దుండిగల్, ఫిబ్రవరి 27: ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఓ వైద్యుడు చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గాజులరామారం సర్కిల్, మెట్ కాని గూడాలోని స్ప్లెండర్ అపార్ట్మెంట్స్ నివాసి ఏం విజయభాస్కర్ (62) అనే వైద్యుడు నగరంలోని నిమ్స్లో ఓ విభాగాధిపతిగా పనిచేస్తున్నాడు. గత కొంతకాలంగా విజయభాస్కర్ ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాడు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం ఇంట్లో ఎవరికి చెప్పకుండా బయటికి వెళ్లిన ఆయన తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు ఈ విషయమై పోలీసులకు ఈనెల 25న ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
గురువారం సూరారంలోని కట్ట మైసమ్మ (లింగం) చెరువులో ఓ గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహం నీటిపై తేలి ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శవాన్ని నీటిలోంచి బయటికి తీసి పరీక్షించగా డా. విజయభాస్కర్గా అనుమానించి కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. దీంతో కుటుంబ సభ్యులు మృతుడిని డాక్టర్ విజయభాస్కర్గా గుర్తించారు. దీంతో పోలీసులు పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని గాంధీ వైద్యశాలకు తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా డాక్టర్ విజయభాస్కర్కు భార్యా ఇద్దరు కూతుళ్లు ఉన్నట్లు తెలుస్తున్నది.