రంగారెడ్డి, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ) : సీఎం కేసీఆర్ విడుదల చేసిన మ్యానిఫెస్టోకు ప్రజలు ఫిదా అవుతున్నారు. అన్ని వర్గాలకు పెద్దపీట వేయడంపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా అసహాయకులకు ఆసరాగా నిలుస్తున్న పింఛన్లను మరోసారి పెంచుతామని ప్రకటిస్తూ మ్యానిఫెస్టోలో చేర్చడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ఇప్పటికే పలుమార్లు పింఛన్లను పెంచిన కేసీఆర్.. మరోసారి పెద్ద మనస్సు చేసుకోవడాన్ని కొనియాడుతున్నారు. ఆయా రకాల పింఛన్లను రూ.5016లకు, దివ్యాంగుల పింఛన్ను రూ.6016 వరకు పెంచుతామని హామీనివ్వడంపై ప్రజలు జేజేలు పలుకుతున్నారు. కారు గుర్తుకు ఓటేసి మరోసారి బీఆర్ఎస్ను గెలిపించుకుంటామని చెబుతున్నారు.
బీఆర్ఎస్ మ్యానిఫెస్టో ప్రతిపక్షాలు దిమ్మె తిరిగేలా చేస్తున్నది. సీఎం ప్రకటించిన మరుక్షణమే మ్యానిఫెస్టో గ్రామస్థాయిలోనూ ప్రజల మదిలోకి చొచ్చుకెళ్లింది. పేదలపై సీఎం కేసీఆర్ చిత్తశుద్ధికి ఈ మ్యానిఫెస్టో అద్దంపడుతుందనే అభిప్రాయం అన్నివర్గాల నుంచి వ్యక్తమవుతున్నది. ముఖ్యంగా ఆసరా పింఛన్ పెంపు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటున్నది. ఐదేండ్లలో ఏటా రూ.500చొప్పున పెంచి ఆసరా పింఛన్ను రూ.5,016కు, దివ్యాంగుల పింఛన్ను ఐదేండ్లలో రూ.6,016కు పెంచుతామని ప్రకటించడంపై లబ్ధిదారుల్లో సంతోషం వ్యక్తమవుతున్నది. దీంతో బీఆర్ఎస్కు ఓటు వేసి సీఎం కేసీఆర్ రుణం తీర్చుకుంటామని లబ్ధిదారులు పేర్కొంటున్నారు.
‘ఆసరా’తో కొండంత ధీమా..
పేదల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. ఇదే క్రమంలో 2023 అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోను రూపొందించారు. ఆపన్నులకు కొండంత ధీమా కల్పించేందుకు ఆసరా పింఛన్ను రూ.2,016 నుంచి రూ.6,016కు పెంచనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే రూ.2,016 ఆసరా పింఛన్ను రూ.3,016కు పెంచి, ప్రతి ఏటా పెంచుతూ ఐదేండ్ల నాటికి రూ.5,016 చొప్పున పింఛన్ అందజేస్తామని స్పష్టం చేశారు. దివ్యాంగుల పింఛన్ను ఇటీవలనే ప్రభుత్వం రూ.4,016కు పెంచగా రానున్న ఐదేండ్ల కాలంలో దీన్ని రూ.6,016కు పెంచుతామని ప్రకటించారు. ఇది ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటున్నది. రంగారెడ్డి జిల్లాలో వృద్ధాప్య, వితంతు, దివ్యాంగులు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు 2,02,129 మంది ఫించన్ను పొందుతుండగా.. ప్రభుత్వం ప్రతి నెలా రూ.49.6కోట్లను వెచ్చిస్తున్నది.ఫించన్ పెంపు వల్ల ప్రభుత్వంపై భారం పడుతున్నప్పటికీ ఖర్చుకు వెనుకాడని సీఎం కేసీఆర్ పేదలంతా గౌరవప్రదంగా బతికేలా మ్యానిఫెస్టోలో చేర్చారు. ఇది పింఛన్ లబ్ధిదారుల్లో సంతోషాన్ని నింపుతున్నది.
కేసీఆర్ దివ్యాంగుల పాలిట దైవం
ముఖ్యమంత్రి కేసీఅర్ దివ్యాంగుల కష్ట్టాలు తెలిసిన గొప్ప నాయకుడు. గతంలో ఏ ప్రభుత్వాలు మమ్మల్ని పట్టించుకోలేదు. తెలంగాణ వచ్చాకే బతుకులు మారాయి. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో దివ్యాంగులకు రూ.6వేలకు పింఛన్ పెంచుతూ నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషంగా ఉన్నది. ప్రస్తుతం రూ.4016లు పింఛన్ వస్తున్నది. దివ్యాంగులకు కేసీఆర్ దైవంలా నిలుస్తున్నాడు. దివ్యాంగులమంతా కారు గుర్తుకే ఓటు వేస్తాం.
