యాచారం, జనవరి 14 : హైదరాబాద్-నాగార్జునసాగర్ ప్రధాన రహదారి ప్రమాదాలకు నిలయంగా మారింది. రోజురోజుకూ ఈ రహదారి మృత్యుమార్గంగా మారుతున్నది. సాగర్ రహదారిపై ఇబ్రహీంపట్నం నుంచి మాల్ వరకు అతి ప్రమాదకరమైన మూల మలుపులు ఉండటంతో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఈ మలుపుల వద్ద రోడ్లు, భవనాల శాఖాధికారులు సరైన ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవటంతో ప్రమాదాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది.
ప్రమాదంలో ఎంతో మంది మృతిచెందడంతోపాటు మరెంతో మంది కాళ్లు, చేతులు విరిగిపోయి దివ్యాంగులుగా మారి కుటుంబానికి భారంగా మారుతున్నారు. సాగర్ రహదారిపై ప్రయాణం అంటేనే ద్విచక్రవాహనదారులు భయపడుతున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు ఎప్పుడు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటారోనని ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఇబ్రహీంపట్నం డివిజన్ పరిధిలో సాగర్ రహదారి సుమారు 37 కిలోమీటర్ల పొడవునా ఉంది. బొంగ్లూరు ఔటర్ రింగ్ రోడ్డు నుంచి ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం పోలీస్స్టేషన్ల పరిధిలోకి వస్తుంది.
ఈ రహదారిపై గున్గల్గేటు, నక్కగుట్టతండా, చింతపట్లగేటు, తక్కళ్లపల్లిగేటు, తమ్మలోనిగూడగేటు, మాల్ మైసమ్మ టెంపుల్ అతిప్రమాదకరమైన జోన్లుగా మారాయి. ఈ మూలమలుపుల వద్ద ప్రతిరోజూ ఏదో ఒక చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా అతివేగం, మద్యం సేవించడం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్, రాత్రిపూట అజాగ్రత్తగా నడపడంతోనే ప్రమాదాలు అధికమవుతున్నాయి. ఇంత జరుగుతున్నా ఆర్టీఏ, పోలీసులు, ఆర్అండ్బీ అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలేదు.
హైదరాబాద్-నాగార్జునసాగర్ రహదారిలో తక్కళ్లపల్లి, తమ్మలోనిగూడ గేట్ల వద్ద ఉన్న మూలమలుపులు అత్యంత ప్రమాదకరంగా మారాయి. ఇక్కడ సుమారు వందకుపైగా ప్రమాదాలు జరిగాయి. అయినప్పటికీ సంబంధిత అధికారులు దృషి సారించడంలేదు. ఇటీవలే తమ్మలోనిగూడ గేటు వద్ద కారు చెట్టుకు ఢీకొని ఒకరు మృతిచెందగా, రెండు లారీలు ఢీకొని ఇద్దరు మృత్యువాతపడ్డారు.
తక్కళ్లపల్లి గేటు వద్ద తండ్రీ కొడుకులు మృతిచెందగా, పోలీస్స్టేషన్ వద్ద ఒకరు దుర్మణంపాలయ్యారు. మాల్ మైసమ్మ టెంపుల్ వద్ద ఒకరు మరణించగా.. చింతపట్ల గేటు వద్ద ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ మలుపుల వద్ద ప్రతి వారం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ ఆర్అండ్బీ అధికారులు ఎలాంటి ప్రమాద సూచిక బోర్డులను ఏర్పాటు చేయడంలేదని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలేదని ప్రజలు వాపోతున్నారు.
సాగర్ రహదారిపై ఇటీవల బస్సు ప్రమాదాలు కూడా అధికమయ్యాయి. అతివేగం, అజాగ్రత్తే ప్రమాదాలకు కారణమవుతున్నాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. గాయాలపాలవుతున్నారు. ముఖ్యంగా దేవరకొండ ఆర్టీసీ డిపోకు చెందిన అద్దె బస్సులు ఈ ప్రమాదాలకు కారణమవుతున్నాయి.
ప్రమాదాలకు కారణమవుతున్నవారిపై చర్యలు తీసుకోవాలని గతంలో ఇబ్రహీంపట్నానికి చెందిన పలువురు ఆర్టీఏ అధికారులకు కూడా ఫిర్యాదు చేశారు. ఇటీవలే మండల కేంద్రంలో బస్సు ఢీకొని ఒకరు దుర్మరణంపాలవగా.. ఈ వారంలోనే మాల్ మైసమ్మ టెంపుల్ వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొని నందివనపర్తికి చెందిన రాంరెడ్డి అక్కడికక్కడే మృతిచెందాడు.
సాగర్ రహదారిపై రోజురోజుకూ వాహనాల సంఖ్య పెరిగిపోతున్నది. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల బస్సులు, లారీలు, ఆటోలు, క్రూయిజర్లు, ప్రైవేటు వాహనాలు, ద్విచక్రవాహనాలు పెద్దఎత్తున రాకపోకలు సాగిస్తున్నాయి. మాల్ నుంచి కాగజ్ఘట్ వరకు డబుల్ రోడ్డుండటం వలన ప్రమాదాల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నది. పెరిగిపోతున్న వాహనాలను దృష్టిలో ఉంచుకుని సాగర్ రహదారి విస్తరణ పనులకు గత ప్రభుత్వం ప్రణాళికలను రచించింది. కాగజ్ఘాట్ నుంచి మాల్ వరకు ఫోర్ లైన్ రోడ్డుగా మార్చి, డివైడర్లను నిర్మిస్తే ప్రమాదాలు జరిగే అవకాశాలుండవని పలువురు భావిస్తున్నారు.
సాగర్ రహదారిపై తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టాలి. కాగజ్ఘాట్ నుంచి మాల్ వరకు డబుల్ రోడ్డును నాలుగు లైన్ల రోడ్డుగా మార్చాలి. రోడ్డుపై సూచిక బోర్డులను, మలుపుల వద్ద బారికేడ్లను ఏర్పాటు చేయాలి. ప్రైవేటు వాహనదారుల వేగంపై సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి. ప్రమాదాల నివారణకు పోలీసులు, ఆర్అండ్బీ, ఆర్టీఏ అధికారులు కృషి చేయాలి.
– బిలకంటి చంద్రశేఖర్రెడ్డి, బీఎన్రెడ్డి ట్రస్టు చైర్మన్, నందివనపర్తి