సిటీబ్యూరో, జూన్ 20 (నమస్తే తెలంగాణ): చెరువుల పరిరక్షణ, సుందరీకరణే ప్రధాన లక్ష్యంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) చర్యలు చేపట్టింది. తాజాగా ఎంతో చరిత్ర ఉన్న ఇబ్రహీంపట్నం చెరువు (పెద్దచెరువు) కట్ట సుందరీకరణకు శ్రీకారం చుట్టింది.
రూ.9.70కోట్లతో చెరువు కట్ట అభివృద్ధి
ఎంతో చారిత్రాత్మక నేపథ్యమున్న ఇబ్రహీంపట్నం చెరువు (పెద్దచెరువు)ను 1560లో అప్పటి కులీకుతుబ్షాల పాలనలో నిర్మించగా, ఇది సుమారు 1300 ఎకరాల విస్తీర్ణంతో ఉంది. హుస్సేన్సాగర్, ఉస్మాన్సాగర్ (గండిపేట), హిమాయత్సాగర్, మీరాలం చెరువు తర్వాత ఎంతో ప్రాధాన్యత ఉన్న ఈ చెరువును అభివృద్ధి కోసం హెచ్ఎండీఏ సుమారు రూ.9.70 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసింది. సుమారు 2.9 కి.మీ పొడవుతో కూడిన చెరువు కట్టను ట్యాంక్బండ్ తరహాలో అభివృద్ధి చేయనున్నారు. దీనికి సంబంధించిన టెండర్లను ఇటీవలే హెచ్ఎండీఏ అధికారులు ఆహ్వానించారు. జూలై 3లోగా టెండర్లను సమర్పించాలని కోరింది. మరుసటి రోజు నుంచి వచ్చిన టెండర్లలో టెక్నికల్ బిడ్, ప్రైస్ బిడ్ పరిశీలించిన తర్వాత నిర్మాణ సంస్థను ఎంపిక చేయనున్నారు. టెండర్ దక్కించుకున్న సంస్థ 6 నెలల్లో చెరువు కట్ట అభివృద్ధిని పూర్తి చేయాలన్న లక్ష్యంతో హెచ్ఎండీఏ కార్యాచరణ రూపొందించింది.
చెరువుల సుందరీకరణపై ప్రత్యేక దృష్టి
ఇప్పటివరకు ఔటర్ రింగు రోడ్డు లోపల ఉన్న చెరువుల సుందరీకరణకు ప్రాధాన్యతనివ్వగా, ఈ ఏడాదిలో ఓఆర్ఆర్ బయట మున్సిపాలిటీల పరిధిలో ఉన్న చెరువులను పరిరక్షించడంతోపాటు సుందరీకరించి స్థానికులు సేద తీరేందుకు అందుబాటులోకి తెచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఓఆర్ఆర్ బయటి ప్రాంతాల్లో జలవనరుల పరిరక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. సుందరీకరణకు నిధుల కొరత సమస్య లేకుండా చేయడంతోపాటు కార్పొరేట్ కంపెనీలకు చెందిన కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్(సీఎస్ఆర్) నిధులతో చెరువులను సుందరీకరణలో పాలుపంచుకునేలా చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని లేక్ ప్రొటెక్షన్ కమిటీ, ఇంజినీరింగ్ విభాగం అధికారులకు మంత్రి కేటీఆర్ సూచించారు. ఆ మేరకు హెచ్ఎండీఏ అధికారులు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళుతూ చెరువుల అభివృద్ధి పనులు దశలవారీగా చేపడుతున్నారు. కొన్ని చెరువుల సుందరీకరణను ప్రభుత్వ నిధులతో చేస్తుండగా, కొన్నింటిని కార్పొరేట్ సంస్థలు చేపట్టేలా చేస్తున్నారు.