సర్కారు దవాఖానలు పేదలకు వరంగా మారాయి. అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులోకి రాగా, పైసా ఖర్చు లేకుండా కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలందుతున్నాయి. గర్భంలో శిశువు ఎదుగుదల ఎలా ఉన్నది… ఏమైనా లోపాలు ఉన్నాయా.. అని తెలుసుకునేందుకు టిఫా (టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫీటల్ అనామలీస్) స్కాన్ యంత్రం అందుబాటులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లాలోని కొండాపూర్, వనస్థలిపురం ఏరియా దవాఖానలు, వికారాబాద్ జిల్లాలోని తాండూరు మాతా శిశు ఆస్పత్రిలో ఈ సేవలందుతున్నాయి. దీంతోపాటు కేసీఆర్ కిట్, అమ్మ ఒడి సేవలతో సర్కారు దవాఖానల్లో రోజురోజుకూ ప్రసవాల సంఖ్య పెరుగుతున్నది. తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తుండడంతో ఉమ్మడి జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రంగారెడ్డి, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ) : నిత్యం ప్రజా సంక్షేమానికి పాటుపడుతున్న ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి కూడా పెద్దపీట వేస్తున్నది. కార్పొరేట్ హాస్పిటల్లో మాత్రమే లభించే అత్యంత విలువైన సేవలను నిరు పేదలకు ఉచితంగా కల్పిస్తున్నది. అత్యాధునిక పరికరాలను ప్రతి జిల్లాకు అందిస్తూ పేదలకు ఆరోగ్యానికి అద్భుతమైన సేవలను అందించే దిశగా పయనిస్తున్నది. గర్భిణులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నది. ప్రభుత్వం ఇటీవల గర్భస్థ శిశువులు, గర్భిణులు ఆరోగ్యంగా ఉండాలని, శిశువు ఎదుగుదల ఎలా ఉందో ముందుస్తుగా తెలుసుకొని, జాగ్రత్తపడేలా టిఫా (టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫీటస్ అనోమలిస్) యంత్రాలను రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రభుత్వ దవాఖానలకు అందించారు. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లాలోని కొండాపూర్, వనస్థలిపురం ఏరియా దవాఖానలకు రెండు ‘టిఫా’ యంత్రాలను ప్రభుత్వం అందించింది. ఈ యంత్రాలు ఇప్పటికే గర్భిణులకు సేవలు అందిస్తున్నాయి.
ఉచితంగా కార్పొరేట్ సేవలు
ఈ యంత్రాల ద్వారా గర్భంలో శిశువుల ఎదుగుదలను సులువుగా గుర్తించే అవకాశం ఉంటుంది. ఈ సేవలు కార్పొరేట్, ప్రైవేట్ దవాఖానలు, పలు ప్రైవేట్ వైద్య ల్యాబుల్లో అందుబాటులో ఉన్నాయి. కానీ, ఒక్క స్కానింగ్కు వేలాది రూపాయలు వెచ్చించాల్సి ఉంటుంది. ఆర్థికంగా ఉన్నతులు మాత్రమే అందుకునే ఈ సేవలను రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల కోసం ఉచితంగా అందుబాటులోకి తెచ్చింది. దాదాపు రూ.60 లక్షలు వెచ్చించి తెచ్చిన రెండు అధునాతన యంత్రాలను కొండాపూర్, వనస్థలిపురం ఏరియా దవాఖానల్లో ఏర్పాటు చేశారు. ఆరోగ్య తెలంగాణను ఆవిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది.
‘టిఫా’ స్కానింగ్ కేంద్రం ఓ వరం
గర్భంలో పిండం వయసు 5 నుంచి 6 నెలల కాలంలో దాని ఎదుగుదల, శిశువు శరీరంలోని అన్ని రకాల అవయవాల అమరికల గురించి తెలుసుకునే ‘టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫీటల్ అనోమిలిస్ (టిఫా) స్కానింగ్ సెంటర్లు రంగారెడ్డి జిల్లా ప్రజలకు అందుబాటులోకి రావటం ఓ వరం. ప్రైవేట్లో ఈ స్కానింగ్కు రూ.3 వేలకు పైనే ఖర్చవుతుంది.
