ఇబ్రహీంపట్నంరూరల్, జనవరి 31 : దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మహిళా సాధికారత కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని, మహిళా సంఘాల సభ్యులకు రూ.38 కోట్ల రుణాలు అందజేశామని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మంగళవారం ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని వైష్ణవిగార్డెన్లో డీఆర్డీఏ సెర్ప్ ఇబ్రహీంపట్నం వారి ఆధ్వర్యంలో బ్యాంకు లింకేజీ, స్త్రీ రుణాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై డీఆర్డీఏ ప్రభాకర్తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ త్వరలో ప్రతి మండలానికీ సుమారు ఐదు నుంచి పది వరకు మహిళా భవనాలను నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. ఎక్కడైనా మహిళా భవనాల సౌకర్యార్థం స్థలం ఉంటే వాటిని ఎంపిక చేసి, భవనాలను నిర్మించేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు.
మహిళా శక్తికి మించిన శక్తి మరొక్కటి లేదని, మహిళలు బ్యాంకుల ద్వారా అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. గతంలో బ్యాంకుల ద్వారా మహిళా సంఘాలకు రుణాలు ఇచ్చేందుకు ఇబ్బందులకు గురయ్యేవారని, ప్రస్తుతం 100 సంఘాలకు రూ.20 లక్షల చొప్పున అందించిన ఘనత కూడా ఉందని ఆయన గుర్తుచేశారు. డీఆర్డీఏ ప్రభాకర్ మాట్లాడుతూ…ప్రసుత్తం తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా మహిళా సంఘాలు రుణాలు పొందటంలో అగ్రభాగాన ఉందన్నారు. అనంతరం మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా 617 సంఘాలకు రూ.34.25 కోట్లు, స్త్రీ నిధి ద్వారా 237 సంఘాలకు రూ.3.85 కోట్ల రుణాలకు సంబంధించిన చెక్కులను ఎమ్మెల్యే మహిళలకు అందజేశారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ సత్తువెంకటరమణారెడ్డి, ఎంపీపీ కృపేశ్, జడ్పీటీసీ భూపతిగల్ల మహిపాల్, అదనపు పీడీ జంగారెడ్డి, ఏపీడీ సక్రియానాయక్, ఎంపీడీవో జైరాంవిజయ్, డీపీఎంలు బాలరాజు, స్వర్ణలత, నర్సింహ, నిర్మల, సూర్య, స్త్రీనిధి రీజినల్ మేనేజర్ ఉదయ, ఏపీఎం రవీందర్, స్త్రీనిధి మేనేజర్ రవి, ఎంపీటీసీలు మంగ, నాగమణి, సర్పంచ్లు జ్యోతి, బల్వంత్రెడ్డి, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు నిర్మల, కార్యదర్శి మహేశ్వరి, కోశాధికారి జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి చెందిన ఆర్యవైశ్యసంఘం రాష్ట్ర నాయకుడు, లయన్స్క్లబ్ లయన్ పసునూరి వినోద్కుమార్ మంగళవారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికీ సరైన గుర్తింపు ఉంటుందని అన్నారు. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని వినోద్కుమార్ తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు అల్వాల వెంకట్రెడ్డి, పలువురు బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.