వికారాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ) : అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. అకాల వర్షాలతో నష్టపోయిన పంటలకు సంబంధించి ఎకరాకు రూ.10 వేల చొప్పున నష్టపరిహారాన్ని అందజేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. దేశంలో ఇప్పటివరకు ఎక్కడాలేని విధంగా పంట నష్టపోయిన రైతులకు అధిక మొత్తంలో నష్టపరిహారాన్ని అందజేసేందుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు.
ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా పంట సాగు చేసేందుకు రైతు బంధు పథకం కింద ఎకరాకు రూ.10వేల చొప్పున పెట్టుబడి సాయాన్ని అందజేస్తుండడంతోపాటు పంట రుణాల మాఫీ, రైతు బీమా, వ్యవసాయానికి 24 గంటలపాటు ఉచిత కరెంట్ తదితర రైతు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ రైతు ప్రభుత్వంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పేరొందింది. రైతు సంక్షేమం కోసం ఇన్ని పథకాలను అమలు చేస్తున్నప్పటికీ.. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులు అధైర్యపడొద్దనే ఉద్దేశంతో వారిలో భరోసా నింపేందుకు సీఎం కేసీఆర్ పంట నష్టపరిహారాన్ని అందజేసేందుకు నిర్ణయించారు. పంటలను బట్టి కాకుండా ఏ పంట నష్టపోయినా ఎకరాకు రూ.10 వేల పరిహారాన్ని ప్రభుత్వం రైతులకు అందజేయనుంది. కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా రైతులకు నష్టపరిహారాన్ని అందజేయనుంది. పంట నష్టపరిహారం అందజేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో జిల్లా రైతాంగం హర్షం వ్యక్తం చేసింది.
జిల్లాలో 3,934 ఎకరాల్లో పంట నష్టం
ఇటీవల కురిసిన వడగండ్ల వానతో జిల్లావ్యాప్తంగా 3,934 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు జిల్లా యంత్రాంగం ప్రాథమికంగా అంచనా చేసింది. వీటిలో అత్యధికంగా ఉద్యాన పంటలకు నష్టం జరిగినట్లు జిల్లా యంత్రాంగం గుర్తించింది. 2133 ఎకరాల్లో ఉద్యాన పంటలు, 1801 ఎకరాల్లో వ్యవసాయ పంటలకు నష్టం వాటిల్లింది. అకాల వర్షాలతో అత్యధికంగా కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. జిల్లావ్యాప్తంగా 1584 ఎకరాల్లో 1719 మంది రైతులు కూరగాయల పంటలను నష్టపోయారు. 226 ఎకరాల్లో 230 మంది రైతులు పూల పంటలు, 323 ఎకరాల్లో 150 మంది రైతులు మామిడి పంటకు నష్టం జరిగినట్లు సంబంధిత అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. జిల్లాలోని మర్పల్లి, మోమిన్పేట్ మండలాల్లోనే అధిక మొత్తంలో పంట నష్టం జరిగింది.
జిల్లాలో దెబ్బతిన్న ఉద్యాన పంటల్లో మోమిన్పేట్ మండలంలో 499 ఎకరాల్లో పంట నష్టం జరుగగా, మర్పల్లి మండలంలో 947 ఎకరాల్లో ఉద్యానవన పంటలకు నష్టం జరిగినట్లు గుర్తించారు. వ్యవసాయ పంటలకు సంబంధించి జిల్లాలోని బంట్వారం, కులకచర్ల, మోమిన్పేట్, మర్పల్లి, కోట్పల్లి, వికారాబాద్, చౌడాపూర్ మండలాల్లో వ్యవసాయ పంటలు అకాల వర్షాలతో దెబ్బతిన్నట్లు జిల్లా వ్యవసాయాధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. బంట్వారం మండలంలో మొక్కజొన్న 105 ఎకరాలు, జొన్న 40, కోట్పల్లి మండలంలో జొన్న 60, మర్పల్లి మండలంలో మొక్కజొన్న 394, జొన్న 430 ఎకరాల్లో నష్టం జరిగినట్లు గుర్తించారు. మోమిన్పేట్ మండలంలో మొక్కజొన్న 146 ఎకరాలు, జొన్న 216, వికారాబాద్ మండలంలో మొక్కజొన్న 240, జొన్న 147, కులకచర్ల మండలంలో జొన్న 2, మొక్కజొన్న 2, చౌడాపూర్ మండలంలో వేరుశనగ 15, జొన్న 4 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. జిల్లావ్యాప్తంగా 7 మండలాల్లోని 65 గ్రామాల్లోని వ్యవసాయ పంటలపై అకాల వర్షం ప్రభావం పడినట్లు గుర్తించారు.
