కడ్తాల్, జనవరి 16 : మండల పరిధిలోని మక్తమాదారం గ్రామంలో కొలువైన రుక్మిణీ, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకొని గోదాదేవి-రంగనాథస్వామి వారి కల్యాణోత్సవం కనులపండువగా జరిగింది. ఆలయ అనువంశిక ధర్మకర్త తిరుమల వింజమూర్ రామానుజాచార్యుల ఆధ్యర్యంలో స్వామి వారికి నిత్యనిధి, అభిషేకం, అర్చన, హారతి కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయాన్ని కొబ్బరి, మామిడాకు తోరణాలు, వివిధ రకాల పూలతో అందంగా ముస్తాబు చేశారు. గోదాదేవిరంగనాథస్వామి వారి విగ్రహాలను వివిధ రకాల పూలమాలలతో అందంగా అలంకరించారు.
అనంతరం ఆలయ ప్రధాన అర్చకుల మంత్రోచ్ఛారణలు, భక్తులు కరతాళధ్వనుల మధ్య గోదారంగనాథస్వామి వారి పరిణయోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. తీర్థప్రసాదాలను భక్తులకు స్వీకరించారు. అనంతరం దేవతామూర్తులను పల్లకిలో ఆలయ పరిసరాలలో ఊరేగించారు. కార్యక్రమంలో సర్పంచ్ సులోచన, ఎంపీటీసీ మంజుల, ఉప సర్పంచ్ గణేశ్, నాయకులు నర్సింహ, సాయిలు, చంద్రమౌళి, కృష్ణయ్య, సత్యనారాయణ, శ్రీనివాస్, ఆలయ అర్చకులు ఆదిత్యాచార్యులు, రఘు, వంశీ, రుషికేశ, ఉదయ్కిరణ్, రంగరాజన్, అనిరుధ్, ముకుందన్, వివిధ పార్టీల నాయకులు, భక్తులు పాల్గొన్నారు.