నవాబుపేట, మే 26 : మండల పరిధిలోని ఏక్మామిడి సమీపంలో నిర్మిస్తున్న కల్వర్టు పనులు అసంపూర్తిగా ఉన్నాయి. దీంతో ప్రమాదం పొంచి ఉంది. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని వాహనదారులు, రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏక్మామిడి బంగారు మైసమ్మ ఆలయం నుంచి నవాబుపేట వరకు బీటీ రోడ్డు నిర్మించారు. అయితే కల్వర్టు పనులు పూర్తికాలేదు. ఈ మార్గంలో వెళ్లే వాహనదారులు నరకయాతన పడుతున్నారు. భయం భయంగా ప్రయాణం చేస్తున్నారు. కల్వర్టుపై మట్టి వేసి ఎలాంటి మరమ్మతులు చేపట్టలేదు.
ఈ ప్రధాన రోడ్డుపై నుంచే నిత్యం మైనింగ్ బండ్లు, శంకర్పల్లికి, మండలంలోని వివిధ గ్రామాలకు వెళ్లే బస్సులు, కూరగాయల బండ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇంత ప్రమాదం పొంచి ఉన్న సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. రోడ్డు నిర్మాణానికి కావాల్సిన మెటీరియల్ సిద్ధంగా ఉన్నా పనులు ఎందుకు పూర్తి చేయడం లేదని పలువురు వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. కల్వర్టుకు ఇరువైపులా దిమ్మెలు ఏర్పాటు చేసి వాటి చుట్టూ మట్టి పోసి అసంపూర్తిగా వదిలివేశారు. వర్షాకాలంలో కల్వర్టు వద్ద రోడ్డు వర్షం నీటికి కొట్టుకుపోయి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. నిత్యం వందల సంఖ్యలో వాహనాలు తిరుగుతుంటాయి. ఎలాంటి ప్రమాదాలు జరుగకముందే మరమ్మతులు చేపట్టేలా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.