రైతుల అభ్యున్నతికి అన్ని రకాలుగా కృషి చేస్తున్న ప్రభుత్వం సాగులో ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తీసుకొస్తున్నది. దీనివల్ల రైతులకు శ్రమ తగ్గడమే కాకుండా, రాబడి పెరిగే అవకాశం కూడా ఉన్నది. హార్టికల్చర్ విభాగం ఆవిష్కరిస్తున్న కొత్త రకం యంత్రాలను అందుబాటులోకి తీసుకురావడానికి వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సహకరిస్తున్నారు. దీంతో పాటు ఏయే నారుకు ఎంత సబ్సిడీ వస్తుందో తెలియజేసి వాటిపై అవగాహన పెంచుతున్నారు. పూర్తిగా ఆటోమేషన్ సీడింగ్ మెషీన్ ద్వారా నారును ఉత్పత్తి చేసి చీడపీడలను తట్టుకునే విధంగా రూపొందించి రైతులకు అందజేస్తున్నారు. ప్రభుత్వ చొరవకు అన్నదాతల నుంచి హర్షం వ్యక్తమవుతున్నది.
రంగారెడ్డి, మార్చి 31(నమస్తే తెలంగాణ) : తెలంగాణలో సుస్థిర వ్యవసాయాభివృద్ధి వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గడిచిన తొమ్మిదేండ్లుగా కృషి చేస్తున్నది. తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు సీఎం కేసీఆర్ ఎనలేని కృషి చేస్తున్నారు. ఫలితంగా తెలంగాణ నేడు వ్యవసాయ రంగంలో అద్భుత పురోగతిని సాధించింది. సీఎం కేసీఆర్ ముందుచూపు, ప్రణాళిక బద్ధమైన వ్యవసాయ విధానమే దీనికి కారణం. వ్యవసాయం అభివృద్ధి సాధించడానికి రైతుల నిరంతర కృషితో పాటు సాంకేతికంగా అందుబాటులోకి వచ్చిన విధానాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రో త్సహిస్తున్నది. సాగులోని కష్టనష్టాలపై ప్రభుత్వం రైతులకు అండగా ఉంటూ వారి కోసం ఎప్పటికప్పుడు నూతన పోకడలను, సాంకేతిక పరమైన సాగు పద్ధతులను అందుబాటులోకి తీసుకొస్తున్నది.
నిత్యనూతనంగా వ్యవసాయం
వ్యవసాయం నిత్య నూతనంగా కొనసాగాలని, ఎప్పటికప్పుడు అందిస్తున్న సాంకేతిక పద్ధతులు సాగు రూపు రేఖలనే మార్చి వేస్తున్నాయి. ప్రధానంగా కూరగాయల సాగులో నారు ఎంతో ఆరోగ్యంగా ఉంటే దిగుబడులు సైతం పెరిగే అవకాశం ఉంటుంది. గతంలో మడుల్లో నారు పెంచేవారు. అంది వచ్చిన నారుని సాగు భూమిలో రైతులు నాటుకునేవారు. అయితే, ఈ విధానంలో ఉన్న పలు రకాల ఇబ్బందులను అధిగమించాలని జిల్లా హార్టికల్చర్ విభాగం భావించింది. అందు లో భాగంగా షేడ్ నెట్ల ద్వారా ఆరోగ్యవంతమైన నారు మొక్కలను ఉత్పత్తి చేస్తున్నారు. అత్యాధునిక పద్ధతి ద్వారా నారును ఉత్పత్తి చేసేందుకు హార్టికల్చర్ విభాగం కొత్త పోకడలను ఆవిష్కరించింది. ప్రస్తుతం జిల్లాలోని రైతులందరినీ దృష్టిలో పెట్టుకొని పంటల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం హైదరాబాద్ నగరంలోని ‘జీడిమెట్ల సెంట్రల్ ఆఫ్ ఎక్స్లెన్సీ, సెంట్రల్ ఆఫ్ ఎక్స్లెన్సీ, ములుగు, సిద్ధిపేట’ జిల్లాల్లో హైటెక్ నర్సరీలను ఏర్పాటు చేసింది.
