మోమిన్పేట, అక్టోబర్ 23 : వాతావరణ సమతుల్యానికి ప్రభుత్వం హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులోభాగంగా పల్లెపల్లెన నర్సరీలు, రోడ్లకు ఇరువైపులా, పాఠశాలలు, కార్యాలయాలు, ప్రకృతి వనాలు, ఇంటింటికీ మొక్కలు నాటడంతో పచ్చదనం ఉట్టిపడుతూ ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. దీనిలో భాగంగా మోమిన్పేట మండలం చిన్న కొల్కుంద గ్రామం కనులకింపుగా పచ్చదనంతో నిండుకున్నది.
6000 మొక్కల సంరక్షణ
హరితహారం కార్యక్రమంలో భాగంగా చిన్న కొల్కుంద గ్రామంలో ప్రకృతి వనంలో 4000, ఎవెన్యూ ప్లాంటేషన్లో 1000, గ్రామంలో వీధుల వెంట 1000 మొక్కలు నాటి ప్రతి రోజూ నీరు పట్టి సంరక్షించారు. మొదటి విడుతలో నాటిన మొక్కలు చెట్లుగా మారి ప్రయాణికులు, గ్రామస్తులకు చల్లటి నీడతోపాటు ప్రశాంత వాతావరణాన్ని అందిస్తున్నాయి.
స్వచ్ఛమైన వాతావరణం అందించడమే లక్ష్యం
– సురేశ్, సర్పంచ్
హరితహారం కార్యక్రమంతో గ్రామాలు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. మానవ మనుగడకు కాలుష్యం కష్టతరంగా మారింది. ఈ పరిస్థితుల్లో భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణం అందించడమే లక్ష్యంగా మొక్కలు నాటి సంరక్షిస్తున్నాం. మొక్కలు పెరిగి చెట్లుగా మారి మంచి వాతావరణాన్ని అందిస్తున్నాయి. గ్రామంలో మరిన్ని మొక్కలు నాటి సంరక్షణ చర్యలు తీసుకుంటాం.