ఇబ్రహీంపట్నంరూరల్ : ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లో భవిష్యత్లో భూములను గుంటలు, గజాలు మరిచి, ఫీట్లలో కొలిచి అమ్మకాలు, కొనుగోలు చేసేంత పరిస్థితి ఏర్పడుతోందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండల పరిధిలో నూతనంగా ఏర్పడిన కర్ణంగూడలో రూ. 20లక్షలతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. నూతన గ్రామ పంచాయతీ భవన ప్రారంభోత్సవంలో భాగంగా గ్రామ పంచాయతీ ఆవరణలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని సర్పంచ్ కవిత తిరుమల్ రెడ్డితో కలిసి నిర్వహించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన కర్ణంగూడ గ్రామపంచాయతీకి ప్రభుత్వ స్థలం లేకపోవడంతో నూతన భవన నిర్మాణానికి భూమిని కేటాయించిన పెంటారెడ్డిని శాలువా పూలమాలతో సత్కరించారు. తాను చూసినంతలో గతంలో ఎప్పుడు కూడా ఎనిమిది నెలల్లో గ్రామపంచాయతీ భవనం ఎక్కడ పూర్తి కాలేదన్నారు. అతితక్కువ కాలంలో పూర్తిచేసిన సర్పంచ్ కవితతిరుమల్రెడ్డి పనితీరు భాగుందని కితాబిచ్చారు. ఎలిమినేడు గ్రామంలో అతి త్వరలో ఎలక్ట్రానిక్ కార్లు, స్కూటర్లు తయారీ పరిశ్రమకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఈ పనులు వీలైనంత త్వరలో ప్రారంభించి ఈ ప్రాంతంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
సర్పంచ్తో పాటు గ్రామ ప్రజలు కోరిన విధంగా గ్రామంలో డ్వాక్రా భవనం నిర్మాణానికి ఈ నెల 31న మంచిరోజు ఉందని ఈ భవన నిర్మాణానికి అదే రోజు శంకుస్థాపన చేయాలని పంచాయతీరాజ్ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఎలిమినేడులో పరిశ్రమల ఏర్పాటుకు అనేక సంస్థలు ముందుకొచ్చినందున ఇబ్రహీంపట్నం నుంచి ఎలిమినేడు వరకు గల రోడ్డును 60 ఫీట్ల రోడ్డుగా మార్చేందుకు రూ. 28కోట్లు మంజూరయ్యాయని, ఈ రోడ్డును మరింత వెడల్పు పెంచుకునేందుకు రైతులు సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. దీనికి స్పందించిన రైతులు వెంటనే మరో 20 ఫీట్ల వరకు పెంచేందుకు మా భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని పలువురు రైతులు హామీ ఇవ్వడంతో ఎమ్మెల్యే రైతులను అభినందించారు.
కార్యక్రమంలో ఎంపీపీ కృపేష్, జడ్పీటీసీ భూపతిగల్ల మహిపాల్, వైస్ఎంపీపీ ప్రతాప్రెడ్డి, ఎంపీటీసీ ఆంజనేయులు, రైతు సమన్వయసమితి జిల్లా కన్వినర్ వంగేటి లక్ష్మారెడ్డి, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు బూడిద రాంరెడ్డి, ఇబ్రహీంపట్నం మున్సిపల్ వైస్చైర్మన్ ఆకుల యాదగిరి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.