ఇబ్రహీంపట్నం రూరల్, సెప్టెంబర్ 21 : కరువును జయించి ప్రతి ఒక్కరూ సుభిక్షంగా జీవించాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ఉన్నత ఆశయంతో చేపట్టిన హరితహారం కార్యక్రమం ఇబ్రహీంపట్నం మండలంలో ముమ్మరంగా కొనసాగుతుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు గతంలో ఎనిమిది విడుతల్లో నాటిన మొక్కలను సంరక్షించటంతో నేడు ఏపుగా పెరిగి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. అందులో భాగంగానే ఈ ఏడాది ఎనిమిదో విడుతలో భాగంగా హరితహారంలో భాగంగా నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మండలం రంగారెడ్డిజిల్లాలోనే అగ్రభాగాన నిలిచింది.
మండలంలోని ప్రతి గ్రామంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ఆదేశాల మేరకు ఇబ్రహీంపట్నం మండల పరిషత్ అధ్యక్షుడు కృపేష్ ప్రత్యేక చొరువతో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శులు, ఉపాధిహామీ సిబ్బంది, గ్రామపంచాయతీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, వార్డుసభ్యులు, కోఆప్షన్ మెంబర్ల సమన్వయంతో మొక్కలు నాటే కార్యక్రమం ఉద్యమంలా కొనసాగింది. మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించటంలో ఇబ్రహీంపట్నం మండలం ప్రథమస్థానంలో నిలవటంతో అధికారులు, ప్రజాప్రతినిధులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పెంచిన మొక్కలను వర్షాలు కురిసిన వెంటనే ప్రతి గ్రామంలో ఖాళీస్థలాలు, శ్మశాన వాటికలు, కంపోస్టుయార్డులు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలలు, పల్లె ప్రకృతి వనాలు, బృహత్ పల్లె ప్రకృతి వనాలతో పాటు ఇతరత్రా ఖాళీస్థలాలు, రోడ్ల వెంట 99.85శాతం మొక్కలు నాటడం ద్వారా మండలాన్ని జిల్లాలోనే అగ్రస్థానంలో నిలిపారు.
మొక్కల సంరక్షణకు కృషి..
ఎనిమిదో విడుత హరితహారంలో రంగారెడ్డిజిల్లాలోనే ఇబ్రహీంపట్నం మండలం అగ్రస్థానంలో నిలవటం ఎంతో సంతోషకరం. మొక్కలు నాటడం కోసం ప్రతిక్షణం పంచాయతీ కార్యదర్శులు, ఉపాధిహామీ సిబ్బంది, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఉపాధిహామీ కూలీలు పడిన శ్రమ ఎంతో ఉంది. నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించేందుకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నాం.
– జైరాంవిజయ్, ఎంపీడీవో ఇబ్రహీంపట్నం
అవగాహన కల్పిస్తున్నాం
హరితహారంలో భాగంగా మొక్కలు నాటి వాటిని సంరక్షించినప్పుడే కరువును జయించగలమన్న ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ప్రత్యేక చొరువతో మండలస్థాయి, గ్రామస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులకు హరితహారంపై ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు, సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నాం. రానున్న రోజుల్లో మండలంలోని అన్ని గ్రామాల్లో పెద్ద ఎత్తున ఉద్యమంలా మొక్కలు నాటి మండలాన్ని రాష్ట్రంలో అగ్రభాగాన నిలిపేందుకు కష్టపడి పనిచేస్తాం.
– కృపేష్, ఎంపీపీ ఇబ్రహీంపట్నం