రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ద్వారా గ్రూప్-1, 2, 3, 4 పరీక్షలను పకడ్బందీ గా నిర్వహిస్తున్నది. ఎంతో మంది నిరుద్యోగ యువతీ యువకులు కష్టపడి చదివి, ఎలాంటి పైరవీలు, లంచాలకు తావులేకుండా ప్రభుత్వ ఉద్యోగాలను సాధించి.. తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు లక్షలాది మంది ఉద్యోగార్థులకు జాబ్లను కల్పించింది. ఎంతో నియమ నిబద్ధతతో పనిచేస్తున్న టీఎస్పీఎస్సీకి కొంతమంది గ్రూప్-1 పేపర్ లీకేజీతో అప్రతిష్టను తీసుకొచ్చారు. మొన్న జరిగిన పేపర్ లీకేజీ అంశం చాలా దురదృష్టకరమని ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులు, నిరుద్యోగ యువతీయువకులు పేర్కొంటున్నారు. దీని ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకొని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటుం డగా.. రాష్ట్రంలోని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రాజకీయం చేయాలని చూస్తున్నాయని ఉద్యోగార్థులు మండిపడుతున్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలను కల్పించేందుకు ప్రభుత్వం వరుసగా ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తుండగా.. గతంలో ఒక్క ఉద్యోగాన్నీ కూడా భర్తీ చేయలేని పార్టీలు నేడు రాస్తారోకోలు, ధర్నాలతో రాజకీయ పబ్బం గడుపుకొంటున్నాయని పేర్కొంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం నీళ్లు, నిధులు, నియామకాలు అనే ట్యాగ్లైన్తోనే ముందుకెళ్తున్నదని.. ఇది మింగుడుపడక ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని పలువురు భగ్గుమంటున్నారు. ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకుని మాట్లాడితే బాగుంటుందని సూచిస్తున్నారు.
ఇబ్రహీంపట్నం, మార్చి 19: తెలంగాణ ప్రాంత నిరుద్యోగ యువతీ యువకులు ఎంతోమందికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పారదర్శకతే ప్రమాణంగా ఉద్యోగ అవకాశాలు కల్పించింది. సామాన్య కుటుంబంలో నుంచి వచ్చిన అనేక మంది కష్టపడి చదివి, ఎలాంటి పైరవీలూ లంచాలకు తావులేకుండా ఉద్యోగాలు సాధించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగాలు పొందినవారిలో ఎక్కువమంది తమ ప్రావీణ్యాన్ని కొలమానికంగా పొందారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా లక్షల మంది నిరుద్యోగ యువతీ, యువకులకు ఉద్యోగావకాశాలు కల్పించింది. కానీ, కొంతమంది స్వార్థం కోసం పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పనిచేసే ఉద్యోగులు తప్పుచేసి, పబ్లిక్ సర్వీస్ కమిషన్కు చెడ్డపేరు మూటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని అవకాశంగా భావించి ప్రతిపక్షాలు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయడం సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రతిభాపాటవాలే కొలమానంగా భావించి పబ్లిక్సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేశారు. ఎలాంటి పైరవీలు, లంచాలకు ఆస్కారం లేకుండా పనిచేసిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ను నిందించడం సరికాదని పలువురు ప్రభుత్వ ఉద్యోగులు, అభ్యర్థులు మండిపడుతున్నారు.
