వికారాబాద్, మే 25 : ‘అమ్మ ఆదర్శ పాఠశాల’లో భాగంగా స్కూళ్లలో చేపట్టిన మౌలిక వసతుల కల్పనను వేగవంతం చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. వికారాబాద్ మండల పరిధిలోని కొంపల్లి, రామయ్య గూడ, కొటాలగూడ, కామారెడ్డి గూడ ప్రాథమిక పాఠశాలల్లో జరుగుతున్న పనులను శనివారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం మహిళా సంఘాలపై ఉన్న నమ్మకంతో పాఠశాలల్లో వసతుల కల్పన బాధ్యతలు అప్పగించిందన్నారు. పనులను అంచనాల మేరకు కొన్ని నిధులను ముందుగానే చెల్లించినట్లు తెలిపారు. ఈ నిధులను సద్వినియోగం చేసుకొని నాణ్యతా ప్రమాణాలతో పనులు చేపట్టాలన్నారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అత్యవసరమైన పనులను గుర్తించి వెంటనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. మొదటి ప్రాధన్యతగా తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు, తరగతి గదులకు తలుపులు, కిటికీలు, గోడల పగుళ్ల వంటి వాటికి మరమ్మతులు చేయాలన్నారు.
పనులను సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. పనుల వంటి వాటిని చేపట్టి తీర్చిదిద్దాలని కలెక్టర్ తెలిపారు. కొటాలగూడ పాఠశాలలో పనులు చాలా బాగా జరుగుతున్నాయని అక్కడి వారిని అభినందించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో సుధీర్, మున్సిపల్ కమిషనర్ జకీర్ అహ్మద్, ఎంపీడీవో వినయ్ కుమార్, మండల విద్యాధికారి బాబుసింగ్, ఏపీవో నాగరాజు, కొంపల్లి హెచ్ఎం వెంకట్రెడ్డి, కామారెడ్డి హెచ్ఎం మౌనిక, కొటాలగూడ హెచ్ఎం వెంకట్రెడ్డి పాల్గొన్నారు.