వికారాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ) : అమలుకు నోచుకోని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. మున్సిపల్ ఎన్నికల్లోనూ అధికార దర్పం, ప్రలోభాలతో వాటిని ఛేజిక్కించుకున్నది. వికారాబాద్ను టూరిజం హబ్గా తీర్చిదిద్దుతామని, తాండూరు మున్సిపాలిటీకి రూ.వెయ్యి కోట్ల నిధులు, పరిగికి సాగునీరు తీసుకొస్తామని సాక్షాత్తు సీఎం వచ్చి పరిగిలో బహిరంగ సభ పెట్టి హామీలిచ్చినా ఓటర్లు మాత్రం ఆ పార్టీని తిరస్కరించారు. జిల్లాలోని కొడంగల్ మున్సిపాలిటీని మినహాయిస్తే.. పరిగి మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడగా, వికారాబాద్ మున్సిపాలిటీలో కనీసం మ్యాజిక్ ఫిగర్ చేరుకోలేకపోవడం, తాండూరులో మ్యా జిక్ ఫిగర్కు కావాల్సిన స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
గత ఎన్నికల్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాలుగు మున్సిపాలిటీలను క్లీన్స్వీప్ చేసి కైవసం చేసుకోగా.. కాంగ్రెస్ పార్టీ నామినేషన్ల ప్రక్రియ మొదలు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వరకు అడుగడుగనా ప్రలోభాలతోపాటు అధికారాన్ని అడ్డం పెట్టుకొని దౌర్జన్యంగా వ్యవహరించిందనే ఆరోపణలున్నాయి. సోమవారం జరిగిన కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం, చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక విషయంలోనూ కాంగ్రెస్పై విమర్శలు వెల్లువెత్తాయి. పరిగి మున్సిపాలిటీ వద్ద ఉదయం నుంచే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిగి మున్సిపాలిటీలో బీఆర్ఎస్, కాంగ్రెస్ సమానంగా కౌన్సిలర్ స్థానాలను గెలవడంతో హంగ్ ఏర్పడగా, స్వతంత్ర అభ్యర్థులను ప్రలోభపెట్టి కుట్రపూరితంగా పరిగి మున్సిపల్ చైర్మన్ పదవిని రేవంత్ సర్కార్ హస్తగతం చేసుకుందనే ఆరోపణలున్నాయి.
కాగా, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులకు వైస్ చైర్మన్ పదవి ఇస్తామంటూ ప్రలోభపెట్టి ఒకరికిచ్చి, మరొకరికి మోసం చేయడంతో బాధిత ఒకటో వార్డు కౌన్సిలర్ అక్కమ్మ మున్సిపల్ కార్యాలయం, ఠాణా ఎదుట ధర్నా చేసి స్థానిక ఎమ్మె ల్యే, కాంగ్రెస్ పార్టీపై దుమ్మెత్తిపోయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చానీయాంశంగా మారింది. మరోవైపు తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డితోపాటు బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులను నిరసిస్తూ ప్రమాణ స్వీకారనంతరం బీఆర్ఎస్ కౌన్సిలర్లు దీపానర్సింహులు, ఇర్షాద్, సురేశ్నాయక్, జావెద్, నవీనాసంతోష్గౌడ్, సుప్రితాకరుణాకర్, అనిల్కుమార్, నాగలక్ష్మి తదితరులు వాకౌట్ చేశారు.
ఈసందర్భంగా తాండూరు మున్సిపల్ ఎన్నికల ఇన్ చార్జి శ్రీశైల్రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులు ఎన్నికల్లో అధికార దుర్వినియోగా నికి పాల్పడ్డారని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డిపై పోలీసులు అక్రమ కేసులు బనాయించడంపై మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు పోలింగ్తోపాటు కౌంటింగ్ సమ యంలో ఎన్నికల నిబంధలను ఉల్లంఘించినా పోలీసులకు కనిపించలేదా..? ప్రశ్నించారు. మరోవైపు వికారాబాద్, తాండూరు మున్సిపాలిటీల్లో గెలుపొందిన బీజెపీ కౌన్సిలర్లు ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరుకాలేరు.
