వికారాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): జిల్లా పరిషత్ చైర్పర్సన్ అవిశ్వాసంపై మళ్లీ కదలిక వచ్చింది. సునీతామహేందర్రెడ్డిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు హైకోర్టు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. వారం రోజుల్లోగా ఆ ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాంగ్రెస్ పార్టీలో చేరిన జడ్పీ చైర్పర్సన్పై అవిశ్వాసం ప్రకటించిన బీఆర్ఎస్ జడ్పీటీసీలు తదనంతరం జడ్పీ పీఠాన్ని దక్కించుకునేలా పట్టు బిగిస్తున్నారు. ఇందుకు ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే నిర్ణీత సమయంలోగా బలపరీక్ష నిర్వహించాలని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన బీఆర్ఎస్ జడ్పీటీసీలు.. నెల రోజులు దాటినా అవిశ్వాసం పెట్టకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు వారి పిటిషన్ను పరిశీలించిన రాష్ట్ర ధర్మాసనం… అందుకు సంబంధించి న ప్రక్రియను వారం రోజుల్లోగా చేపట్టాలని సర్కారును ఆదేశించింది. అవిశ్వాస తీర్మానం పెట్టరనే ధీమాతో ఉన్న జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డితోపాటు కాంగ్రెస్ పార్టీకి కోర్టు గట్టి షాకిచ్చింది. హైకోర్టు ఆదేశాలతో సునీతారెడ్డి వర్గం ఆందోళనలో పడింది. చేవెళ్ల ఎంపీ టికెట్ను ఆశించి ఆమె కాంగ్రెస్లో చేరారు. అయితే ఆ టికెట్ సునీతారెడ్డికి కాకుండా రంజిత్రెడ్డికే ఆ పార్టీ ఫైనల్ చేసినట్లు ప్రచారం జరుగుతున్నది. ఓ వైపు ఎంపీ టికెట్ పోయి, మరోవైపు ఆమెపై హైకోర్టు అవిశ్వాస తీర్మానం పెట్టాలని ఆదేశాలివ్వడంతో జడ్పీ చైర్పర్సన్ పదవి పోయే పరిస్థితి ఉండడంతో సునీతారెడ్డి సందిగ్ధంలో పడిపోయారు.
అవిశ్వాసానికి 12 మంది సభ్యుల మద్దతు అవసరం..
జడ్పీ చైర్పర్సన్పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని హైకోర్టు ఆదేశాలివ్వడంతో ఆ దిశగా అధికారులు ముందుకెళ్తున్నారు. అవిశ్వాస తీర్మాన నోటీసు ఇచ్చిన 12 మంది జడ్పీటీసీల సంతకాలు వారివేనా కాదా..? అనేది పరిశీలిస్తున్నారు. అవిశ్వాస తీర్మానం పెడితే మూడింట రెండోవంతు సభ్యుల మద్దతు అవసరం. అయితే జిల్లాలో మొత్తం 18మంది జడ్పీటీసీలుండగా వారిలో 12 మంది జడ్పీటీసీల మద్దతు ఉంటేనే అవిశ్వాసం నెగ్గుతుంది. అయితే కాంగ్రెస్ నుంచి పెద్దేముల్, బంట్వారం జడ్పీటీసీలు మాత్రమే గెలుపొందగా, అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన బషీరాబాద్ జడ్పీటీసీ కాంగ్రెస్ పార్టీలో చేరగా, ఇటీవల జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి కూడా హస్తం పార్టీ చేరడంతో ఆ పార్టీ సభ్యుల సంఖ్య నలుగురికి చేరింది. మిగతా 14 మంది జడ్పీటీసీలు బీఆర్ఎస్లోనే ఉండడంతో అవిశ్వాస తీర్మానం పెడితే నెగ్గేందుకు బీఆర్ఎస్ పార్టీ పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నది. అయితే వికారాబాద్, పరిగి, మర్పల్లి, ధారూరు, నవాబుపేట, దౌల్తాబాద్, దోమ, కులకచర్ల, మోమిన్పేట, పూడూరు, కొడంగల్, తాండూరు జడ్పీటీసీలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే.
కోర్టు సూచన మేరకు ముందుకెళ్తాం…
జడ్పీ చైర్పర్సన్పై పెట్టిన అవిశ్వాస తీర్మానంపై వారం రోజుల్లోగా ప్రక్రియను ప్రారంభించాలని హైకోర్టు ఆదేశించింది. కోర్టు సూచనల మేరకు ముందుకెళ్తాం. అంతేకాకుండా అవిశ్వాసం నోటీసిచ్చిన 12 మంది జడ్పీటీసీల సంతకాలను పరిశీలించాలని జడ్పీ సీఈవోను ఆదేశించాం.
– నారాయణ రెడ్డి, వికారాబాద్ కలెక్టర్