Shamshabad Airport | సిటీబ్యూరో/శంషాబాద్ రూరల్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): ఆర్జీఐఏ ఠాణాకు చెందిన కానిస్టేబుల్, హోంగార్డులు డ్యూటీ ఫ్రీ మద్యం విక్రయిస్తుండగా, సమాచారం అందుకున్న శంషాబాద్ డీటీఎఫ్ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితుల నుంచి రూ.15లక్షల విలువ చేసే మద్యం బాటిళ్లు, రెండు కార్లు, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్ ఈఎస్ కృష్ణప్రియ కథనం ప్రకారం…శంషాబాద్, రాయల్ విల్లాస్ ప్రాంతానికి చెందిన ఎం.జిమ్యా నాయక్ ఆర్జీఐఏ పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్. బుద్వేల్కు చెందిన బండారి లింగయ్య అదే పోలీసు స్టేషన్లో హోంగార్డుగా పనిచేస్తున్నాడు. వీరిద్దరూ శంషాబాద్ విమానాశ్రయంలోని పోలీసు ఔట్పోస్టులో వీఐపీ ప్రొటోకాల్ విధులు నిర్వర్తిస్తున్నారు.
జిమ్యానాయక్కు ఎయిర్పోర్ట్లోని డ్యూటీ ఫ్రీ మద్యం దుకాణం బిల్లింగ్ కౌంటర్లో పనిచేసే మహేశ్వర్తో పరిచయం ఏర్పడింది. ముగ్గురు కలిసి విదేశాల నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చే ప్రయాణికుల పాస్పోర్ట్, బోర్డింగ్ పాస్ల మీద ప్రతిరోజూ 10నుంచి 20వరకు డ్యూటీ ఫ్రీ మద్యాన్ని కొనుగోలు చేసి మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ మేరకు విశ్వసనీయ సమాచారం అందుకున్న శంషాబాద్ డీటీఎఫ్ ఇన్స్పెక్టర్ బి.ప్రవీణ్కుమార్, ఎస్ఐ జి.శ్రీకాంత్రెడ్డి తమ బృందంతో కలిసి కానిస్టేబుల్ జిమ్యా నాయక్ను శంషాబాద్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ వద్ద రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.
అంతే కాకుండా నాయక్ వద్ద మద్యం కొనుగోలు చేసిన మాదాపూర్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ హరీశ్కుమార్ను సైతం అదుపులోకి తీసుకుని నిందితుల వద్ద నుంచి మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే గౌలిదొడ్డికి చెందిన రాఘవేంద్రరావుకు గోల్డ్లేబుల్ బాటిళ్లు విక్రయించినట్లు కానిస్టేబుల్ విచారణలో వెల్లడించడంతో రాఘవేంద్రరావు కారును తనిఖీ చేయగా 8 గోల్డ్ లేబుల్ మద్యం బాటిళ్లు లభించాయి. ఈ మేరకు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. మరో కేసులో అరాంఘర్ ఎక్స్రోడ్డు వద్ద డ్యూటీ ఫ్రీ మద్యం విక్రయిస్తున్న ఆర్జీఐఏ హోంగార్డు బండారి లింగయ్యను పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి 23డ్యూటీ ఫ్రీ మద్యం బాటిళ్లు, రెండు డిఫెన్స్ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.