షాబాద్, డిసెంబర్ 9 : మార్కెట్లో చికెన్ ధరలు రోజురోజుకూ పడిపోతున్నాయి. వారం రోజుల క్రితం వరకు అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో ధరలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం కార్తికమాసం ఉండడంతో ప్రజలు చికెన్ తినడానికి ఎక్కువగా ఆసక్తి చూపడంలేదు. చికెన్ ధరలు సగం తగ్గాయి. రంగారెడ్డిజిల్లాలో ప్రస్తుతం కిలో చికెన్ ధర విత్ స్కిన్ రూ.138 ఉండగా, స్కిన్లెస్ ధర 157కి పడిపోయింది.
ఇంకా ధరలు తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. రెండు, మూడు నెలల క్రితం కిలో చికెన్ ధరలు రూ.250 నుంచి రూ.300 వరకు ఉండేది. కిలో చికెన్ కొందామనుకునేవారు అరకిలోతో సరిపెట్టుకున్నారు. నవంబర్ నెలలో ఎన్నికలు ఉండడంతో చికెన్కు భలే గిరాకీ ఉండేది. రూ.200లకు పైగానే విక్రయించారు.
గడిచిన నాలుగు నెలల్లో కిలో చికెన్ ధర చేరుకున్న కనిష్ట ధర ఇదే కావడం విశేషం. పౌల్ట్రీఫారాల వద్ద కోళ్లు భారీగా ఉండడంతో చికెన్ కేంద్రాలకు కోళ్ల కొరత లేకుండా పోయింది. ఎక్కువ రోజులు కోళ్లను ఫారాల్లో పెంచితే వాటికి మేత ఖర్చుతో పాటు ఆనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంది. దీంతో తక్కువ ధరలకే రైతులు కోళ్లను వ్యాపారులకు విక్రయిస్తున్నారు. దీంతో మార్కెట్లో డిమాండ్ తగ్గి, భారీగా కోళ్లు రావడంతో ఆటోమేటిక్గా ధర తగ్గుతుంది. ప్రస్తుతం మార్కెట్లో ఇలాంటి పరిస్థితే నెలకొంది. ఒకవైపు చలి తీవ్రత ఎక్కువ.. మరోవైపు తుఫాన్ వర్షాల నేపథ్యంలో చికెన్ ధరలు పూర్తిగా తగ్గుముఖం పడుతున్నాయి. డిసెంబర్ నెల మొత్తం ధరలు ఇలానే ఉండనున్నాయి. కొత్త ఏడాది జనవరిలో సంక్రాంతి పండుగకు చికెన్ ధరలు పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.
ప్రస్తుతం చికెన్ వ్యాపారం బాగా తగ్గింది. కార్తికమాసం ఉండడంతో ప్రజలు చికెన్ తినేందుకు ఆసక్తి చూపడంలేదు. ప్రస్తుతం కిలో చికెన్ ధర రూ.157 పలుకుతున్నది. గత నెలలో ఎన్నికలు ఉండడంతో చికెన్ ధర కిలోకు రూ.200లకు పైగా పలకడంతో వ్యాపారం బాగానే నడిచింది. ప్రస్తుతం పౌల్ట్రీఫారాల్లో కోళ్లు అనుకున్న స్థాయి కంటే ఎక్కువగా ఉండడంతో ఎక్కువ రోజులు ఉంచకుండా రైతులు కోళ్లను అమ్మేస్తున్నారు. దీంతో చికెన్ ధరలు క్రమంగా తగ్గిపోతున్నాయి. ఈ నెల చివరి వారంలో లేదా, జనవరి మొదటి వారం వరకు మళ్లీ చికెన్ ధరలు పెరిగే అవకాశం ఉంది.
– ఎండీ అజారుద్దీన్, చికెన్ వ్యాపారి, షాబాద్