హయత్నగర్ రూరల్ : కనిపించకుండాపోయిన ఓ పెంపుడు కుక్క (రాఖీ) ఆచూకీ.. వాట్సాప్ స్టేటస్లో దొరికింది. హైదరాబాద్ వనస్థలిపురం పరిధిలోని శారదానగర్లో ఉంటున్న సంతోష్ తన పెంపుడు కుక్క పేరు రాఖీ కనిపించడం లేదని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. కుక్క మిస్సింగ్ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. చాలామంది వాట్సాప్ స్టేటస్లో ఈ న్యూస్ ట్రెండ్ అయింది. పెద్ద అంబర్పేట మున్సిపాలిటీ టీఆర్ఎస్ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి పవన్.. కుక్క కనిపించడంలేదనే సమాచారాన్ని కుక్క ఫొటోలను ఓ వాట్సాప్ స్టేటస్లో గమనించాడు. అదే కుక్క మర్రిపల్లిలో ఉన్నట్టు గుర్తించాడు. సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ సమాచారం పోలీసుల వరకు వెళ్లింది.
పవన్కు పోలీసుల నుంచి ఫోన్ వచ్చింది. కుక్కను వనస్థలిపురం పోలీసులకు అప్పగించారు. మర్రిపల్లికి చెందిన సత్యనారాయణ హయత్నగర్ భాగ్యలత కాలనీలో కూరగాయల దుకాణం నడుపుతున్నాడు. రెండ్రోజులుగా ఓ కుక్క దుకాణం ముందే ఉండటం, వెళ్లగొట్టినా పోకపోవడంతో అన్నం పెట్టాడు. సంరక్షణ కోసం మర్రిపల్లికి తీసుకొచ్చాడు. తప్పిపోయి, దొరికినటువంటి గ్రేడెన్ జాతికి చెందిన కుక్క పిల్ల ఖరీదు దాదాపు రూ. 40వేల వరకు ఉంటుందన్నారు.