కందుకూరు, సెప్టెంబర్ 25 : ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా రాష్ట్రం అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమని, సీఎంగా కేసీఆర్ అవ్వడం ఖాయమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. సోమవారం మండలంలో విస్తృతంగా పర్యటించారు. ఉదయం 10 గంటలకు సరస్వతిగూడలో అభివృద్ధి పనులను ప్రారంభించి అక్కడి నుంచి లేమూరు, అగర్మియాగూడ, తిమ్మాపూర్, జబ్బారుగూడ, కొలనుగూడ, రాచులూరు, గుమ్మడవెల్లి, బైరాగిగూడ తదితర గ్రామాల్లో రాత్రి వరకు రూ.12 కోట్లతో 64 అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
ఉదయం నుంచి రాత్రి వరకు విరామం లేకుండా మండలంలో పర్యటించారు. మంత్రికి ఆయా గ్రామాల్లో ప్రజలు పటాకులు కాలుస్తూ పూల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో మంత్రి మాట్లాడుతూ.. ప్రతిపక్ష నాయకులు అధికారం కోసం ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారన్నారు. తెలంగాణ పల్లెలకు జాతీయ స్థాయిలో అవార్డులు రావడం సీఎం కేసీఆర్ వల్లేనని చెప్పారు. 9 సంవత్సరాల కిందట పల్లెలు ఏ విధంగా ఉన్నాయి.. ఇప్పడు ఏ విధంగా ఉన్నాయని ప్రశ్నించారు.
ప్రతి ఇంటికి తాగునీరు ఇవ్వకపోతే ఓట్లు అడగబోనని చెప్పిన సీఎం కేసీఆర్ ప్రతి ఇంటికి తాగునీరు ఇస్తున్నట్లు చెప్పారు. వేసవి కాలం వచ్చిందంటే మహిళలు రోడ్డుపైకి ఎక్కి ఆందోళనలు చేశారని, ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా అని ప్రశ్నించారు. రూ.200 ఉన్న పింఛన్ను రూ.2016 చేసిన ప్రభుత్వం కావాలా వద్దా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ చేసిన పథకాలు చెప్పుకుంటూపోతే ఎన్నో ఉన్నాయన్నారు.
ప్రజలకు ఇంత మంచి పాలనను ఇప్పటివరకు ఎవ్వరూ అందించలేదని తెలిపారు. తిరిగి బీఆర్ఎస్ను అధికారంలోకి తెచ్చుకోవాలని కోరారు. చేసిన అభివృద్ధిని వివరిస్తుంటే ప్రతిపక్షాలకు మింగుడు పడడం లేదన్నారు. ఇన్ని ప్రజా ప్రయోజన కార్యక్రమాలు దేశంలో ఉన్న ఏ ఒక్క బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో అమలు కావడం లేదని తెలిపారు. దేశానికి నేడు తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తున్నదని వివరించారు. ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు వస్తుందని.. ఎవ్వరూ ఆందోళన పడవద్దని మంత్రి తెలిపారు.
కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, ఎంపీపీ జ్యోతి, జడ్పీటీసీ జంగారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్రెడ్డి, ఎంపీటీసీల ఫోరం కన్వీనర్ రాజశేఖర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ చంద్రశేఖర్, వైస్ చైర్మన్ విజేందర్రెడ్డి, సీనియర్ నాయకులు, మాజీ ఎంపీపీ శోభ, మాజీ సర్పంచ్ భిక్షపతి ఉన్నారు.