తాండూరు : గత ఎనిమిదేండ్లలో టీఎస్పీఎస్సీ ద్వారా 155 నోటిఫికేషన్లతో 37 వేల ఉద్యోగాలు భర్తీ చేసిన ఆయా నియామకాలపై ఇప్పటివరకు ఎలాంటి ఆరోపణలు లేవని పలువురు ప్రభుత్వ ఉద్యోగులు పేర్కొంటున్నారు. టీఎస్పీఎస్సీతో ప్రభుత్వంలోని వివిధ ఉద్యోగాలకు తగిన అభ్యర్థులను ఎంపిక చేయడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేయడానికి సహకరిస్తున్నదన్నారు. నియామకాలకు తగిన నియమాలను రూపొందించడం, పదోన్నతులపై సలహా ఇవ్వడం, బదిలీలు, క్రమశిక్షణా చర్యలు మొదలైనవన్నీ సమర్థవంతంగా చేస్తున్నదన్నారు. ఒకరిద్దరి తప్పిదంతో ఇటీవల పేపర్ లీక్ జరుగడం బాధాకరమైనప్పటికీ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు నీచమైన రాజకీయం చేస్తున్నారని అభ్యర్థులు పేర్కొంటున్నారు. దీనిపై సంబంధిత శాఖ నేతలు, అధికారులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం లోతుగా ఆలోచించి కఠినమైన చర్యలు తీసుకునేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నప్పటికీ ప్రతిపక్ష పార్టీలు నోటికి వచ్చినట్లు మాట్లాడడం అవివేకంగా కనిపిస్తున్నదంటున్నారు. అనవసరమైన రాజకీయాలు చేసి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవద్దని జిల్లాలోని ఉద్యోగులు, నిరుద్యోగ అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.
చదువు పూర్తయిన 8 సంవత్సరాలకే ఉద్యోగాన్ని పొందడం చాలా సంతోషంగా ఉంది. బొంరాస్పేట మండలంలోని సాగారం తండాకు చెందిన రమేష్రాథోడ్. కుటుంబంలో అమ్మా, నాన్నతో పాటు మేము నలుగురం అన్నతమ్ముళ్లం. నేను మూడో సంతానం. అమ్మానాన్న ప్రస్తుతం తండాలోనే వ్యవసాయం చేస్తున్నారు. అన్న, తమ్ముళ్లు ముంబాయిలో మేస్త్రీ పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. కుటుంబ సభ్యుల సహకారంతో హైదరాబాద్ని ఉస్మానియా క్యాంపస్లో ఎంఏ, బీఈడీతో 2012లో చదువు పూర్తి చేశాను. ఆ తరువాత తెలంగాణ ప్రభుత్వం 2018లో పంచాయతీ కార్యదర్శుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. దాంతో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకొని, ఉద్యోగాన్ని సాధించాలనే పట్టుదలతో ఇంటి వద్ద కష్టపడి చదువుకుకొన్నా. సిలబస్ ప్రకారం ప్రణాళికా బద్ధంగా చదువు కొనసాగించాను. 2019లో ఉద్యోగానికి పరీక్షలు జరిగాయి. 2020లో నియామకాలు జరిగి ప్రస్తుతం వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలంలోని ఆలేడ్ గ్రామంలో పంచాయతీ కార్యదర్శిగా నియమించబడ్డా. ఉద్యోగాన్ని సాధించేందుకు ఎంతో మంది చాలా కష్టపడుతుంటారు. నేను ఉద్యోగాన్ని సాధించడం కష్టంగా భావించిన ప్రస్తుతం ఆనంద జీవితాన్ని గడుపుతున్నా.
– రమేశ్రోథోడ్, పంచాయతీ కార్యదర్శి, ఆలేడ్, దుద్యాల మండలం, కొడంగల్.
కొడంగల్, మార్చి 19 : మున్సిపల్ పరిధిలోని బాకారం వీధిలో ఇకే కుటుంబంలో వదిన, మరిది ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగాలను సాధించారు. బాకారం భువనేశ్వరి ప్రస్తుతం తాండూరు నియోజకవర్గంలోని బషీరాబాద్ మండలంలోని ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వర్తిస్తున్నది. 2017 డీఎస్సీలో టీచర్ ఉద్యోగ అర్హత సాధించి 2019 సంవత్సరంలో ఉద్యోగంలో చేరారు. బాకారం బస్వరాజ్ 2016లో కానిస్టేబుల్ ట్రేనింగ్ చేసి, 2017లో ఉద్యోగంలో చేరారు. బొంరాస్పేట మండలం సాగారం తండాకు చెందిన రమేశ్రాథోడ్, 2020 సంవత్సరంలో ఉద్యోగాన్ని పొంది ప్రస్తుతం దుద్యాల మండలంలోని ఆలేడ్ గ్రామంలో పంచాయతీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
2014 డీఎడ్ (టీటీసీ) విద్యను పూర్తి చేశాను. ఆ తరువాత ఉన్నత విద్య డిగ్రీ చదువు కొనసాగించాను. తెలంగాణ ప్రభుత్వంలో ఉపాధ్యాయ నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఉద్యోగాన్ని సాధించా. 2014లోనే టీటీసీ పూర్తి కావడం, 2017లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కావడం పోటీ పరీక్షలో అర్హత సాధించగా, 2019లో తాండూర్ నియోజకవర్గంలోని బషీరాబాద్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా చేరాను. కలిసొచ్చిన కాలంగా భావిస్తున్నా. ఉద్యోగం కోసం ఏండ్ల కాలంగా ఎదురు చూసిన వారు ఎందరో ఉన్నారు. చదువు పూర్తి కాగానే తెలంగాణ ప్రభుత్వంలో ఉద్యోగ నోటిఫికేషన్ రావడం, ఉద్యోగాన్ని పొందడం చాలా సంతోషంగా ఉంది.