– శ్రీకాంత్, తిరుమల కాలనీ (షాద్నగర్ రూరల్)
కాంగ్రెస్ పేదలను పట్టించుకోలె..
సీఎం కేసీఆర్ ప్రతి ఇంటికీ పెద్ద కొడుకే. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేతలు.. గీత కార్మికులు.. ఇలా ఎంతో మందికి పింఛన్ ఇచ్చి ఆదుకుంటుండు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి రాష్ర్టాన్ని పాలించి చేసింది ఏమి లేదు. పేదలను పట్టించుకున్న పాపానపోలేదు. కాంగ్రెస్ వాళ్లు ఉన్నప్పుడు ఇచ్చిన పింఛన్ ఎటు సరిపోక ఇబ్బందులు పడేది. ఇప్పుడున్న బీజేపీ దేశాన్ని దోచుకుతింటానికే చూస్తుంది. పేదల గురించి ఆలోచించే తత్వం లేదు. సీఎం కేసీఆర్ మళ్లీ గెలుస్తాడు. వృద్ధులమంతా కారు గుర్తుకే ఓటు వేస్తాం. మళ్లీ అధికారంలోకి రాగానే పింఛన్ పెంచుతామన్న కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు.
– కే జంగయ్య(మాడ్గుల)
పింఛన్ పెంచుతామనడం సంతోషకరం
ఇంటికి పెద్ద కొడుకులాగా సీఎం కేసీఆర్ ప్రతి నెలా పింఛన్ ఇస్తున్నడు. ముందున్న సర్కారోళ్లు రూ.200 ఇస్తే అవి సరిపోయేవి కాదు. నాకు నెలకు వచ్చే రూ.2వేలతో ఎన్నో పనులకు పైసలు ఉపయోగపడుతున్నాయి. పేదోళ్ల కష్టాలు తెలిసిన కేసీఆర్ సార్ పింఛన్ పైసలు అందించి ఆదుకుంటుండు. మళ్లి అధికారంలోకి రాగానే పింఛన్ను పెంచుతామని చెప్పడం సంతోషంగా ఉన్నది. పేదల కష్టాలు అర్థం చేసుకునే సీఎం కేసీఆరే మాకు కావాలి. మళ్లీ కారు గుర్తుకే ఓటు వేసి గెలిపించుకుంటాం. సీఎం కేసీఆర్ సారుకు రుణపడి ఉంటాం.
– వడ్ల పద్మమ్మ, సర్దార్నగర్ (షాబాద్)
పింఛన్తో బతుకుతున్నాం..
వృద్ధులు, ఒంటరి మహిళలకు పింఛన్ ఇచ్చి ఆదుకుంటున్న దేవుడు కేసీఆర్. నాకు కూతురు, కొడుకు ఉన్నారు. కొడుకు పొట్ట కూటి కోసం హైదరాబాద్లో ఆటో నడుపుకొంటు జీవనం కొనసాగిస్తున్నాడు. కూతుకు పెండ్లి చేయగా, పాము కాటుతో అల్లుడు చనిపోయాడు. కూతురు పుట్టింటిలోనే ఉంటుంది. మా ఇద్దరికీ కేసీఆర్ సారు ఆసరాగా నెలకు పింఛన్ కింద రూ.2016లు, అట్లాగే బిడ్డకు ఒంటరి మహిళ పథకం కింద రూ.3016లు ఇస్తుండు. దీంతో ఇద్దరం ఎవరిపై ఆధారపడకుండా బతుకుతున్నాం. పొలం పనులు చేసుకొని వచ్చిన దాంట్లో కేసీఆర్ సార్ పేరు చెప్పుకొని జీవిస్తున్నాం. అసరా పింఛన్ రాకుంటే మా బతుకులు ఏ విధంగా ఉండేవో ఆలోచిస్తేనే భయంగా ఉన్నది. కేసీఆర్ సారు చల్లంగ ఉండాలే. నాలాంటి వాళ్లకు ఇంటికి పెద్ద కొడుకులా ఆదుకుంటుండు. ఆయన చలవతోనే మూడు పూటల కడుపునిండా తింటున్నాం. మళ్లీ కేసీఆర్ సారే గెలువాలె.
మళ్లీ కేసీఆర్ సారే గెలువాలే..
వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులను పట్టించుకుని సరిపడా పింఛన్ ఇస్తున్న సీఎం కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావాలి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్ని కల్లబొల్లి మాటలు చెప్పినా వినే పరిస్థితిలో లేము. అప్పుడు అండగా ఉండనోళ్లు.. ఇప్పుడు ఎమో చేస్తామని చెబితే ఎలా నమ్ముతాము. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కరెంటు సరిగ్గా ఉండకపోయేది. సాగు నీరు లేక పొలాలు ఎండినయ్. బతుకుదెరువు లేని వలసలు పోయే పరిస్థితి ఉండేది. తెలంగాణ వచ్చినకాడి నుంచి మా బతుకులు మారాయి. అందరికీ చేతి నిండా పని దొరుకుతున్నది. మాకు వచ్చే పింఛన్ డబ్బులతో గౌరంగా జీవిస్తున్నాం. మళ్లీ అధికారంలోకి రాగానే పింఛన్ను పెంచుతామనడం సంతోషంగా ఉన్నది. ఈసారి కూడా నా ఓటు కేసీఆర్ సారు కారు గుర్తుకే ఏస్తా.
– పగిళ్ల సత్యమ్మ, దివ్యాంగురాలుఇబ్రహీంపట్నంరూరల్)
బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే పేదల జీవితాల్లో వెలుగులు
తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. సీఎం కేసీఆర్ వృద్ధులు, వితంతువులు, మహిళలకు పింఛన్ ఇస్తూ అర్థికంగా భరోసా కల్పిస్తున్నారు. పింఛన్ డబ్బులు నెలకు సరిపోతున్నాయి. మాకు ఎవరూ ఆర్థికంగా సాయం చేయాల్సిన పని లేకుండా ఆత్మగౌరవంతో జీవించేలా సీఎం కేసీఆర్ చేశారు. తెలంగాణ రాక ముందు చాలిచాలని పింఛన్ డబ్బులతో అవస్థలు పడ్డాం. అటు పని చేయలేని దుస్థితి. ఎవరూ ఆదుకోని పరిస్థితి. ఏమి చేయాలో అర్థం కాక దేవుడిపై భారం వేసే వాళ్లం. ఇలాంటి ప్రభుత్వాన్ని నేను పుట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు చూడలేదు. సీఎం కేసీఆర్ దేవుడు. ఆయనకు ఎల్లకాలం రుణపడి ఉంటాం.
– బీరప్పొళ్ల నర్సింహులు, ఇబ్రహీంపల్లి గ్రామం (చేవెళ్ల రూరల్)
కొడుకులు లేని నన్ను సీఎం కేసీఆర్ కన్న కొడుకులా అదుకుంటుండు. నెలనెలా వచ్చే పింఛన్తో ధైర్యంగా బతుకుతున్నా. కన్నబిడ్డలే పట్టించుకోని ఈ రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం దిక్కులేనివారిని, అసహాయులను పట్టించుకుని బతుకుపై భరోసా ఇస్తున్నది. ప్రస్తుతం మ్యానిఫెస్టోలో రూ.5వేల పింఛన్ ఇస్తామనడం చాలా సంతోషకరం. ఇలాంటి సాహసం ఇప్పటి వరకు ఏ ప్రభుత్వమూ చేయలేదు. సీఎం కేసీఆర్ చల్లంగ ఉండాలె. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలి. ఎవరు ఎన్ని చెప్పినా మాకు అండగా ఉండే పార్టీ వెంటే ఉంటాం. కారు గుర్తుకు ఓటు వేసి కేసీఆర్ సారును గెలిపించుకుంటాం.
– జంగ అంజమ్మ, జంగోనిగూడ (నందిగామ)
మళ్లీ కారు గుర్తుకే ఓటు వేస్తాం
ఆసరా పింఛన్లను రూ.2016 నుంచి 5016 పెంచుతామని సీఎం కేసీఆర్ చెప్పడం గొప్ప విషయం. మాకు పెద్ద మొత్తంలో పింఛన్లు వస్తున్నాయి కాబట్టే గౌరవంతో తలెత్తుకొని బతుకగలుగుతున్నాం. పింఛన్లు ఎంత పెరిగితే అంత గౌరవం పెరుగుతుంది. సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాతే భారీగా పింఛన్లు అందుకొని ఒకరిపై ఆధారపడకుండా జీవిస్తున్నాం. మరోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తాం.
-పెండ్యాల లక్ష్మమ్మ, కొత్తూరు మున్సిపాలిటీ