నేడు రైతులవారీగా సర్వే
అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందజేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన దృష్ట్యా నేడు జిల్లావ్యాప్తంగా రైతుల వారీగా సర్వే నిర్వహించాలని కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. అకాల వర్షం ప్రభావమున్న మండలాల్లో నేడు ఉదయం 7 గంటల నుంచే పంట నష్టపోయిన రైతుల వారీగా సంబంధిత అధికారులు సర్వే చేయనున్నారు. ఏ పంట, ఎన్ని ఎకరాల్లో సాగు చేశారు, ఎంత శాతం మేర పంటలు దెబ్బతిన్నాయి, రైతు సాగు చేస్తున్నారా లేదా కౌలు రైతు సాగు చేస్తున్నారనే వివరాలను శుక్రవారం సాయంత్రంలోగా నష్టపోయిన పంటల సర్వే ప్రక్రియను పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదికను అందజేయనున్నారు.
రైతుకు ఎంతో ఆసరా : పి.రెడ్డి, సయ్యద్ అలీపూర్, మోమిన్పేట
ఎకరానికి రూ.10 వేలు నష్టపరిహారం అందించడం రైతుకు ఎంతో ఆసరాగా ఉంటుంది. అకాల వర్షాల వల్ల సాగు చేస్తున్న పంటలు దెబ్బతినడంతో రైతులకు ఎంతో నష్టం చేకూరింది. కేసీఆర్ రైతు కష్టాలను దృష్టిలో పెట్టుకొని వెంటనే నష్టపరిహారం మంజూరు చేయడం సంతోషంగా ఉంది. సయ్యద్ అలీపూర్ గ్రామంలో నేను సాగు చేస్తున్న 4 ఎకరాల అరటి పంట వడగండ్ల వర్షానికి పూర్తిగా దెబ్బతిన్నది.
రూ.10వేల నష్టపరిహారం చరిత్రలోనే మొదటిసారి
– రెడ్డపల్లి దుర్గయ్య, టేకులపల్లి, మోమిన్పేట
అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలకు ఎకరానికి రూ.10 వేలు నష్ట పరిహారం తెలంగాణ ప్రభుత్వం అందించనుండడం హర్షణీయం. గత ప్రభుత్వలలో పంట నష్టం జరిగితే తక్కువ మొత్తంలో నష్ట పరిహారం అందేది. దేశంలో రైతుల కష్ట సుఖాల గురించి ఆలోచించే ఏకైక సీఎం కేసీఆర్.
పంట నష్టపరిహారం ప్రకటించడం హర్షణీయం : ప్రభాకర్, మర్పల్లి
అకాల వడగండ్ల వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలకు సీఎం కేసీఆర్ ఎకరాకు రూ.10 వేలు నష్ట పరిహారం ప్రకటించడం హర్షణీయం.. నేను 1:20 ఎకరాల్లో టమాట, 1:20 ఎకరాల్లో క్యాలీఫ్లవర్, ఎకరంలో జొన్న పంటలు వేశాను. పూర్తిగా దెబ్బతిన్నాయి. సీఏం కేసీఆర్ నష్ట పరిహారం ప్రకటించడం కొంతవరకైనా ఊరటనిస్తుంది.
కేసీఆర్ సారుకు కృతజ్ఞతలు
– రోశనెల్లి నజీర్మియా, కోటమర్పల్లి
వారం క్రితం అకాల వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటల రైతులకు ఆసరగా ఉండేందుకు సీఎం కేసీఆర్ ఎకరాకు రూ.10 వేలు ప్రకటించడం చాలా సంతోషకరం. ఆ పైసలతో మళ్లీ విత్తనాలు తీసుకుని పంటలు వేస్తాను. 2 ఎకరాల్లో మొక్కజొన్న పంట, ఎకరంలో బీట్రూట్ వేశాను. వడగండ్ల వానకు పూర్తిగా దెబ్బతిన్నది. సీఎం కేసీఆర్ సారుకు కృతజ్ఞతలు.
రైతులకు అండగా బీఆర్ఎస్
– తమ్మలి కృష్ణయ్య, కోటమర్పల్లి
రైతులకు ఎల్లవేళలా బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటున్నది. సీఎం కేసీఆర్ పంట నష్టానికి పరిహారం ప్రకటించడం అభినందనీయం. నాకున్న ఐదు ఎకరాల్లో మామిడి తోట వేశాను. పూత, కాత మంచిగా వచ్చింది. గత గురువారం కురిసిన వర్షానికి మామిడికాయలు పూర్తిగా నేలపాలైనాయి. ఏ పంటకైనా రూ.10 వేలు అందజేస్తామని ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది.
గతంలో ఎప్పుడూ ఇంత నష్టం జరుగలేదు
– రామోజీ రాచిరెడ్డి, మర్పల్లి
గతంలో ఇంత పెద్ద వడగండ్ల వాన ఎప్పుడూ చూడలేదు. నాకున్న 2 ఎకరాల్లో ఒక ఎకరం పుచ్చకాయ, ఒక ఎకరం టమాట పంటలు వేశాను. పంటలు తీయడానికి వచ్చిన సమయంలో గత వారంలో అకాల వడగండ్ల వానకు పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కేసీఆర్ సార్కు కృతజ్ఞతలు.