– బాకారం భువనేశ్వరి, ఉపాధ్యాయురాలు, కొడంగల్.
గతంలో ఎలాంటి అవినీతి, అక్రమాలు జరుగకపోవడం వల్లే నాకు 2019 డీఎస్సీలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా జాబ్ వచ్చింది. టీచర్ ఉద్యోగం సాధించుటకు ప్రత్యేక మైన శిక్షణతో పాటు రోజు 12 నుంచి 14 గంటలు చదివాను. ఎలాంటి పైరవీలు చేయలేదు. పరీక్ష రాసిన సమయంలో ఎక్కడ కూడా చిన్న పొరపాటు జరుగలేదు. పోస్టింగ్ విషయంలో కూడా ఎలాంటి రికమండేషన్లు జరుగలేదు. నేను తాండూరు పట్టణంలో పుట్టిపెరిగినపటికీ పెద్దేముల్ మండలం జైరాంతండాలో ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వహిస్తున్నా. నాతోపాటు నా స్నేహితులు, బంధువులు కూడా డీఎస్సీలో జాబ్ వచ్చింది. కానీ అందరం కష్టపడి చదువుకున్నాం. ఇప్పటి వరకు టీఎస్పీఎస్సీ ద్వారా ఉద్యోగాలు సాధించిన వారందరూ పైరవీలు చేయకుండా కష్టపడి చదవడంతోనే ఉద్యోగాలు వచ్చాయని నమ్ముతున్నా. అనవసరమైన రాజకీయాలు చేసి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవద్దు.
– సి.రేఖ, ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, తాండూరు
చదువును పూర్తి చేసిన వెంటనే తెలంగాణ ప్రభుత్వం టీఎస్పీఎస్సీ ద్వారా విడుదల చేసిన నోటిఫికేషన్తో నాకు జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఉద్యోగం వచ్చింది. కేశంపేట మండలంలోని నిర్దవెళ్లిలోని నిరుపేద వడ్రంగి కుటుంబం మాది. నేను డిగ్రీ పూర్తి చేశాను. 2018 వచ్చిన నోటిఫికేషన్లో పరీక్ష రాసి 2019 ఏప్రిల్ 11న జూనియర్ పంచాయతీ కార్యదర్శిగా ఎలాంటి అవకతవకలు లేకుండా పారదర్శకంగా ఉద్యోగం సాధించా. ప్రస్తుతం షాద్నగర్ నియోజకవర్గంలోని నందిగామ మండలంలో సీడీ తండా పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తున్నాను. తెలంగాణ ప్రభుత్వం చదువుకున్న యువతకు మంచి భవిష్యత్ కల్పిస్తుందనే నమ్మకం ఉంది. యువకులు కష్టపడి చదివి మంచి ఉద్యోగాలు సంపాదించేందుకు తెలంగాణ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ దిశగా యువకులు ముందుకు సాగాలి.
– శ్రీనివాసాచారి, జూనియర్ పంచాయతీ కార్యదర్శి, నిర్దవెళ్లి, కేశంపేట మండలం.
