రంగారెడ్డి, మే 29 (నమస్తే తెలంగాణ) : జూన్ 9న నిర్వహిస్తున్న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆదేశాలను అనుసరించి పకడ్బందీగా నిర్వహించాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక అన్నారు. బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, అధికారులతో కలిసి నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. మొదటి సారిగా బయో మెట్రిక్ పద్ధతిన పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న 93 సెంటర్లలో 55,692 మంది గ్రూప్-1 పరీక్షకు హాజరవుతున్నట్లు చెప్పారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అభ్యర్థుల బయోమెట్రిక్ వెరిఫికేషన్ క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. సెల్ ఫోన్, ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదన్నారు. డిపార్ట్మెంటల్ అధికారులు పరీక్ష రోజున ఉదయం 8 గంటలకే కేంద్రాలకు చేరుకోవాలన్నారు. సమావేశంలో రీజినల్ కోఆర్డినేటర్లు, డిపార్ట్మెంటల్ అధికారులు, ైఫ్లయింగ్ స్వాడ్, సూపరింటెండెంట్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.