మొయినాబాద్, మార్చి 22 : గత ఏడాది శుభకృత్ నామ సంవత్సరం శుభాన్ని అందించిందని.. ఈ ఏడాది శోభకృత్ నామ సంవత్సరంతో అంతా శోభాయమానమేని చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు సీఎస్ రంగరాజన్ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం చిలుకూరు ఆలయం గర్భగుడి ఎదుట మండపంలో స్వామివారి ఉత్సవ విగ్రహాలను నెలకొల్పి ప్రత్యేక పూజలు చేశారు. నూతన పంచాంగాన్ని స్వామివారి సన్నిధిలో పఠనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది అందరి జీవితాలు ప్రకాశవంతంగా ఉంటాయని పేర్కొన్నారు. వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని.. వాగులు, వంకలు, నదులు, జలపాతాలు ఉప్పొంగి ప్రవహిస్తాయని తెలిపారు. పంటలు బాగా పండుతాయని చెప్పారు. శోభకృత్ నామ సంవత్సరం విశేష అనుగ్రహమిచ్చే సంవత్సరంగా పేర్కొన్నారు.
ఆలయ బ్రహ్మోత్సవాల కరపత్రం ఆవిష్కరణ
చిలుకూరు బాలాజీ ఆలయ బ్రహ్మోత్సవాలకు సంబంధించిన కరపత్రాలనుస్వామి సన్నిధిలో ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. పంచాంగ పఠనం అనంతరం మాజీ ఎంపీటీసీ గుండు గోపాల్తో కలిసి ఆలయ అర్చకులు కరపత్రాలను ఆవిష్కరించారు. మార్చి 31 నుంచి ఏప్రిల్ 7 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు అర్చకుడు రంగరాజన్ తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ కన్వీనర్ గోపాలకృష్ణ, అర్చకులు పాల్గొన్నారు.
ఘనంగా ఉగాది ఉత్సవాలు
ఉగాది పర్వదిన వేడుకలను గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. గ్రామాల్లోని హనుమాన్ ఆలయాల్లో నూతన పంచాంగ పఠనం చేశారు. ఏడాది పాటు ఎలా ఉంటుందో పండితులు చెప్పారు. ప్రజలు ఎంతో ఆసక్తితో విన్నారు. మండల పరిధిలోని సురంగల్, కనకమామిడి గ్రామాల్లో ఎడ్ల బండ్లను అలంకరించి ప్రజల కేరింతల మధ్య ఊరేగింపు నిర్వహించారు.