సిటీబ్యూరో, మే 1 (నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీకి ఎర్లీబర్డ్ రూపంలో కాసుల వర్షం కురిసింది. సంస్థ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఎర్లీబర్డ్ వసూళ్లను రాబట్టుకున్నది. ముందుస్తుగా ఆస్తిపన్ను చెల్లించి 5 శాతం రాయితీ పొందాలంటూ ఏప్రిల్ 1 నుంచి 30వ తేదీ వరకు యజమానులకు జీహెచ్ఎంసీ అవకాశం కల్పించింది. 30 సర్కిళ్ల పరిధిలో సీఎస్సీ సెంటర్లు, బిల్ కలెక్టర్లు, మీ సేవా, ఆన్లైన్ల ద్వారా చెల్లింపుల ద్వారా రూ. 750కోట్ల నిర్దేశిత లక్ష్యాన్ని ఖరారు చేసుకున్నది. జోన్ల వారీగా లక్ష్యాలను ఖరారు చేసింది. ఇందులో భాగంగానే 30 సర్కిళ్లకు గానూ 735651 మంది ఈ ఎర్లీబర్డ్ స్కీంను సద్వినియోగం చేసుకోగా..వీరి నుంచి రూ. 786.75కోట్ల మేర వసూళ్లను సమకూర్చుకున్నది.
ఇది కార్పొరేషన్ చరిత్రలోనే రికార్డు స్థాయి కలెక్షన్ అని అధికారులు తెలిపారు. లక్ష్యానికి మించి 36.75 కోట్ల మేర వసూళ్లు రాబట్టడం పట్ల మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, కమిషనర్ లోకేశ్కుమార్లు హర్షం వ్యక్తం చేశారు. ఎర్లీబర్డ్ వసూళ్లలో మెరుగైన ఫలితాలను రాబట్టిన సిబ్బంది పనితీరును కొనియాడారు. 30 సర్కిళ్లలో అత్యధికంగా శేరిలింగంపల్లి మొదటి స్థానంలో నిలిచింది. ఈ సర్కిల్ నుంచి 56297 మంది సద్వినియోగం చేసుకోగా..రూ.103కోట్లు, జూబ్లీహిల్స్ రూ. 82కోట్లతో రెండో స్థానం, మూడో స్థానంలో ఖైరతాబాద్ రూ. 65కోట్ల మేర వసూళ్లను రాబట్టింది. గత ఆర్థిక సంవత్సరంలో ఎర్లీబర్డ్ స్కీం ద్వారా ఏకంగా రూ. 741.35కోట్ల మేర ఆదాయం సమకూర్చుకోగా..ఈ సారి లక్ష్యాన్ని అధిగమించి రూ. 786.75కోట్ల మేర ఆదాయాన్ని సమకూర్చుకోవడం గమనార్హం.