ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం పెద్దచెరువులో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన వరుణార్చనహోమం వైభవంగా ముగిసింది. ఉదయం 6:30 ప్రారంభమై సాయంత్రం 5గంటలకు పూర్ణాహుతితో ముగిసింది. శ్రీశైలం దేవస్థానంకు చెందిన 30మంది పండితులతో పూజ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సబితాఇంద్రారెడ్డి, జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, షాద్నగర్ ఎమ్మెల్యే జైపాల్యాదవ్తో పాటు నియోజకవర్గంకు చెందిన ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్పర్సన్లు, కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, సహకారసంఘాల అధ్యక్షుడు, రైతుబంధు సమితి సభ్యులు, పలువురు నాయకులు, కార్యకర్తలు, ఆయాశాఖల అధికారులు హాజరయ్యారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి దంపతులు, ఆయన కుమారుడు ప్రశాంత్కుమార్రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు.
అనంతరం 108 కలశాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే, హోమానికి ముందు కార్తీకమాసం కావడం వలన శివలింగానికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. హాజరైన నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు అభిషేకం నిర్వహించే విధంగా శివలింగాన్ని ఏర్పాటు చేశారు. శ్రీశైలం దేవస్థానం నుంచి విచ్చేసిన బ్రాహ్మణులు, వేద పండితుల చేత ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. ఈ ప్రాంతంలో వర్షాలు సమృద్ధిగా కురిసి, ఈ ప్రాంతం సస్యశ్యామలంగా మారడంతో పాటు ఎన్నో ఏళ్లుగా ఎండిపోయిన ఇబ్రహీంపట్నం పెద్దచెరువు కూడా నిండటంతో ఈ వరుణార్చన హోమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. 11సంవత్సరాల క్రితం ఇదే ప్రాంతంలో ఆయన వర్షాల కోసం ప్రత్యేక వరుణయాగాన్ని నిర్వహించారు. అదే ప్రాంతంలో మల్లీ వరుణదేవుడికి అభిషేకంతో పాటు హోమం నిర్వహించారు.
ఘనంగా పూర్ణాహుతి..
ఇబ్రహీంపట్నం పెద్దచెరువులో వరుణదేవుడికి అర్చన, హోమం అనంతరం 5గంటలకు పూర్ణహుతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీశైలం దేవస్థానంకు చెందిన పలువురు వేదపండితులు ప్రత్యేక పూజలు, పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. పూర్ణాహుతి కార్యక్రమంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి దంపతులు, మంచిరెడ్డి ప్రశాంత్కుమార్రెడ్డి దంపతులు పాల్గొన్నారు.
యజ్ఞ యాగాలతో సత్ఫలితాలు.. మంత్రి సబితాఇంద్రారెడ్డి
యజ్ఞయాగాలతో ఫలితాలు ఉంటాయని మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం ఇబ్రహీంపట్నం పెద్దచెరువులో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి నిర్వహించిన వరుణార్చనయాగంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పురాతన కాలంలోనూ దేవతలు యజ్ఞయాగాలు నిర్వహించి ఫలితాలు సాధించారన్నారు. నేడు కూడా ప్రతి ఒక్కరూ భక్తిబావన అలవర్చుకోవాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గం నుంచి వచ్చిన నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిదులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.