వికారాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ) : రైతన్నకు పండుగ అంటే.. పంటలు బాగా పండాలి, దిగుబడి బాగా రావాలి, దేశానికి అన్నం పెట్టాలి, ప్రజల కడుపు నిండాలి, అలాంటి రైతులు బాగుండేలా.. వాళ్ల మోముపై చిరునవ్వు చిందేలా.. వాళ్ల జీవితాల్లో వెలుగులు నిండేలా.. తెలంగాణలో వ్యవసాయమే పండుగైంది. ఇదీ బీఆర్ఎస్ సర్కారు సాధించిన అసలుసిసలైన ఘనత. దుక్కి దున్నింది మొదలు పంట కొనుగోలు దాకా అనేక సంక్షేమ పథకాలకు తెలంగాణ కేరాఫ్గా నిలుస్తున్నది. మరే రాష్ట్రంలోనూ లేనివిధంగా రైతు సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తున్నది. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రైతు ప్రభుత్వంగా పేరు తెచ్చుకున్నది. ఈ ఎనిమిదేండ్ల పాలనలో రైతుల సంక్షేమాన్ని దృష్టి లో పెట్టుకొని ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమ లు చేస్త్తూ వస్తున్నది.
అధికారంలోకి వచ్చిన వెంటనే..
బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు ఇచ్చిన హామీ మేరకు వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ను సరఫరా చేసింది. రెండేండ్లలోనే విద్యుత్ రంగంలో నవశకం మొదలైందనేలా వ్యవసాయానికి ఉచిత 24 గంటల నాణ్యమైన కరెంటు సరఫరాను అమల్లోకి తీసుకొచ్చింది. అలాగే రూ.లక్ష రుణమాఫీని చేసింది. మరోసారి రూ.లక్ష రుణమాఫీలో భాగంగా రూ.50 వేల రుణాలను ఇప్పటికే మాఫీ చేయగా, మిగతా రుణాలను మాఫీ చేసేందుకు కసరత్తు చేస్తున్నది. మరోవైపు రైతులు అప్పుల ఊబిలో చిక్కుకోకుండా పంటలను సాగు చేసేందుకు పెట్టుబడి సాయం అందించేందుకు రైతుబంధు పథకాన్ని అమలు చేస్తున్నది. అలాగే రైతు ఆత్మహత్యలను నివారించేందుకు కారణం ఏదైనా సరే రైతు చనిపోతే ఆ కుటుంబం రోడ్డుపై పడకుండా వారికి రైతుబీమా ద్వారా రూ.5లక్షల పరిహారాన్ని అందిస్తున్నది. రైతు బీమా పథకాన్ని అమలు చేస్తూ మృతి చెందిన రైతు కుటుంబాలకు సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారు.
4,262 మంది రైతులకు బీమా సహాయం..
జిల్లాలో ఐదేండ్లలో 4,262 మంది రైతు కుటుంబాలకు రూ.213,10 కోట్లు బీమా రూపంలో అందించింది. రైతుబీమాకు సంబంధించిన ప్రీమియం కూడా రైతుల తరఫున ప్రభుత్వమే చెల్లిస్తున్నది. అయితే మృతి చెందిన రైతు కుటుంబ సభ్యులకు తొలుత రూ.5 లక్షల బీమా డబ్బును బాండ్ల రూపంలో అందజేసిన ప్రభుత్వం తదనంతరం నేరుగా సంబంధిత రైతు కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తూ వచ్చింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 786 మంది రైతు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.39.30 కోట్లు, 2019-20లో 812 మందికి రూ.40.60 కోట్లు, 2020-21లో 1,201 కుటుంబాలకు రూ.60.05 కోట్లు, 2021-22లో 1047 కుటుంబాలకు రూ.52.35 కోట్లు, 2022-23లో 416 మంది రైతులు మృతి చెందగా సంబంధిత రైతు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.20.80 కోట్ల బీమా సహాయాన్ని నేరుగా సంబంధిత రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. అలాగే రైతుబీమా పథకంలో భాగంగా బీమా సంస్థలకు రైతులు చెల్లించాల్సిన ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తున్నది. జిల్లా వ్యాప్తంగా సుమారు 3 లక్షల మంది రైతులు ఉన్నారు. వీరిలో 2 లక్షల మంది రైతులు రైతు బీమా కు అర్హులుగా జిల్లా వ్యవసాయ శాఖ యంత్రాంగం గుర్తించింది. అయితే రెండేండ్ల క్రితం ఒక్కో రైతుకు రూ.3,013 చొప్పున రూ.50 కోట్ల ప్రీమియం కూడా రాష్ట్ర ప్రభుత్వం బీమా సంస్థకు చెల్లించింది. ఈ ఏడాది ప్రీమియం పెరిగిన దృష్ట్యా… ఒక్కో రైతుకు రూ.3,486లు చొప్పున రూ.65 కోట్ల ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వం బీమా సంస్థకు చెల్లించింది.
కుటుంబాన్ని ఆదుకున్నది..
కొడంగల్ : సీఎం కేసీఆర్ ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు పథకం రైతు కుటుంబాలను ఆదుకొని ఆర్థికంగా భరోసాను కల్పిస్తున్నది. మండలంలోని చిన్ననందిగామకు చెందిన రైతు నర్సప్ప గతేడాది మృతి చెందారు. ఆయనకు మూడెకరాల పొలం ఉంది. ఆయన భార్య లక్ష్మమ్మతో పాటు కూతురు నర్సమ్మ ఉన్నారు. నర్సప్ప మృతితో రైతు కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయి ఎలా బతకాలోనని ఆందోళనకు గురైంది. తెలంగాణ ప్రభుత్వం రైతు నర్సప్ప మృతితో కుటుంబానికి రూ.5లక్షల రైతుబీమాను అందించింది. వచ్చిన పరిహారంతో పొలాన్ని చదును చేసుకోవడంతో పాటు ఉన్న అప్పులను తీర్చుకున్నామని లక్ష్మమ్మ తెలిపారు. ప్రస్తుతం ఉన్న మూడెకరాల పొలంలో పత్తి పంటను సాగు చేస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం అందించిన ఆర్థికసాయంతో ఎలాంటి ఇబ్బందుల్లేకుండా కాలం గడుపుతున్నామన్నారు.
టెంట్ హౌస్ పెట్టుకొని జీవనం సాగిస్తున్నా..
మా నాన్న పట్లొళ్ల బల్వంత్రెడ్డి. మాకు 4 ఎకరాల భూమి ఉంది. మా నాన్న చనిపోవడంతో ప్రభుత్వం అందించిన రూ.5లక్షల రైతుబీమా పరిహారం అందింది. ఈ డబ్బుతో వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని కొత్తగడిలో టెంట్ హౌస్ పెట్టుకొని జీవనం సాగిస్తున్నా. కుటుంబానికి ప్రధాన ఆధారంగా మారడంతో ఆర్థికంగా స్థిరపడుతున్నా. మరొకరికి ఉపాధి కల్పిస్తున్నా. రైతు బీమా కుటుంబానికి ఆసరాగా నిలిచింది. – అనంత్రెడ్డి, కొత్తగడి, వికారాబాద్