రంగారెడ్డి, నవంబర్ 12, (నమస్తే తెలంగాణ) : రైతుల నుంచి వడ్లను కొనుగోలు చేయమన్న కేంద్రం వైఖరికి నిరసనగా గులాబీ దళం కదిలివచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించారు. అన్ని నియోజకవర్గాల్లోనూ టీఆర్ఎస్ శ్రేణులు, రైతులు భారీగా పాల్గొని ధర్నాను విజయవంతం చేశారు. జిల్లాలోని ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ర్యాలీ నిర్వహించి, ధర్నా చేపట్టారు. రైతులపై కేంద్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా దాదాపు రెండు గంటలపాటు ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో రహదారిపై బైఠాయించి నిరసన గళం వినిపించారు. అయితే మహేశ్వరం నియోజకవర్గ కేంద్రంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి, చేవెళ్ల నియోజకవర్గ కేంద్రంలో ఎంపీ రంజిత్ రెడ్డితోపాటు ఎమ్మెల్యే కాలె యాదయ్య, షాద్నగర్ నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ధాన్యం కొనాల్సిన కేంద్రమే కొనమని చెబితే రైతులు ఎక్కడికి పోవాలని, పండించిన పంటను ఏం చేయాలని కేంద్రాన్ని ప్రశ్నించారు. ధర్నాలో జడ్పీటీసీలు, ఎంపీపీలు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, రైతుబంధు సమితి అధ్యక్షులు, సభ్యులు, టీఆర్ఎస్ పార్టీ మండలాల అధ్యక్షులు, నేతలు, కార్యకర్తలు, రైతులు వందల సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.
పంజాబ్ మాదిరి తెలంగాణలో వడ్లు కొనాలి..:రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి
తెలంగాణ రైతాంగానికి గుదిబండగా మారిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి కేంద్రాన్ని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం మహేశ్వరం నియోజకవర్గ కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీజేపీ అంటే అమ్మకానికి కేరాఫ్ అడ్రస్గా మారిందని, టీఆర్ఎస్ అంటే తెలంగాణ ప్రజలకు నమ్మకంలాంటిదన్నారు. మోదీ ప్రభుత్వం వందలాది ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్పరం చేస్తూ లక్షలాది మంది ఉద్యోగులను రోడ్డున వేస్తున్నారన్నారు. కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాస్తున్న మోదీ ప్రభుత్వ విధానాలను నేడు యావత్ భారతదేశం ఖండిస్తుందన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ ఢిల్లీలో ఒక మాట, గల్లీలో ఒక మాట మాట్లాడుతుందన్నారు. పంజాబ్ మాదిరిగానే తెలంగాణలోనూ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని మంత్రి డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒకటి చెప్తే, బండి సంజయ్ మరొక రకంగా మాట్లాడుతూ రైతులను అయోమయానికి గురి చేస్తున్నారన్నారు. బీజేపీ నేతలకు దమ్ముంటే వరి కొంటామని అధికారికంగా కేంద్రం నుంచి ఉత్తర్వులు తీసుకురావాలని మంత్రి సవాల్ చేశారు. విత్తనాలు, ఎరువులు, సకాలంలో అంతున్నాయని, పంట పెట్టుబడి నిమిత్తం ఎకరానికి రూ.10 వేలు, రైతు ముంగింట్లోనే పంట కొనుగోలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్సేనన్నారు. మృతి చెందిన రైతు కుటుంబాలకు రైతుబీమా అందజేస్తూ అండగా నిలుస్తుందన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం నేడు అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా ముందుకు దూసుకెళ్తుందన్నారు.