యేటా అనేక మంది చిన్నారులు ఏదో ఒక లోపంతో జన్మిస్తున్నారు. ఇలాంటి సమస్యలను అధిగమించి తల్లిదండ్రుల బాధలను తీర్చేందుకు ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేసింది. నేటి అధునాతన ప్రపంచంలో పెరిగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిస్తూ టిఫా స్కానింగ్ విధానం గురించి జిల్లా ప్రజలందరికీ తెలిసేలా వైద్యాధికారులు కార్యాచరణ చేస్తున్నారు. జిల్లాలో ఈ రెండు కేంద్రాల ద్వారా రోజుకు 50 మందికి సేవలందించినా తక్కువలో తక్కువ నెలకు 2500 నుంచి 3000 వేల మందికి పైనే పేదలు వీటి ద్వారా లబ్ధి పొందనున్నారు.
ప్రజలకు ప్రయోజనం చేకూరే సేవలు
ప్రజలకు పైసా ఖర్చు లేకుండా ప్రయోజనం చేకూరే సేవలను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. సీఎం కేసీఆర్ సహాయ సహకారాలతో మరిన్ని వసతులు కల్పించనున్నాం. కార్పొరేట్స్థాయి వైద్యం ప్రజలకు అందిస్తున్నాం. గర్భస్థ శిశువు నాడీ వ్యవస్థ, గుండెలో రంధ్రాలు, మూత్ర పిండాలు మొదలైన అవయవాలు పని చేస్తున్నాయా? లేదా? అనే కోణంలో ఈ స్కానింగ్ వ్యవస్థ పరిశీలించి చెబుతుంది. ఇలాంటి సేవలు ప్రైవేట్లో వేల రూపాయలు చెల్లిస్తేగాని లభించవు. వీటి ద్వారా ప్రజలకు ప్రైవేట్ దవాఖానల బాధల నుంచి విముక్తి లభిస్తున్నది. ఇలాంటి సేవలను నిరుపేదలకు అందుబాటులోకి తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది.
– వెంకటేశ్వర్రావు, డీఎంఅండ్హెచ్వో, రంగారెడ్డి జిల్లా
తాండూరులో రూ.36 లక్షలతో టిఫా స్కానింగ్ యంత్రం
తాండూరు : మాతాశిశు సంరక్షణే ధ్యేయంగా గర్భిణులు, బాలింతలకు తాండూరు జిల్లా దవాఖాన భరోసానిస్తున్నది. ప్రైవేటు ఆస్పత్రుల్లో రూ.లక్షలు చెల్లించుకోలేని స్థితిలో ఉన్న రోగులకు తెలంగాణ సర్కార్ జిల్లా దవాఖానలో ఏర్పాటు చేసిన మాతాశిశు సేవలు పేదలకు వరంలా మారాయి. టిఫా స్కానింగ్ యంత్రాన్ని రూ.36 లక్షలతో ఇటీవల తాండూరులోని మాతా శిశు ఆస్పత్రిలో ఏర్పాటు చేశారు. దీంతో పేదలకు మరింత మేలు జరుగనుంది.
సుఖ ప్రసవం
కాన్పుల విషయంలో వైద్యసిబ్బంది ప్రత్యేక శ్రద్ధ చూపడంతో జిల్లాలోని తాండూరు, వికారాబాద్, పరిగి, కొడంగల్తోపాటు సరిహద్దులోని కర్ణాటక నుంచి కూడా మహిళలు తాండూరు సర్కార్ దవాఖానలో పురుడు పోసుకుంటున్నారు. కేసీఆర్ కిట్టు, అమ్మ ఒడి వాహనాల ఏర్పాటుతోపాటు ప్రైవేట్లో రూ.2 వేల నుంచి 3 వేలు ఉన్న టిఫా స్కానింగ్ సేవలను జిల్లా ఆస్పత్రిలో ఉచితంగా చేయడంతో మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
టిఫాతో గర్భస్థ శిశువు సమస్యలు గుర్తించవచ్చు : పాల్వన్కుమార్, జిల్లా వైద్యాధికారి తల్లి గర్భంలో ఉన్న శిశువు తల నుంచి కాలి బొటన వేలు వరకు ప్రతి అవయవం టిఫా స్కాన్ ద్వారా చూడవచ్చు. శిశువులోని సమస్యలను తెలుసుకొని కావాల్సిన చికిత్స అందించేందుకు ఉపయోగపడుతుంది. ప్రైవేట్లో రూ.2 వేల నుంచి 3 వేల వరకు ఉండే టిఫా స్కానింగ్ ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో ఉచితంగా అందిస్తున్నాం. కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలు అందిస్తున్నాం.