ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 11 : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న బాలికల ఆత్మరక్షణ కోసం సర్కారు బడుల్లో విద్యార్థినులకు కరాటే శిక్షణ తరగతులు ఇటీవలే ప్రారంభమయ్యాయి. బాలికలకు ఎలాంటి సంఘటనలు ఎదురైనా.. వాటిని ఎదుర్కొనేందుకు రక్షణగా విద్యాశాఖాధికారులు నిపుణులైన శిక్షకులచే జిల్లావ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో కరాటే తరగతులు నిర్వహిస్తున్నారు. సాయంత్రం సమయంలో రోజూ ఉపాధ్యాయుల పర్యవేక్షణలో కరాటే శిక్షణ ఇప్పిస్తున్నారు.
బాలికలపై తరచూ ఏదో ఒక ప్రాంతంలో జరుగుతున్న అఘాయిత్యాలను చూసి తల్లిదండ్రులు బాలికల రక్షణపై దిగులు పడుతున్న సమయంలో ప్రభుత్వం బాలికలకు రక్షణగా కరాటే శిక్షణ ఇప్పిస్తున్నది. పాఠశాలల్లో చదువుకునే బాలికలకు శిక్షణ ఇప్పిస్తుండటంతో తల్లిదండ్రుల్లో ధైర్యం నిండుతున్నది. తమ పిల్లలు ఎలాంటి సంఘటనైనా ఎదుర్కొంటారనే నమ్మకం వారిలో కలిగింది. ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో సర్కార్ విద్యపై గ్రామీణ ప్రాంత విద్యార్థుల తల్లిదండ్రుల్లో మరింత నమ్మకం పెరుగుతున్నది.
రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా ఉన్న 239 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలతో పాటు ఇతర ప్రభుత్వ గురుకుల పాఠశాలలు, కేజీబీవీల్లో బాలికలకు ఇటీవల ఉచిత కరాటే శిక్షణ తరగతులను ప్రారంభించారు. తరగతులు నెల రోజుల పాటు కొనసాగనున్నాయని జిల్లా విద్యాధికారి సుశీందర్రావు తెలిపారు. శిక్షణ ఇచ్చేందుకు సుశిక్షతులైన కరాటే శిక్షకుల ద్వారా దరఖాస్తులను స్వీకరించి అర్హులైన వారిని ఎంపిక చేసి ఒక్కొక్కరికి మూడు నుంచి నాలుగు పాఠశాలలను అప్పగించి రోజూ శిక్షణ ఇస్తున్నారు.
శిక్షణలో బాలికలకు ఎదురయ్యే సంఘటనలను ఎలా ఎదుర్కోవాలో ప్రధానంగా నేర్పిస్తున్నారు. చాలా ప్రాంతాల విద్యార్థినులు పాఠశాలలకు కాలినడకన వెళుతున్నారు. ఇలాంటి సమయంలో ఎలాంటి సంఘటనలు జరిగినా వాటిని అధిగమించి తమ ప్రాణాలను రక్షించుకునేలా కరాటే దోహదపడుతుంది. జిల్లాలో ప్రారంభమైన ఈ శిక్షణా తరగతులను విద్యాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
సుశిక్షితులైన మాస్టర్లతో జిల్లావ్యాప్తంగా ఉన్న 264 ఉన్నత పాఠశాలల్లో బాలికలకు కరాటే శిక్షణ ఇప్పిస్తున్నాం. ప్రతి రోజూ శిక్షణలో పాల్గొంటున్న విద్యార్థినులు ఎంతో మనోధైర్యంతో ముందుకు సాగుతున్నారు. నాణ్యమైన విద్యతో పాటు కరాటే శిక్షణ అందిస్తున్నందున తల్లిదండ్రుల్లో ఎంతో ధైర్యం పెరుగుతున్నది. ప్రభుత్వ ఆదేశాలతో ప్రతి పాఠశాలలో ఒక తరగతిని కరాటేకు కేటాయించాం.
– సుశీందర్రావు, జిల్లా విద్యాధికారి
కరాటే నేర్చుకుంటున్న బాలికల్లో మనోధైర్యం వస్తుంది. తమ ఎదుట ఎలాంటి సంఘటనలు జరిగినా.. వాటిని ఎదుర్కునేలా శిక్షణలో మెళకువలు నేర్పిస్తున్నాం. నెల రోజులపాటు ఇచ్చే శిక్షణతో బాలికల్లో నమ్మకం ఏర్పడుతుంది. ప్రతి పాఠశాల నుంచి అధిక సంఖ్యలో విద్యార్థినులు కరాటే శిక్షణలో పాలుపంచుకుంటున్నారు. శిక్షణా తరగతులను విద్యార్థినులు సద్వినియోగం చేసుకోవాలి.
– శ్రీనివాస్, కరాటే మాస్టర్, ఇబ్రహీంపట్నం