రంగారెడ్డి, మార్చి 3 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఉన్న అనేక చెరువులు, కుంటలను అక్రమార్కులు మింగేస్తున్నారు. చెరువుల్లోకి నీరొచ్చే కాల్వలు.. చెరువు నుంచి అలుగు పారే కాల్వలనూ ఎక్కడికక్కడ కబ్జా చేసి.. వాటిని ప్లాట్లుగా చేసి కోట్లు గడిస్తున్నారు. కబ్జాలను అరికట్టాల్సిన ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారనే ఆరోపణలున్నాయి. రియల్ఎస్టేట్ వ్యాపారులతో కుమ్మక్కై చెరువులు, కుం టలు అన్యాక్రాంతమవుతున్నా పట్టించుకోవడంలేదని మండిపడుతున్నారు. గండిపేట, సరూర్నగర్, హయత్నగర్, బాలాపూర్, అబ్దుల్లాపూర్మెట్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, శంషాబాద్, రాజేంద్రనగర్, మొయినాబాద్, యాచారం, మంచాల వంటి మండలాల్లో రియల్ఎస్టేట్ వ్యాపారులు అధికార పార్టీ నాయకుల అండదండలతో యథేచ్ఛగా కబ్జాలు చేస్తున్నారు. దీంతో తాతల కాలం నుంచి ఉన్న గొలుసుకట్టు చెరువుల కాల్వలు కబ్జాలకు గురవుతున్నాయి. ఇప్పటికే జిల్లా పరిధిలోని అనేక చెరువులు, కుంటలకు సంబంధించి బఫర్జోన్, ఎఫ్టీఎల్లు సైతం కబ్జాచేసి భవనాలను నిర్మిస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు చెరువుల నుంచి వచ్చిన వరదనీరు బయటికి వెళ్లలేక ఇండ్లలోకి చేరి పలు కాలనీలు నీటిలో మునిగిపోయినా అధికారులు మాత్రం స్పందించి చర్యలు తీసుకోవడంలేదని ప్రజలు ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు. కాగా, జిల్లాలో గత నిజాం కాలంలో నిర్మించిన అనేక ప్రసిద్ధి చెంది న కాల్వలున్నాయి. ఇవి కిలోమీటర్ల పొడవు విస్తరించి ఉన్నాయి. ఇటీవల ఈ కాల్వలను సైతం కబ్జా చేస్తున్నారు.
ఫిరంగి నాలా..
జిల్లాలో ప్రధానమైన కాల్వల్లో ఫిరంగినాలా ఒకటి. ఈ కాల్వ షాబాద్, రాజేంద్రనగర్, శంషాబాద్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం మండలాల మీదుగా ఇబ్రహీంపట్నం పెద్దచెరువు వరకు 18 కిలోమీటర్లు విస్తరించి ఉన్నది. గత కొన్నేండ్ల వరకు వర్షాకాలానికి ముందు అధికారులు మరమ్మతులు చేసేవారు. ఇటీవల ఈ కాల్వ అనేక ప్రాంతాల్లో కబ్జాలకు గురైంది. రియల్ఎస్టేట్ వ్యాపారులు తమ వెంచర్లలో దానిని కలుపుకొన్నారు. ముఖ్యంగా ఈ కాల్వపైనే నిర్మాణాలు ఏర్పాటు కావడంతో వర్షపు నీరు చెరువుల్లోకి వెళ్లడంలేదు. ఫిరంగినాలా కాల్వ కబ్జా అవుతు న్నా అధికారులు మాత్రం పట్టించుకోవటం లేదని ప్రజలు మండిపడుతున్నారు.
కాల్వపై అక్రమంగా కల్వర్టు..
మహేశ్వరం మండలంలోని రావిర్యా ల పెద్దచెరువు నుంచి అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని ఇందిరాసాగర్ వరకు పులిందర్వాగు కాల్వ ఉన్నది. దీనిని 60 మీటర్ల వెడల్పుతో గతంలో నిర్మించా రు. ఈ కాల్వ రావిర్యాల, ఆదిబట్ల, మంగల్పల్లి, పటేల్గూడ, పోచారం, శేరిగూడ, రాందాస్పల్లి, ఇబ్రహీంపట్నం గ్రామాల మీదుగా ఇందిరాసాగర్లో కలుస్తుంది. ఈ కాల్వను రియల్ఎస్టేట్ వ్యాపారులు ఎక్కడికక్కడ ధ్వంసం చేసి.. కాల్వపై కల్వర్టులను అక్రమంగా నిర్మించి ప్లాట్లుగా వేసినా అధికారులు మాత్రం స్పందించడంలేదు.
పెద్దచెరువు కాల్వను పూడ్చి ప్రహరీ నిర్మాణం
ఇబ్రహీంపట్నం పెద్దచెరువు నుంచి అలుగుపారే ప్రధాన కాల్వ కూడా ఎక్కడిక్కడ కబ్జా అవుతున్నది. ఈ కాల్వను ఇటీవలే శేరిగూడ సమీపంలో కొత్తగా ఏర్పాటు చేసినా ఓ వెంచర్ నిర్వాహకులు ఆ కాల్వను పూడ్చి ప్రహరీ నిర్మిస్తున్నారు. కాల్వకు అతి సమీపంలోనే గోడ నిర్మించడంతో చెరువు అలుగుపారే నీరు బయటికెళ్లకుండా నిలిచిపోయే అవకాశముంది. ఈ కాల్వపై రియల్ఎస్టేట్ వ్యాపారులు అనేకచోట్ల కల్వర్టులు నిర్మించి కనుమరుగు చేస్తున్నారు. అలాగే, హయత్నగర్, సరూర్నగర్, బాలాపూర్, ఇబ్రహీంపట్నం, గండిపేట, మొయినాబాద్, మహేశ్వరం తదితర మండలాల్లోనూ కాల్వలు కబ్జాలకు గురవుతున్నాయి. హయత్నగర్ మండలంలోని ఇంజాపూర్ సమీపంలో ఓ రియల్ఎస్టేట్ వ్యాపార సంస్థ ఏకంగా మాసాబ్చెరువు కాల్వను పూడ్చేసి వర్షపునీరు బయటికి వెళ్లకుండా చేయడంతో ఇటీవల కురిసిన వర్షాలకు ఆపిల్ ఎవెన్యూ కాలనీ పూర్తిగా నీట మునిగింది. అలాగే, నాదర్గుల్ సమీపంలోనూ ఓ రియల్ఎస్టేట్ సంస్థ యాజమాన్యం కాల్వను పూడ్చేసి అడ్డుకట్ట వేస్తున్నది.
పెద్దవాగును ధ్వంసం చేసి ప్లాట్లుగా..
ఇబ్రహీంపట్నం చెరువుకు వచ్చే పెద్దవాగు సైతం పలుచోట్ల ఆక్రమణలకు గురవుతున్నది. ఈ వాగును రియల్ఎస్టేట్ వ్యాపారులు ధ్వంసం చేసి ప్లాట్లుగా మారుస్తున్నారు. అలాగే, తుర్కయాంజాల్ సమీపంలోని మాసాబ్చెరువు అలుగు కాల్వ కూడా అనేక చోట్ల కబ్జాలకు గురైంది. మాసాబ్చెరువు నుంచి ఇంజాపూర్, తొర్రూరు, మజీద్పూర్, లష్కర్గూడ, ఇనాంగూడ తదితర గ్రామాల నుంచి అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని బాతులచెరువు వరకు విస్తరించి ఉన్నది. ఈ కాల్వనూ కబ్జాదారులు వదల్లేదు.