కూరగాయలు, పండ్ల తోటల సాగు పెంపుపై అధికారుల దృష్టి
వికారాబాద్ జిల్లాలో 14వేల ఎకరాల్లో కూరగాయలు..
800 ఎకరాల్లో పండ్ల తోటల పెంపే లక్ష్యం
605 యూనిట్లకు రూ.కోటీ6లక్షల సబ్సిడీ అందజేత
మెరుగైన నారు అందించేందుకు వికారాబాద్లో హైటెక్ నర్సరీ ఏర్పాటు
రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతల అభ్యున్నతికి విశేషంగా కృషి చేస్తున్నది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలొచ్చే కూరగాయలు, పండ్ల తోటలను అధిక విస్తీర్ణంలో సాగు చేసేలా చర్యలు చేపట్టింది. అందుకనుగుణంగా వికారాబాద్ జిల్లా ఉద్యానశాఖ అధికారులు 2022-23 ఏడాదికి సంబంధించి సమీకృత ఉద్యాన అభివృద్ధి మిషన్ యాక్షన్ ప్లాన్ను విడుదల చేశారు. దాని ప్రకారం ఈ వానకాలంలో జిల్లాలో 14 వేల ఎకరాల్లో కూరగాయలు, 800 ఎకరాల్లో పండ్ల తోటలను పెంచాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఈ పంటలను సాగు చేసే రైతులకు సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహించనున్నారు. ఈ ఏడాదిలో ఉద్యాన పంటలను సాగు చేసే వారికి 605 యూనిట్లకు రూ. కోటీ6లక్షల సబ్సిడీ అందించాలని ప్రణాళికను సిద్ధం చేశారు. అంతేకాకుండా కూరగాయల నారును సైతం రైతులకు సబ్సిడీపై అందించాలని నిర్ణయించారు. ఈ మేరకు వికారాబాద్లోని ఉద్యానశాఖకు చెందిన స్థలంలో హైటెక్ నర్సరీని రూ. 25 లక్షలతో ఏర్పాటు చేయనున్నారు. దీంతో అన్నదాతలు మేలైన నారు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు.
పరిగి, జూలై 7 : వికారాబాద్ జిల్లాకు సంబంధించి 2022-23 సంవత్సరానికి సమీకృత ఉద్యాన అభివృద్ధి మిషన్ యాక్షన్ ప్లాన్ తయారైంది. ఈ మేరకు ఉద్యాన శాఖ అధికారులు యాక్షన్ ప్లాన్ విడుదల చేశారు. జిల్లావ్యాప్తంగా ఈ వానకాలంలోనే 14వేల ఎకరాల్లో కూరగాయల సాగు, 800 ఎకరాల్లో పండ్ల తోటల పెం పకం విస్తీర్ణం పెంచాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఇందుకనుగుణంగా రైతాంగానికి కూరగాయలు సాగు, పండ్లతోటలు, ఇతర అంశాల్లో సబ్సిడీలు ఇచ్చేందుకు సర్కారు నిర్ణయించింది. ఈ సంవత్సరం ఉద్యాన శాఖ ద్వారా 605 యూనిట్లకు కోటీ6లక్షల రూపాయలు సబ్సిడీగా అందజేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందుకనుగుణంగా లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి సబ్సిడీ అందించడంతో కూరగాయలు, ఉద్యానపంటల విస్తీర్ణం మరింత పెంచేందుకు సర్కారు నిర్ణయించింది.
వికారాబాద్కు హైటెక్ నర్సరీ
వికారాబాద్ జిల్లాకు ఒక హైటెక్ నర్సరీ మంజూరైంది. వికారాబాద్లోని ఉద్యాన శాఖకు సంబంధించిన స్థలంలోనే ఈ హైటెక్ నర్సరీ ఏర్పాటు చేయడానికి రూ.25లక్షలు మంజూరు చేశారు. దీంతో ఇక్కడే పలు కూరగాయలకు సంబంధించిన నార్లు రైతులకు సబ్సిడీపై అందించేందుకు వీలుగా తయారు చేయనున్నారు. మేలు రకాలైన పలు కూరగాయల విత్తనాలతో నార్ల పెంపకం చేపట్టి రైతులకు అందజేస్తారు. ప్రస్తుతం హైదరాబాద్లోని జీడిమెట్లలో గల హైటెక్ నర్సరీ నుంచి రైతులకు సబ్సిడీపై కూరగాయల నార్లు అందిస్తున్నారు. వికారాబాద్లోనే హైటెక్ నర్సరీ పూర్తయితే జిల్లాలోని కూరగాయల రైతులకు మేలైన కూరగాయలకు సంబంధించిన నార్లు అందుబాటులో ఉంటాయి.
