సంక్రాంతి పండుగ వేళ.. పలు కుటుంబాల్లో విషాదం నెలకొంది. గ్రేటర్లో వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృత్యువాతపడగా, పతంగి సరదా ఓ బాలుడి ప్రాణం తీసింది. అలాగే జోగులాంబ గద్వాల జిల్లా వద్ద ప్రైవేటు బస్సు బోల్తాపడి.. మంటలంటు కొని నగరానికి చెందిన ఓ మహిళ సజీవదహనమయ్యారు.
శంషాబాద్ రూరల్, జనవరి 13 :హైదరాబాద్- బెంగళూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన కారు అదుపు తప్పి బైక్ను ఢీకొట్టగా, ఆ ద్విచక్రవాహనం ముందు వెళ్తున్న ఆటోను ఢీకొంది. ఈ ఘటనలో మూడు వాహనాలు రోడ్డు పక్కన నిర్మాణంలో ఉన్న కల్వర్టు గుంతలో పడిపోయాయి. ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, ముగ్గురికి గాయాలయ్యాయి. ఘాన్సీమియాగూడ గ్రామ సమీపంలో ఈ విషాద చోటు చేసుకున్నది.
శంషాబాద్ రూరల్ సీఐ శ్రీనాథ్ తెలిపిన వివరాల ప్రకారం.. కారులో ప్రయాణిస్తున్న రీసెర్చ్ సెంటర్ శాస్త్రవేత్త ఈసీఐఎల్లో ఉంటున్న మేరువ ఆదిశేషరెడ్డి(57) ఆయన తల్లి రాములమ్మ(88) చనిపోయారు. సంక్రాంతి పండుగ కోసం వీరు నంద్యాల జిల్లా జిల్లెల్ల గ్రామానికి వెళ్తుండగా, ప్రమాదానికి గురై మృత్యువాతపడ్డారు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ నారాయణపేట్కు చెందిన అంజి, చిన్నారి అక్షిత, ఆటో డ్రైవర్తో పాటు అందులో ప్రయాణిస్తున్న కార్మికులు రియాజ్, ఫారుఖ్కు గాయాలయ్యాయి. కాగా, రోడ్డు ప్రమాదంతో దాదాపు నాలుగు కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అవ్వగా, పోలీసులు క్లియర్ చేశారు.