ఆటోమేషన్ సీడింగ్ మెషీన్ ద్వారా నారు ఉత్పత్తి
సంప్రదాయ పద్ధతిలో కాకుండా నూతన పద్ధతిలో నారు ఉత్పత్తికి హార్టికల్చర్ విభాగం చేయూతను అందిస్తున్నది. ఇందులో ఆచరిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం రైతుకు ఎంతగానో ఉపయోగపడనుంది. ప్రస్తుతం అత్యాధునికంగా, సాంకేతికతను ఉపయోగిస్తూ కూరగాయల సాగుకు సంబంధించిన నారు మొక్కలను పెంచుతున్నారు. పూర్తిగా ఆటోమేషన్ సీడింగ్ మెషీన్ ద్వారా ఈ నారును ఉత్పత్తి చేస్తున్నారు. షేడ్ నెట్లలో పెంచే నారు మొక్కలతో పోలిస్తే ఇవి ఆరోగ్యకరంగా, ధృఢంగా ఉండి, చీడ పురుగుల నుంచి తట్టుకునే శక్తి, ప్రధానంగా నారుకు వైరస్ సోకకుండా ఉంటుంది. వీటిలో టమాట, వంగ, పచ్చిమిర్చి, ఎండు మిర్చి, క్యాప్సికమ్, తీగ జాతి కూరగాయలు తదితర వాటి నారును పెంచి ఎండాకాలంలో కూరగాయల నారును రైతులకు అందిస్తున్నారు.
ఆసక్తి ఉన్న రైతులకు నారు…
ఈ తరహా నారు పొందేందుకు ఆసక్తి ఉన్న రైతులు సంబంధిత అధికారులను కలిసి దరఖాస్తు వివరాలు పొందాలి. ఇందుకు రైతు ముందుగా నాన్-సబ్సిడీ పోర్షన్ (డీడీ) ఏడీహెచ్, సెంట్రల్ ఆఫ్ ఎక్స్లెన్సీ, జీడిమెట్ల/ ఏడీహెచ్, సెంట్రల్ ఆఫ్ ఎక్స్లెన్సీ, ములుగు పేరుపై డీడీ చెల్లించాలి. రైతులు దరఖాస్తుకు డీడీని జతపర్చి సమర్చించాలి. దరఖాస్తు సమర్పించిన నెల రోజుల తర్వాత మొక్కలు సరఫరా చేస్తారు. ఒక్కో రైతుకు గరిష్టంగా రెండున్నర ఎకరాల వరకు కూరగాయల నారు ఇస్తారు.
అందుబాటులో అధికారులు
రైతులు స్పందించాలి..
ఖర్చుతో కూడుకున్న వ్యవహారం ఇది. రైతులకు ప్రభుత్వం సబ్సిడీ ద్వారా అందిస్తున్నది. మంచి అవకాశం. రైతులు దృష్టి సారించాలి. ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలి. ఇంతటి పరిజ్ఞానంతో నిర్మించిన ఈ ఆటోమెషీన్ హైటెక్ నర్సరీతో నారు పెంపకం చాలా ఖర్చుతో కూడుకున్నది. అందుకే నారు మొక్కలు అవసరమైన రైతులకు ఇక్కడ నుంచే సబ్సిడీ ద్వారా అందిస్తున్నాం. నారు మొక్కలు అవసరం ఉన్న రైతులు తమకు దగ్గరలో ఉన్న హార్టికల్చర్ అధికారి (హెచ్ఓ), హార్టికల్చర్ ఎక్స్టెన్షన్ అధికారి (హెచ్ఈఓ)ను సంప్రదించాలి.
– డాక్టర్ ఎన్.సునందా రాణి,
జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి, రంగారెడ్డి జిల్లా