సిటీబ్యూరో, జూలై 29 (నమస్తే తెలంగాణ) : నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను సైబరాబాద్, మాదాపూర్ ఎస్ఓటీ, కేపీహెచ్బీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా ఇంటర్ నుంచి పీజీ వరకు 13 రాష్ర్టాల్లోని 18 యూనివర్సిటీలు, 10 ఇంటర్ బోర్డులకు సంబంధించిన నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్నట్లు విచారణలో తేలింది. 14 మంది సభ్యులున్న ఈ ముఠాలో 11మందిని అరెస్ట్ చేయగా అందులో నకిలీ సర్టిఫికెట్ పొందిన వారు కూడా ఉన్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ స్టీఫెన్ రవీంద్ర వివరాలు వెల్లడించారు.
వెస్ట్గోదావరి జిల్లా, భీమడోల్కు చెందిన మునగర వెంకటేశ్వరరావు మూడు నెలల కిందట నగరానికి వచ్చి కేపీహెచ్బీ కాలనీలోని కృష్ణచైతన్య హాస్టల్లో ఉంటున్నాడు. ఈ క్రమంలో హాస్టల్ వార్డెన్ కృష్ణకాంత్రెడ్డి అలియాస్ నాని పరిచయం కావడంతో ఇంటర్ అర్హతతో ఏదైనా జాబ్ ఉంటే చెప్పమని కోరాడు. “ఇంటర్తో ఏం ఉద్యోగం చేస్తావు..? డిగ్రీ సర్టిఫికెట్ ఉంటే మంచి ఉద్యోగాలు వస్తాయి’, నీకు కావాలంటే మంచి యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఒరిజినల్ సర్టిఫికెట్ ఇప్పిస్తానంటూ హామీ ఇచ్చాడు. రూ.90 వేలు తీసుకొని ఉత్తరప్రదేశ్లోని మీరట్కు చెందిన చౌదరీ చరణ్సింగ్ యూనివర్సిటీకి చెందిన బీకాం సర్టిఫికెట్ అందించాడు. అయితే ఆ సర్టిఫికెట్ గురించి ఆరా తీసిన వెంకటేశ్వరరావు నకిలీదని తేలడంతో పోలీసులను ఆశ్రయించాడు.
సుమారు 100 మందికి నకిలీ సర్టిఫికెట్లు
కృష్ణకాంత్రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా బొక్క వెంకటేశ్వరరావు, కూరెళ్ల కిరణ్కుమార్ల ద్వారా విజయవాడకు చెందిన కోట కిశోర్ తమకు నకిలీ సర్టిఫికెట్లు అందించాడని తెలిపారు. మరింత లోతుగా విచారించడంతో కిశోర్ అనేక యూనివర్సిటీలకు చెందిన వన్ సిట్టింగ్ డిగ్రీ సర్టిఫికెట్ను సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. అందులో తిమ్ము మధుకర్(నిర్మల్), రేలచర్ల గోపాల్ కృష్ణ(ఖమ్మం), బైరగాని రాజేశ్ గౌడ్(కొండాపూర్), రొండ్ల దేవేందర్రెడ్డి (యూసుఫ్గూడ), కుడేటి కృష్ణసాయి(బాచుపల్లి), అవ్వ రాఘవేంద్ర గుప్తా(బాలానగర్), షేక్ బాబాగౌస్(కూకట్పల్లి)కి చెందిన వారితో పాటు 100 మందికి నకిలీ సర్టిఫికెట్లు సరఫరా చేసినట్టు తేలింది. దీంతో 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
వెస్ట్ బెంగాల్లో తయారు
కాగా కిశోర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించారు. కిశోర్ విజయవాడలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తుండేవాడు. కరోనా మహమ్మారి సమయంలో ఉద్యోగం పోయింది. తరువాత క్యాంపస్ సర్వీసెస్ అంటూ ఉద్యోగాలు, విదేశాలకు పంపిస్తామంటూ కన్సల్టెన్సీని ప్రారంభించాడు. ఈ క్రమంలోనే గూగుల్లో వన్ సిట్టింగ్ డిగ్రీ సర్టిఫికెట్ల కోసం సెర్చ్చేసి వెస్ట్బెంగాల్కు చెందిన సంజయ్ వర్మ, రాహుల్ గోష్, ప్రతిమా పాటిల్లను సంప్రదించాడు. రూ. 1.5 లక్షల నుంచి రూ. 2.5 లక్షల వరకు తీసుకొని సర్టిఫికెట్లు సరఫరా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. కిశోర్ ఆర్డర్ ఇచ్చి డబ్బు పంపించడంతో బెంగాల్ నుంచి కొరియర్లో సర్టిఫికెట్ కావాల్సిన వారి ఇంటికి వెళ్తుంది. అయితే 14 మంది నిందితుల్లో 11 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పశ్చిమబెంగాల్కు చెందిన ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నారు. అరెస్ట్ చేసిన ప్రధాన నిందితుల నుంచి 70 నకిలీ సర్టిఫికెట్లు, నకిలీ స్టాంప్లు, తదితర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.