కష్టపడి చదువుకున్న నాకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రతిఫలం దక్కింది. మాది కేశంపేట మండలం కాకునూరు గ్రామంలోని మధ్య తరగతి వ్యవసాయ కుటుంబం. మా తల్లిదండ్రులు కష్టపడి వ్యవసాయం చేస్తూ నన్ను చదివించారు. చిన్నప్పటి నుంచి కుటుంబ పరిస్థితులు, ఇబ్బందులను చూసిన నాకు ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే సంకల్పంతో చదువును సాగించి బీఎడ్ పూర్తి చేశాను. ఎన్నో ఏండ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత వచ్చిన తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు 2017లో ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారా 2018 ఫిబ్రవరి 25 పరీక్ష రాసి, 2019లో విద్యాశాఖలో ఎస్జీటీగా ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా ఉద్యోగం సాధించా. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలోని సరూర్నగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నా. చదువుకున్న యువత కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో శ్రద్ధతో ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టడంతో నాలాంటి ఎంతో మందికి ఉద్యోగాలు వచ్చాయి. తెలంగాణలో యువతకు మంచి భవిష్యత్తు ఉంది.
– మోటె శ్రీకాంత్, ప్రభుత్వ ఉద్యోగి, కాకునూరు, కేశంపేట మండలం
తెలంగాణలో సివిల్ సర్వీస్ ఉద్యోగాలకు దరఖాస్తుదారుల యోగ్యత, రిజర్వేషన్ నిబంధన ప్రకారం దరఖాస్తుదారులను ఎంపిక చేయడం జరుగుతుంది. నేను 2019 ఏప్రిల్లో పంచాయతీ కార్యదర్శిగా నియామకమయ్యాను. నా నియామక పక్రియ ఎంతో పారదర్శకంగా జరిగింది. ఎవరూ నన్ను డబ్బులు అడుగడం కాని, నేను ఇవ్వడం కానీ జరుగలేదు. డబ్బు లావాదేవీలకు ఆస్కారం లేకుండా పంచాయతీ కార్యదర్శుల నియామక ప్రక్రియ కొనసాగింది.
– సుధాకర్, యాలాల మండలం, కోకట్ పంచాయతీ కార్యదర్శి
స్వార్థపరులకోసం టీఎస్పీఎస్సీని బద్నామ్ చేయడం పరికాదు. తెలంగాణ ఏర్పడిన తరువాత టీఎస్పీఎస్సీ ద్వారా పారదర్శకంగా ఉద్యోగాలను భర్తీ చేసినప్పటికీ కొందరు తమ కుటుంబ సభ్యుల కోసం ప్రభుత్వాన్ని తప్పుతోవ పట్టించడం సరి కాదు. 2019 సంవత్సరం లో ఎప్పుడూ లేని విధంగా పంచాయతీ కార్యదర్శులను ఎంపిక చేసి గ్రామాల్లో ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకే తెలంగాణ ప్రభుత్వం కార్యదర్శులను నియమించింది.
– హరీశ్వర్రెడ్డి,
అయినాపూర్ పంచాయతీ కార్యదర్శి, దోమ మండలం
నేను ప్రభుత్వ టీచర్గా పని చేస్తూనే ఉన్నతమైన ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో కష్టపడి చదివి టీఎస్పీఎస్సీ ద్వారా వివిధ ఉద్యోగాల కోసం పరీక్షలు రాశా. టీఎస్పీఎస్సీ ద్వారా జరిగిన పరీక్షల్లో ఎక్కడ కూడా చిన్న పొరపాటు లేకుండా పారదర్శకంగా పరీక్షలు, ఉద్యోగుల నియామకాలు జరిగాయి. 2016లో టీఎస్పీఎస్సీ ద్వారా వచ్చిన గ్రూప్-2 నోటిఫికేషన్లో పరీక్షలు రాసి 2020లో ఎక్సైజ్ ఎస్ఐగా ఉద్యోగం పొందాను. ఎలాంటి పైరవీలు లేకుండా ఒక్క రూపాయి కూడా ఎవరికీ లంచం ఇవ్వకుండా నాలాంటి పేద కుటుంబానికి చెందిన వ్యక్తికి గ్రూప్-2 ఉద్యోగం రావడం అంటే టీఎస్పీఎస్సీ పారదర్శకంగా ఉండటం వల్లనే ఉద్యోగం వచ్చింది.
