Basthi Dawakhana | రంగారెడ్డి, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ) : ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యతనిచ్చిన కేసీఆర్ ప్రభుత్వం గత ఏడాది జిల్లాలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానలు ప్రజల ఆదరణను చూరగొంటున్నాయి. ఎక్కడో దూర ప్రాంతానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగా వైద్యం పొందేలా నెలకొల్పిన ఈ దవాఖానలు అపర సంజీవనీలుగా సేవలందిస్తున్నాయి. జిల్లాలో ఏర్పాటు చేసిన 70 దవాఖానలు దిగ్విజయంగా నడుస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ దవాఖానలను మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నది. 18 దవాఖానల్లో డాక్టర్ల పోస్టులు ఖాళీగా ఉండడంతో వాటి భర్తీకి జిల్లా వైద్యారోగ్య శాఖ సన్నాహాలు చేస్తున్నది. ఈ ప్రక్రియ పూర్తయితే ఆసుపత్రులకు డాక్టర్ల కొరత పూర్తిగా తీరనున్నది.
సేవల్లో సూపర్ హిట్..
బస్తీల్లో సుస్తీ పోగొట్టేందుకు కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానలు జిల్లాలో సూపర్ హిట్ అయ్యాయి. జిల్లా ఆసుపత్రితోపాటు, ఏరియా ఆసుపత్రులు, సీహెచ్సీలు, పీహెచ్సీలు ప్రజానీకానికి మెరుగైన వైద్య సేవలు అందిస్తూ వస్తున్నాయి. పట్టణ శివారు గ్రామాల విలీనంతో నగరాలు, పట్టణాల పరిధి పెరిగింది. పల్లె దవాఖానల మాదిరిగానే బస్తీల్లోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సంకల్పించి కేసీఆర్ ప్రభుత్వం బస్తీ దవాఖానలను అందుబాటులోకి తెచ్చింది. 5వేల నుంచి 10వేల జనాభాకు అనుగుణంగా బస్తీ దవాఖానలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించి జిల్లా వ్యాప్తంగా 70 బస్తీ దవాఖానలను ఏర్పాటు చేసి వైద్య సేవలను మొదలు పెట్టింది.
తప్పిన వ్యయ ప్రయాసలు..
బస్తీ దవాఖానలు ఏర్పాటు కాక ముందు బస్తీలు, కాలనీల్లోని ప్రజలు జ్వరం, దగ్గు, జలుబు.. ఇలా ఏ ఆరోగ్య సమస్య వచ్చినా ప్రభుత్వ, ప్రైవేటు వైద్యం కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. రాను పోను ఖర్చులతో పాటు వైద్య ఖర్చులు కలిసి తడిసి మోపెడయ్యేవి. బస్తీ దవాఖానలు ఏర్పాటయ్యాక వైద్యం చెంతకే చేరడంతో వ్యయ ప్రయాసలు పూర్తిగా తప్పాయి. సత్వర వైద్యం అందిస్తుండడంతోపాటు డాక్టర్లు ఉచితంగా వైద్యం అందించి మందులను అందజేస్తుండడంతో స్థానికులు బస్తీ దవాఖానలకు క్యూ కడుతున్నారు. వివిధ ఆరోగ్య సమస్యలపై బస్తీ దవాఖానలకు వచ్చి సేవలు పొందుతున్న వారి సంఖ్య నిత్యం 40-80 మధ్య ఉంటోంది. బస్తీ దవాఖానల ఏర్పాటుతో ప్రైవేటు వైద్యుల వద్దకు వెళ్లి డబ్బులు ఖర్చు చేసుకునే బాధ తగ్గిందని బస్తీ వాసులు పేర్కొంటున్నారు.
డాక్టర్ల నియామకానికి కసరత్తు..
ప్రతి దవాఖానలో మెడికల్ ఆఫీసర్, స్టాఫ్నర్సు, స్వీపర్, ఆయా జిల్లాలో 18 బస్తీ దవాఖానల్లో డాక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ మేరకు జిల్లా వైద్యారోగ్య శాఖ సన్నాహాలు చేస్తున్నది. మెడికల్ ఆఫీసర్లుగా ఎంబీబీఎస్ చదివిన వారిని నియమించేందుకుగాను ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. సర్టిఫికేషన్, ఇంటర్వ్యూ తదితర ప్రక్రియలను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో త్వరలోనే బస్తీ దవాఖానల్లో డాక్టర్ల కొరత తీరనున్నది.