ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం డివిజన్ పరిధిలో ఈనెలాఖరు నాటికి వందశాతం కొవిడ్టీకాలు వేయాలని నిర్దేశించినట్లు ఇబ్రహీంపట్నం డివిజన్ డిప్యూటీ డీఎంఎచ్ఓ నాగజ్యోతి తెలిపారు. శుక్రవారం ఇబ్రహీంపట్నం ఏరియా దవాఖానలో వైద్య సిబ్బందితో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డివిజన్ పరిధిలో 9 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ కేంద్రాల్లో కొవిడ్ వ్యాక్సినేషన్ వేస్తున్నట్లు తెలిపారు. డివిజన్ పరిధిలో ఇప్పటి వరకు మొదటిడోస్ కింద లక్ష్యానికి మించి ఎక్కువ మందికి టీకాలు వేయటం జరిగిందని ఆమె తెలిపారు. డివిజన్లో మొదటిడోస్ లక్ష్యం 3,54,217 మంది కాగా, మొదటిడోస్ కింద 3,60,694మందికి టీకాలు వేయటం జరిగిందన్నారు. లక్ష్యానికి మించి మరో 10శాతం మంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కార్మికులకు టీకాలు వేయటం జరిగిందని ఆమె తెలిపారు.
రెండో డోస్ కింద ఇప్పటి వరకు 2,13,515 మంది టీకా తీసుకున్నారని మరో 39శాతం మంది రెండోడోస్ తీసుకోవాల్సి ఉందన్నారు. రెండోడోస్ టీకా తీసుకోవల్సిన వారు పూర్తి వివరాలు సేకరించి వారికి ఈనెలాఖరు లోపు టీకా వేయటానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆమె తెలిపారు. జిల్లాలోనే ఇబ్రహీంపట్నం డివిజన్లో వందశాతం వ్యాక్సినేషన్ను పూర్తి చేసిన డివిజన్గా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. అలాగే, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని పలు గ్రామాల్లో వ్యాక్సినేషన్ కోసం ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఎమ్మెల్యే స్వగ్రామమైన ఎలిమినేడు గ్రామంలో వైద్యాధికారి అభిరాం ఎలిమినేడు, చర్లపటేల్గూడ, కప్పాడు, కర్ణంగూడ గ్రామాల్లో వందశాతం వ్యాక్సినేషన్ వేయించటంలో కృషి చేసినందుకు ఎమ్మెల్యే, డాక్టర్ అభిరాంను అభినందించారు.
డివిజన్ పరిధిలో మిగిలిపోయిన వారంతా రెండో డోస్ తీసుకోవటం కోసం అధికారులు, ప్రజాప్రతినిధులు తమకు సహకరించాలని ఆమె కోరారు. కార్యక్రమంలో ఎలిమినేడు వైద్యాధికారి అభిరాం, మెడికల్ అధికారి శ్రీనివాస్తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.