– ఎర్రగారి జంగయ్య, ఎక్సైజ్ ఎస్ఐ, నందిగామ
తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ ద్వారా గతంలో జరిగిన అన్ని రకాల ఉద్యోగ నియామాలు ఎంతో పారదర్శకంగా జరిగాయి కాబట్టే నాకు టీఎస్పీఎస్సీ ద్వారా వ్యవసాయ శాఖలో ఉద్యోగం వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో 2018లో టీఎస్పీఎస్సీ ద్వారా సుమారు 851 వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈఓ)ల ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ జారీ అయింది. అప్పట్లో నేను వరంగల్లోని హరీష్ అకాడమీలో ఏఈవో ఉద్యోగం సంపాదించడానికి సుమారు రూ.45 వేల నుంచి రూ.50వేల ఖర్చు పెట్టుకొని సుమారు 8 నెలల పాటు అహర్నిశలు పరీక్షకు సిద్ధం అయ్యాను. ప్రతిఫలంగా నాకు టీఎస్పీఎస్సీ ద్వారా నిర్వహించిన ఉద్యోగ నియామక నోటిఫికేషన్లో ఓపెన్ క్యాటగిరీలో వ్యవసాయ విస్తరణ అధికారి(ఏఈఓ) ఉద్యోగం వచ్చింది. ఎవ్వరి దగ్గర ఉద్యోగం కోసం నేను వ్యక్తిగతంగా పైరవీలు చేయలేదు. నియామకాల్లో ఎక్కడా కూడా పైరవీలకు తావులేకుండా నియామకాలు జరిగాయి. అప్పట్లో అత్యంత పారదర్శకంగా తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ నియామాకాలు చేపట్టడంతోనే నాకు ఉద్యోగం వచ్చింది. నేను నా ఫస్ట్ పోస్టింగ్ను మెదక్ జిల్లా రేగోడ్లో చేసి ఇటీవల పెద్దేముల్ మండలానికి బదిలీపై వచ్చాను.
– శివరత్, వ్యవసాయ విస్తరణ అధికారి(ఏఈవో),పెద్దేముల్ మండలం
టీఎస్పీఎస్సీ ద్వారా పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాన్ని కష్టపడి సాధించాం. రాత్రింబవళ్లు కష్టపడి చదివాం. ప్రభుత్వం నిర్వహించిన నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాన్ని సాధించాం. ప్రభుత్వం ఉద్యోగాల కల్పనకు చేస్తున్న కృషివల్లనే తాను ఉద్యోగాన్ని సాధించాను. ఉద్యోగ కల్పనకు కృషిచేసిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
– ప్రభాకర్, కొండాయ పల్లి పంచాయతీ కార్యదర్శి, కులకచర్ల
చాలా కాలంగా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల కాకపోవడం, ఎంతో మంది ఉద్యోగాలు కోసం ఎదురు చూసి రోజులు ఉన్నాయి. వయస్సు పైబడటంతో నిరాశ చెందిన వారు ఎందరో. 2013లో డిగ్రీ పూర్తి పూర్తి చేశాను. 2016లో తెలంగాణ ప్రభుత్వం పెద్ద మొత్తంలో కానిస్టేబుల్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయగా అందులో అర్హత సాధించాను. 2016లో ట్రెనింగ్ పూర్తి చేసి 2017 సంవత్సరంలో ఉద్యోగంలో చేరాను. ప్రస్తుతం హైదరాబాద్లోని గచ్చిబౌలి పోలీస్స్టేషన్లో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. తెలంగాణ ప్రభుత్వంలోని రెండు సంవత్సరాల కాలంలోనే మా ఇంట్లో మా వదినమ్మ 2019లో ఉపాధ్యాయురాలిగా, 2017లో నేను కానిస్టేబుల్గా ఉద్యోగాల్లో చేరాం. చిన్న వయస్సలోనే ఉద్యోగాన్ని సాధించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది.
