మాదాపూర్, ఫిబ్రవరి 9: హామ్స్టెక్ విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి ర్యాంప్పై క్యాట్ వాక్ చేసి సందర్శకులను విశేషంగా అలరించారు. మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్లో శుక్రవారం ఏర్పాటు చేసిన హామ్స్టెక్ ఫ్యాషన్ షో-2024 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సెలెబ్రిటీ, నేషనల్ అవార్డ్ విన్నంగ్ ఫ్యాషన్ డిజైనర్ నీతా లుల్లా విచ్చేసి డిజైనర్లు కామిని షరీఫ్, గౌరాన్షా, హామ్స్టెక్ సీఈవో అజితారెడ్డితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులు తమ నైపుణ్యతతో మూడేండ్లుగా నేర్చుకున్న ఫ్యాషన్ ఉత్పత్తులను స్టాల్స్లో ప్రదర్శించినట్లు చెప్పారు. సస్టెనబిలిటీ డిజైన్ అనే థీమ్తో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 200 మందికి పైగా డిజైనర్లు వేయికి పైగా డిజైన్లను స్టాల్స్లో ప్రదర్శించారు. ఇందులో విద్యార్థులు స్వయంగా తయారు చేసిన దుస్తులతో పాటు లైటింగ్ ల్యాంప్, గృహోపకరణ ఉత్పత్తులను ప్రదర్శించడంతో విద్యార్థులు సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. అనంతరం విద్యార్థులు ఆట, పాటలతో చిందులు వేస్తూ సందడి చేస్తూ ఉత్సాహంగా గడిపారు.