ధారూరు : గ్రామాల్లో ఉన్న ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. శనివారం మీతో నేను అనే కార్యక్రమంలో భాగంగా ధారూరు మండల పరిధిలోని నర్సాపూర్, ధర్మాపూర్ గ్రామాల్లో మండల స్థాయి, గ్రామ స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి కలియ తిరిగారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మిషన్ భగీరథ నీటిని పరిశీలించారు. గ్రామంలో వీది రోడ్లును పరిశీలిస్తూ గ్రామస్తులను పలకరిస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో కొంతమంది వేలిముద్రలు తీసుకోకపోవటం వంటి కొన్ని కారణాల వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే రేషన్ అందటం లేదని తెలుసుకుని అందుకు ప్రత్యామన్యాయంగా ఉండే పద్దతుల ద్వారా అందరికి రేషన్ అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
కొత్తగా విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసినప్పటికీ వాటి పక్కనే పాత స్తంభాలు నిరుపయోగంగా ఉండటం, కొన్ని చోట్ల కొత్తవాటికి కనెక్షన్ ఇవ్వకపోవడం గమనించి, విద్యుత్ అధికారులతో మాట్లాడి కొత్త స్తంభాలకు కనెక్షన్ ఇప్పించి పాత స్తంభాలను తొలగించాలని సూచించారు. నర్సాపూర్ మత్స్యకారులకు సంబందించిన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వెంటనే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఫోన్ ద్వారా ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కొత్త గ్రామ పంచాయతీల్లో అభివృద్ధికి కొంత ఇబ్బంది పడుతుందని, గ్రామాలను దశల వారీగా ప్రాధాన్యతని బట్టి సమస్యలను పరిష్కారిస్తామని అన్నారు. కొత్త పింఛన్లకు సంబందించిన దరఖాస్తులను మీ మీ గ్రామ పంచాయతీ కార్యదర్శులకు అందజేయాలని, గడువు తేదీలోగా రైతులు రైతు బీమాకి సంబంధిత ఎఈవోలకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
గ్రామాల్లో నెలకొన్న ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు మీతో నేను అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు వారు తెలిపారు. గ్రామాల అభివృద్ధే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా అన్ని గ్రామాల్లో వైకుంఠ ధామాలు, కంపోస్టు షెడ్డు, పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డు, క్లస్టర్ కు ఒక రైతు వేదికలను నిర్మించి గ్రామాన్నీ అన్ని విధాలగా అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, భౌతిక దూరాన్ని పాటించాలన్నారు. కార్యక్రమంలో ధారూరు ఎంపీపీ జైదుపల్లి విజయలక్ష్మి, జడ్పీటీసీ కోస్నం సుజాత, వైస్ ఎంపీపీ విజయ్కుమార్, ధారూరు ఎంపీడీవో ఉమాదేవి, మండల వ్యవసాయ అధికారి జ్యోతి, తాసీల్దార్ భీమయ్యగౌడ్, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు వీరేషం, నర్సాపూర్, ధర్మాపూర్ గ్రామాల సర్పంచులు కుర్వ చంద్రయ్య, అనిల్కుమార్, ఎంపిటిసి బసప్ప, అధికారులు పాల్గొన్నారు.