– బాకారం బస్వరాజ్, కానిస్టేబుల్, కొడంగల్
యాదాద్రి జిల్లా ఆలేరుకు చెందిన నేను, 2015లో బీటెక్ పూర్తి చేసుకున్నా. పూర్తి అయిన రెండు నెలల్లో నోటిఫకేషన్ పడింది. కష్టపడి చదివి 2016లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుల చేసిన నోటిఫికేషన్లో ఆర్అండ్బీ శాఖకు సంబంధించిన ఉద్యోగం చేయాలని ఎంచుకున్నాను. ఏఈఈ పరీక్ష రాసి ఉద్యోగం సాధించా. వికారాబాద్ ఆర్అండ్బీ శాఖలో గత 7 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక నోటిఫికేషన్ విడుదల కావడంతో నాతో పాటు ఎంతో మంది ఉద్యోగాలు సాధించారు. నా స్నేహితులు వివిధ శాఖల్లో ఉద్యోగులు ఇతర ప్రాంతాలో చేస్తున్నారు.
– చెన్నూరి స్వప్న, ఏఈఈ, ఆర్అండ్బీ, వికారాబాద్
2019 ఏప్రిల్ 12, 2018 సెప్టెంబర్లో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకానికి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తు చేసుకున్న నాటి నుంచి పరీక్షకు కేవలం 25 రోజుల సమయం మాత్రమే ఇచ్చారు. మొదటి సారి పరీక్షా విధానం నెగెటివ్ మార్కింగ్ విధానంలో నిర్వహించారు. 25 రోజులు కష్టపడి పరీక్ష రాశాను. వికారాబాద్ జిల్లాలో టాప్ 5 ట్యాంకు సాధించి బొంరాస్పేట మండలంలోని లింగన్పల్లిలో పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తున్నా. పంచాయతీ కార్యదర్శుల ఎంపిక పరీక్ష పారదర్శకంగా నిర్వహించారు. ఇటీవల నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలో విజయం సాధించి మెయిన్కు అర్హత సాధించా. కానీ దురదృష్టవశాత్తూ పేపర్ లీకేజీ కారణంగా పరీక్ష రద్దయింది.
-రాకేశ్గౌడ్, జూనియర్ పంచాయతీ కార్యదర్శి,బురాన్పూర్, బొంరాస్పేట మండలం
మా చిన్నప్పటి నుంచి అమ్మానాన్న వ్యవసాయ పనులు చేస్తూ ఎంతో కష్టపడి చదివించారు. ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో చదువు పూర్తి చేసుకొని 2016 టీఎస్పీఎస్సీ రిక్రూట్మెంట్లో విద్యుత్ ఏఈగా ఉద్యోగం సాధించా. ఇప్పుడు నేను నా కుటుంబం గౌరవంగా సంతోషంగా ఉన్నాం. ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నించే ప్రతి ఒక్కరూ సబ్జెక్ట్పై ఫోకస్ పెట్టి బాగా నేర్చుకోవాలి. ఎప్పుడైనా చదివే వారికి జాబ్ ఎక్కడా పోదు, ఎక్కువ మార్కులు ఉన్న సబ్జెక్టు పైన ఎక్కువ శ్రద్ధ వహిస్తే మంచి ఫలితం ఉంటుంది.
– సుధాకర్, విద్యుత్ ఏఈ , ఎన్కతల గ్రామం
పారదర్శకతకు పెట్టింది పేరుగా ఉన్న పబ్లిక్ సర్వీస్ కమిషన్కు కొంతమంది చేసిన పొరపాట్ల వల్ల తెలంగాణ నిరుద్యోగుల్లో అపోహలు పెరిగాయి. వారిలో ఉన్న అపోహలను ప్రభుత్వం తొలగించాలి. 2017లో టీఎస్పీఎస్సీ ద్వారా ఎగ్జామ్ రాశాను. 2020లో పోస్టింగ్ ఇచ్చారు. నా లాంటి ఎంతోమంది కష్టపడి చదివినవారికి మాత్రమే ఉద్యోగాలు వచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.
