ఇబ్రహీంపట్నం రూరల్, డిసెంబర్ 14 : ఆరుతడి పంటల్లో వేరుశనగ ప్రధానమైనది. నూనెగింజల పంటల్లోనూ వేరుశనగకు ప్రత్యేక స్థానముంది. ప్రస్తుతం పల్లి నూనెకు ఉన్న గిరాకీ అంతా.. ఇంతా కాదు. మార్కెట్లో పల్లి నూనెకు ఉన్న గిరాకీని దృష్టిలో ఉంచుకుని రైతులు ఈ యాసంగిలో ఈ పంటను సాగుచేస్తే మంచి ఆదాయం పొందవచ్చని వ్యవసాయా ధికారులు, నిపుణులు సూచిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో వేరుశనగ పంట సాగు చేసేందుకు అనువైన భూములు ఉన్నాయి. ఇసుకతో కలిసి ఉన్న భూముల తో పాటు ఎర్రచెల్క నేలలు ఎక్కువగా ఉండడంతో వరికి ప్రత్యామ్నాయంగా పల్లికాయ సాగుకు మంచి డిమాండ్ ఉంటుందని నిపుణుల అభిప్రాయం. ఆరుతడి పంటలను సాగు చేయాలని ప్రభుత్వాలు సూచిస్తున్న తరుణంలో రైతులు ఈ పంటను సాగు చేసేందుకు ముందుకొస్తున్నారు. ఈ యాసంగిలో ఈ పంటను సాగుచేసి, వరికంటే ఎక్కువ లాభాలు పొందే అవకాశముంది.
తక్కువ ఖర్చుతో..
ఎకరా పొలంలో వరికి బదులు వేరుశనగ సాగు చేస్తే రూ.15వేలు ఖర్చు అవుతుంది. ఎకరానికి సగటున 10క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ప్రభుత్వం క్వింటాల్ పల్లికాయకు రూ.5,500 మద్దతు ధర ఇస్తున్నప్పటికీ, ప్రస్తుతం మార్కెట్లో రూ.7వేల నుంచి రూ.9వేల వరకు ధర పలుకుతుంది. సగటున క్వింటాలు ధర రూ.6500 వచ్చినా రైతుకు ఎకరాకు రూ.65వేల ఆదాయం వస్తుంది. పెట్టుబడి పోనూ రైతుకు ఎకరాకు రూ.50వేలు మిగిలే అవకాశం ఉంది. ఎకరా పొలం లో వరి పంట సాగుచేసేందుకు కనీసం రూ.20వేల పెట్టుబడి అవుతుంది. సగటున ఎకరాకు 26క్వింటాళ్ల వడ్లు పండుతాయి. ప్రభుత్వం మద్దతు ధర ప్రకారం క్వింటాల్కు రూ.1940ఉంది. రైతుకు రూ.50వేల ఆదాయం వస్తుంది. పెట్టుబడి రూ.20 వేలు పోనూ ఎకరాకు రైతుకు మిగిలేది రూ.30వేలు మాత్రమే. అలాగే ఎకరా భూమిలో వరిసాగు చేసేందుకు వినియోగించే నీటితో మూడెకరాల పల్లి కాయ సాగు చేసుకోవచ్చు. రైతులు ఈ యాసంగిలో పల్లికాయ సాగు చేయాలని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.
విత్తనాల ఎంపిక.. విత్తుకునే విధానం
యాసంగి సీజన్లో పల్లికాయ సాగుకు మొదట నాణ్యమైన విత్తన రకాలను రైతులు ఎంచుకోవాలి. ఇందులో స్పానిష్ గుర్తి, వర్ణీనియా గుత్తి అనే రెండు రకాలుంటాయి. స్పానిష్ రకాల్లో కదిరి-6, కదిరి-9, అనంత, కదిరి హరితాంద్ర, ఐసీజీవి-91114ధరణి, టీఏజీ 24రకాల విత్తనాలు ఉన్నాయి. వర్జీనియా రకాల్లో కదిరి-7, కదిరి-8 బోల్డ్ రకాల విత్తనాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇసుకతో కూడిన గరపనేలలు, నీరు త్వరగా ఇంకే ఎర్రచెల్క నేలలు ఈ పంటకు అనువుగా ఉంటాయి. బంక మ న్ను, నల్లరేగడి భూములు ఈ పంటకు అనుకూలం కాదు. విత్తుకునే సమయంలో ఒక చద రపు మీటరుకు 44మొక్కలు ఉండేలా చూసుకోవాలి. విత్తనాలను 5సెంటిమీటర్ల లోతుకంటే ఎక్కువ లోతులో వేయరాదని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.
విత్తన రకాలు.. వచ్చే దిగుబడులు..