వికారాబాద్ మున్సిపాలిటీలో ఆదిలోనే కాంగ్రెస్ పార్టీ కొత్త పాలకవర్గంలో లుకలుకలు మొదలయ్యాయి. మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని ఆశించినా దక్కకపోవడంతో ఆ పార్టీ కౌన్సిలర్ చిగుళ్లపల్లి రమేశ్ అలకబూనినట్టు సమాచారం. ఆదివారం రాత్రి కౌన్సిలర్లతో చర్చించిన అనంతరం స్పీకర్ తనకు మాటి చ్చి వైస్ చైర్మన్గా సుధాకర్రెడ్డిని ఎన్నుకోవడంతో రమేశ్ తన సన్నిహితులు, స్థానిక కాంగ్రెస్ నాయకుల వద్ద అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రమాణ స్వీకారం పూర్తైన వెంటనే స్పీకర్ లోపల ఉండగానే అతడు కార్యక్రమం నుంచి నిరుత్సాహంతో బయటికెళ్లిపోయినట్లు సమాచారం.
వికారాబాద్ మున్సిపాలిటీ వద్ద పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం, చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియకొచ్చిన కాంగ్రెస్ కౌన్సిలర్లు, నాయకులకు కాన్వాయ్తో మున్సిపల్ కార్యాలయానికి తీసుకెళ్లిన పోలీసులు…బీఆర్ఎస్ కౌన్సిలర్లపై ఆంక్షలు పెట్టడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా బీఆర్ఎస్ కౌన్సిలర్ల వాహనాలను అర కిలోమీటర్ దూరంలోనే నిలిపి వేయించడం, సెల్ఫోన్లు తీసుకెళ్లొద్దని చెప్పడంతోపాటు తనిఖీలు చేయడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది.
కా న్వాయ్లో కాంగ్రెస్ కౌన్సిలర్లతోపాటు నాయకులు వెళ్లినా పట్టించుకోని పోలీసులు.. తమ కౌన్సిలర్లపై ఆంక్షలు విధించడమేంటని బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా మీడియా ప్రతినిధులనూ లోపలికి అనుమతించకపోవడంతో దాదాపు 3 గంటలపాటు ప్రధాన ద్వారం వద్దే నిరీక్షించాల్సి వచ్చింది. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ షురూ అయినప్పటి నుంచే పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారనే ప్రచారం జరుగుతున్నది.
పరిగి మున్సిపాలిటీలోని ఒకటో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన అక్కమ్మకు కాంగ్రెస్ అన్యాయం చేసింది. పరిగి మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడగా స్వతంత్ర అభ్యర్థుల మద్దతు కోసం వైస్ చైర్మన్ పోస్టును ఎరేసింది. కాగా, స్వతంత్ర అభ్యర్థి అక్కమ్మ గెలిచి న వెంటనే బీఆర్ఎస్కు మద్దతు తెలపగా.. పోలీసులను అడ్డం పెట్టుకొని అక్కమ్మ కుమారుడితో కిడ్నాప్ కేసు పెట్టించి.. ఆపై ఆమెకు వైస్ చైర్మన్ పదవి ఇస్తామంటూ కాంగ్రెస్కు మద్దతిచ్చేలా తిప్పుకొన్నారు.
వైస్ చైర్మన్గా అక్కమ్మను కాకుండా మరో స్వతంత్ర అభ్యర్థిని ఎన్నుకోవడంతో ఖంగుతిన్న ఆమె మున్సిపల్ కార్యాలయం బయట కాంగ్రెస్ చేసిన మోసంపై దుమ్మెత్తిపోసింది. వైస్ చైర్మన్ పదవి ఇస్తామంటూ పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి పేరిట బాండ్ పేపర్ రాసిచ్చి, మోసం చేయడంపై అక్కమ్మతోపాటు కుటుంబీకు లు, మద్దతుదారులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. అన్యాయం జరిగిందని బాండ్ పేపర్ను మీడియాకు చూపిస్తూ ధర్నా చేస్తున్న అక్కమ్మ కుటుంబీకులు, మద్దతుదారులపై లాఠీచార్జీ చేయడంపై పోలీసులతోపాటు స్థానిక ఎమ్మెల్యేపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.