ఇబ్రహీంపట్నం, ఆగష్టు 13 : మత్స్యకారుల ఆర్థిక స్థితిగుతులను మెరుగుపర్చటానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున కృషి చేస్తుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. శనివారం ఆయన గంగపుత్ర సంఘం సభ్యులతో కలిసి ఇబ్రహీంపట్నం పెద్దచెరువు తూము వద్ద గంగాహారతి కార్యక్రమాన్ని నిర్వహించారు.
అనంతరం గంగాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మత్స్యకారుల అవసరాల మేరకు అవసరమైన చేపపిల్లలను పంపిణీ చేయటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
ఇబ్రహీంపట్నం ప్రాంత మత్స్యకారుల ఆర్థిక స్థితిగతులను శాసించే ఇబ్రహీంపట్నం పెద్దచెరువు గత పదిహేనేళ్ల తర్వాత పూర్తిస్థాయిలో నిండటం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కృపేష్, మున్సిపల్ చైర్పర్సన్ కప్పరి స్రవంతి, వైస్చైర్మన్ ఆకుల యాదగిరి, కౌన్సిలర్లు గంగపుత్రసంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.