలేదని వ్యాపారులు పేర్కొంటున్నారు. రైతులు విక్రయించిన సన్న రకాల ధాన్యాన్ని మిల్లర్లు స్టాక్ చేసి పెట్టుకున్నారు. దీంతో ధరలు వ్యాపారుల నియంత్రణలోనే ఉం డనున్నాయి. బియ్యం అమ్మకాలన్నీ ఇప్పుడు బ్రాండ్పైనే సాగుతున్నాయి. రైతులు పండించే ధాన్యాన్ని మిల్లింగ్ చేసి రకరకాల పేర్లతో మా ర్కెట్లో విక్రయిస్తున్నారు. కొందరు పెద్ద మిల్లర్లు రైతుల నుంచి సన్నాలు కొని మిల్లింగ్ చేశాక బ్రాం డ్లు ముద్రించి ప్రైవేట్ దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. సన్న బియ్యం స్టాక్ అంతా వ్యాపారుల గుప్పిట్లోనే ఉండడంతో వచ్చే రోజుల్లో బియ్యం ధరలు మరింతగా పెరుగనున్నాయి. జిల్లాలో సన్నాల సాగు తగ్గడం..మిగ్జాం తుఫాన్తో వరి పంటలు దెబ్బతినడం ఒక కారణమైతే వ్యాపారులు బియ్యాన్ని బయటి రాష్ర్టాలకు తరలించడం మరో కారణమని పలువురు పేర్కొంటున్నారు.
సామాన్యుడు సన్న బియ్యం కొనలేని విధంగా ధరలు అమాంతంగా పెరిగాయి. గత 20 రోజుల కిందట సన్న బియ్యం క్వింటాల్కు రూ.5వేలు ఉంటే ఇప్పుడు రూ. ఆరు నుంచి రూ. ఏడు వేలకు పెరుగడంతో సామాన్యుడు కొనలేని పరిస్థితి నెలకొన్నది. ప్రభుత్వం సన్నబియ్యం ధరలను అదుపు చేస్తేనే సామాన్యులకు మేలు. -ఇమ్రాన్ , సింగప్ప గూడ గ్రామం, చేవెళ్ల, మండలం