– నరేశ్, డిప్యూటీ తాసిల్దార్, చేవెళ్ల
తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఉద్యోగాలు వస్తాయని, వాటిని సాధించే దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టా. అనుకున్నట్టుగానే ఎస్ఐ నోటిఫికేషన్ వచ్చింది. దాంతో మొదట శారీరక దారుఢ్యాన్ని పెంచుకున్న, రన్నింగ్, జంపింగ్, లాంటి వాటిలో నైపుణ్యం సాధించి, ఫ్రిలిమ్స్కు అర్హత సాధించా. నాది వెల్దండ గ్రామం కావడంతో నగరానికి పోయి కోచింగ్ సెంటర్లో శిక్షణ తీసుకున్న. అలాగే ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్టడీ సెంటర్లో మెటీరియల్ తీసుకుని కష్టపడి చదివి ఉద్యోగం సంపాదించా. నా తల్లి దండ్రులు ఎంతో కష్టపడి చదివించారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని మా అమ్మ కోరిక, నా ఆశయంతో చదివి 2020లో ఎస్ఐ ఉద్యోగం సాదించాను. ఉద్యోగం సాధించడానికి నేను ఎవ్వరికీ రూపాయి ఇవ్వలేదు. ఎవరి రికమండేషన్లు పెట్టలేదు. నా కష్టాన్ని నమ్ముకుని ఉద్యోగం సాధించా. నాకు పోస్టింగ్ కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారమే జరిగింది. నేను ప్రస్తుతం శంకర్పల్లిలో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నా.
– సంతోష్రెడ్డి, ఎస్ఐ
ఎలాంటి పైరవీలు లేకుండా ఉద్యోగం సాధించాను. నేను గ్రూప్ 2కు ప్రిపేర్ కావడం జరిగింది. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల రిక్రూట్మెంట్ ప్రక్రియ నోటిఫికేషన్ రావడంతో మూడు నెలలు పంచాయతీ కార్యదర్శి పరీక్షకు ప్రిపేరై రాశాను 12 ఏప్రిల్ 2019న యాలాల్ మండలం, ముద్దాయిపేట్ గ్రామంలో పోస్టింగ్ వచ్చింది. అక్కడ విధులు నిర్వహించి అక్కడి నుంచి బదిలీపై వచ్చి మర్పల్లి మండలంలోని జంషాదపూర్ గ్రామంలో విధులు నిర్వహిస్తున్నా.
– జ్యోతిర్లింగం, జూనియర్ పంచాయతీ కార్యదర్శి, పట్లూర్, మర్పల్లి మండలం
ఎస్సై, కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యాను అంతలోనే ప్రభుత్వం జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో మూడు నెలలు ప్రిపేరై పంచాయతీ కార్యదర్శికి పరీక్ష రాశాను. అందులో జాబ్ రావడంతో ముందుగా యాలాల్ మండలం, లక్ష్మీనారాయణపూర్ గ్రామంలో 12 ఏప్రిల్ 2019న పోస్టింగ్ వచ్చింది అక్కడ విధులు నిర్వహించి అక్కడి నుంచి మర్పల్లి మండలం, కొంషట్పల్లికి బదిలీపై వచ్చా. ప్రస్తుతం ఇక్కడనే విధులు నిర్వహిస్తున్నా. -ప్రశాంత్, జూ.పంచాయతీ కార్యదర్శి,
రావులపల్లి, మర్పల్లి మండలం
నాది సామాన్య కుటుం బం. కష్టపడి చదివి 2016లో నిర్వహించిన ఉద్యోగాల భర్తీలో ఎక్సైజ్ ఎస్ఐగా ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించా. ఎలాంటి పైరవీలు చేయలేదు.. ఎవ్వరికీ లంచాలు ఇవ్వలేదు. మెరిట్ ఆధారంగానే జాబ్ను సాధించా. కానీ, కొంతమంది ఉద్యోగులు ఇటీవల తప్పుడు మార్గాన్ని ఎంచుకుని టీఎస్పీఎస్సీ మంచి పేరును చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.
– అనిల్కుమార్, ఎక్సైజ్ ఎస్ఐ,గడ్డమల్లాయిగూడ