సబ్సిడీ అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం
జిల్లా పరిధిలో 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఉద్యాన శాఖ ద్వారా కూరగాయలు, పండ్ల తోటలు, ఇతర అంశాలకు సంబంధించి రూ.కోటీ6లక్షలను సబ్సిడీ రూపంలో అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా 119.60 హెక్టార్లకు రూ.30.50లక్షలు సబ్సిడీగా అందించనున్నారు. ఈసారి జిల్లాలో అరటి తోటలు 59.60 హెక్టార్లకు రూ.18.32లక్షలు, బొప్పాయి 10 హెక్టార్లకు రూ.2.25లక్షలు, మామిడి 16 హెక్టార్లకు రూ.1.57లక్షలు, జామ 21 హెక్టార్లకు 3.7లక్షలు, బత్తాయి 2 హెక్టార్లకు రూ.19వేలు, సీతాఫలాలు 2 హెక్టార్లకు రూ.51 వేలు, డ్రాగన్ఫ్రూట్ 3 హెక్టార్లకు 2.88లక్షలు, అవొకాడో 2 హెక్టార్లకు రూ.36వేలు, చింతపండు 2 హెక్టార్లకు రూ.36వేలు, మ్యాంగోస్టీన్ ఒక హెక్టారుకు రూ.18వేలు, రాంబూటాన్ ఒక హెక్టారుకు రూ.18వేలు సబ్సిడీగా అందిస్తారు. దీంతోపాటు జిల్లాలో 50 హెక్టార్లలో కూరగాయల సాగుకు సంబంధించిన నారుకు రూ.10లక్షలు సబ్సిడీగా అందజేస్తారు. గత సంవత్సరం పెంచిన పండ్ల తోటల నిర్వహణకు రెండో సంవత్సరానికి సంబంధించి 81.90 హెక్టార్ల పండ్ల తోటలకు రూ.6.65 లక్షలు, మూడో సంవత్సరం నిర్వహణకు 13.32 హెక్టార్లలోని పండ్లతోటలకు రూ.78వేలు, 20 ఏండ్లు పైబడిన పండ్ల తోటల పునరుద్ధరణకు 8 హెక్టార్లకు రూ.1.60లక్షలు అందించనున్నారు.
యాక్షన్ ప్లాన్ మేరకు లబ్ధిదారుల ఎంపిక
నీటికుంటలు 7 యూనిట్లకు రూ.5.25లక్షలు సబ్సిడీ ఇస్తారు. ఒక్కో యూనిట్కు రూ.1.50లక్షలు ఖర్చవనుండగా 50శాతం సబ్సిడీ అందించనున్నారు. కలుపు లేకుండా వివిధ కూరగాయలు, ఇతర పంటల సాగుకు అవసరమయ్యే మల్చింగ్ పేపర్కు సంబంధించి 45 హెక్టార్లకు రూ.7.20లక్షలు సబ్సిడీగా ఇస్తారు. ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ కింద పండ్ల తోటల్లో పండుఈగ బుట్టల కోసం 142 హెక్టార్లకు రూ.1.70లక్షలు సబ్సిడీ అందించనున్నారు. తేనెటీగల పెంపకానికి సంబంధించి 41 యూనిట్లకు రూ.40 వేలు సబ్సిడీ, ఫార్మ్ మెకనైజేషన్ కింద బ్రెష్ కట్టర్లు 10 యూనిట్లకు రూ.1.41లక్షలు, ఆలుగడ్డ పండించే మర్పల్లి, మోమిన్పేట, నవాబుపేట మండలాల రైతుల కోసం పొటాటో ప్లాంటర్స్ 8 యూనిట్లకు రూ.1.14లక్షలు, ట్రాక్టర్తో మందులు స్ప్రే చేసే స్ప్రేయర్లు 3 యూనిట్లకు రూ.1.89లక్షలు, పండ్ల తోటల్లో పండ్ల గ్రేడింగ్, ప్యాకింగ్ చేసేందుకు అవసరమయ్యే గదుల నిర్మాణానికి 6 యూనిట్లకు రూ.12లక్షలు, రాష్ట్రస్థాయిలో రైతులకు శిక్షణా కార్యక్రమాల నిమిత్తం రూ.70వేలు కేటాయించారు. యాక్షన్ ప్లాన్లో పేర్కొన్న విధంగా లబ్ధిదారుల ఎంపిక చేపట్టి సబ్సిడీ డబ్బులు మంజూరు చేయనున్నారు.