వికారాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ) : కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో ఈదఫా కూడా వికారాబాద్ జిల్లాకు అన్యాయమే జరిగింది. జిల్లాతోపాటు ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలకు సాగు నీరందించే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతోపాటు వికారాబాద్ వరకు ఎంఎంటీఎస్ పొడిగింపు, కృష్ణా లైన్కు నిధుల మంజూరు విషయం, పలు అండర్ పాస్ బ్రిడ్జిల నిర్మాణాల విషయమై జిల్లాకు నిరాశే ఎదురైంది. రాష్ట్ర ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ప్రకటించాలని కేంద్రాన్ని కోరింది. బడ్జెట్లో జాతీయ హోదా ప్రస్తావనే లేదు, ప్రాజెక్టు నిర్వహణకుగాను నిధులు మంజూరు చేయాలని కేంద్రాన్ని పలు మార్లు కోరినప్పటికీ ప్రస్తావనేలేదు. వికారాబాద్ వరకు ఎంఎంటీఎస్ పొడిగింపు అంశం కొన్నేండ్లుగా జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నప్పటికీ బడ్జెట్లో నిరాశే మిగిలింది.
చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి సంబంధిత శాఖ మంత్రిని కలిసి పలుమార్లు విన్నవించినా ఫలితం దక్కలేదు. ఎప్పటినుంచో పెండింగ్లో ఉన్న పరిగి-మక్తల్ మీదుగా కృష్ణా లైన్కు సంబంధించి అనుమతులిచ్చినప్పటికీ ఈ బడ్జెట్లోనూ మోదీ ప్రభుత్వం మొండి చెయ్యే చూపింది. జిల్లాలో పలు అండర్పాస్ బ్రిడ్జిల నిర్మాణానికీ కేంద్రం నిధులు మంజూరు చేయకపోవడంతో జిల్లావాసులను నిరాశపర్చింది. తాండూరు రైల్వే స్టేషన్ సుందరీకరించాలని, పల్నాడు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ను తాండూరు వరకు పొడిగించాలని ఎంపీ రంజిత్రెడ్డి పలుమార్లు కేంద్ర ప్రభుత్వాన్ని కోరినా.. బడ్జెట్లో ప్రస్తావించకపోవడంపై స్థానికంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.