పల్లికాయలో విత్తన రకాలకు అనుగుణంగా దిగుబడులు వస్తాయని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. కదిరి-6 విత్తన రకంతో యాసంగిలో ఎకరాకు 12 నుంచి 14క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. కదిరి-9 విత్తనం సాగుచేస్తే ఎకరాకు 10నుంచి 12క్వింటాళ్లు, కదిరి హరితాంద్రతో 10నుంచి 12, ధరణి ద్వారా 9నుంచి 10, టీఏజీ-24ద్వారా 8నుంచి 10, జేఎల్-24ద్వారా 10నుంచి 11, ఐసీజీవి-91114 ద్వారా 10నుంచి 12, కదిరి 7, 8ద్వారా 12నుంచి 14క్వింటాళ్ల దిగుబడి వస్తుందని వారు సూచిస్తున్నారు. ఇటీవల కొత్తగా వచ్చిన కదిరి లేపాక్షి-1812రకం విత్తనంతో ఎకరానికి 15నుంచి 18 క్వింటాళ్ల దిగుబడి వస్తున్నట్లు సూచిస్తున్నారు.
తెగుళ్లు.. నివారణ చర్యలు
పల్లికాయకు సోకే తెగుళ్లలో ముఖ్యమైనవి వేరుపురుగు, ఆకుముడత పురుగు, పొగాకు లద్దె, శనగపచ్చ, తామర, పచ్చదీవపు, మొగ్గతొలుచు పురుగు, తాక్కా ఆకుపచ్చ తెగులు, మొదలుకుళ్లు, వేరుకుల్లు, కాండం కుళ్లు, మొవ్వకుళ్లు, కుంకుమ తెగులు ఎక్కువగా పంటకు ఆశిస్తాయి. తెగులు లక్షణాలను ఎప్పటికప్పుడు వ్యవసాయ అధికారులకు చెబితే, తగిన సస్యరక్షణ చర్యలు వివరిస్తారు.
యాజమాన్య పద్ధ్దతులు..
పల్లికాయ వేసేముందు భూసార పరీక్ష చేయించుకోవాలి. అందుకు అనుగుణంగా ఎరువులను వాడుకోవాలి. దుక్కిలో 3నుంచి 4టన్నుల పశువుల ఎరువును వేసుకోవాలి. ఎకరానికి వంద కిలోల సూపర్ పాస్పేట్, 33కిలోల పొటాష్, 18కిలోల యూరియాను విత్తనాలు వేసే సమయంలోనే వాడాలి. 30రోజుల తర్వాత తొలిపూత దశలో మరో 10నుంచి 15కిలోల యూరియా వేసుకోవాలి. ఊడలు దిగే సమయంలో ఎకరానికి 200కిలోల జిప్సమ్కు మొక్క మొదళ్ల దగ్గర వేసి మట్టితో పూడ్చాలి. జింక్ లోపంతో ఆకులు చిన్నవిగా మారతాయి. ఇందుకు ఎకరాకు 400గ్రాముల జింక్సల్ఫేట్ను 200లీటర్ల నీటితో కలిపి వారంలో రెండుసార్లు పంటపై పిచికారీ చేయాలి. ధాతులోపంతో ఆకులు పసుపు పచ్చగా, ఆ తర్వాత తెలుపు రంగుకు మారే ప్రమాదం ఉంది. ఈ సమయంలో ఎకరాకు కిలో అన్నబేది, 200గ్రాముల సెట్రిక్ఆమ్లం 200లీటర్ల నీటితో కలిపి వారం వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. కలుపు గడ్డి నివారణకు విత్తనాలు విత్తిన వెంటనే లేదా 48గంటల్లోపు అలాక్లోర్ 50శాతం ఈసీ 1.5నుంచి 2లీటర్ల మందును 200లీటర్ల నీటితో కలిపి దుక్కిపై పిచికారీ చేయాలి.
కొత్తరకం విత్తనాలతో మంచి దిగుబడులు
ఇటీవల దిగుమతి చేసుకున్న కొత్త రకం విత్తనం కదిరి లేపాక్షి-1812 సాగుచేసిన రైతులకు దిగుబడులు పెరిగాయి. ఈ మధ్య కాలం లో ఎక్కువ మంది రైతులు ఇదే విత్తన రకాన్ని వాడు తున్నారు. ఇంతకు ముందున్న విత్తన రకాలతో మంచి దిగుబడులు పొందొచ్చు. యాసంగిలో వరికి బదులు వేరుశనగ సాగు చేసుకోవడం ఎంతో ఉత్తమం. చివరి దశలో నీరందక వరి ఎండిపోయే ప్రమాదం ఉంది. రైతులు వేరుశనగ సాగుచేసుకుని ఆదాయాన్ని పెంచుకోవాలి.
– సత్యనారాయణ, ఏడీఏ, ఇబ్రహీంపట్నం