సిటీబ్యూరో, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): ‘ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడానికి డబ్బులు లేవు కానీ.. రూ.లక్షన్న కోట్లతో మూసీ సుందరీకరణ ప్రాజెక్టు కడతామని కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెబుతు న్నదని’ బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. మూసీ పోరుబాటలో భాగంగా ఉప్పల్, నాగోల్ పరిధిలోని మూసీ పరీవాహక ప్రాంతాల్లో సోమవారం ఆయన పర్యటించారు. నాగోల్లో ఆరు గ్యారెంటీలు, 420 హామీలని ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేండ్లవుతున్నా ఒక్క హామీ అమలు చేయలేదని ఎద్దేవా చేశా రు. రెండు లక్షల ఉద్యోగాలని నిరుద్యోగులను, తులం బంగారం, స్కూటీలు ఇస్తామని యువతులకు నమ్మకద్రోహం చేసిందన్నారు.
బస్తీలు, కాలనీల్లోని పేదల ఇండ్లను కూల్చి వారి భూములను లాక్కునే పనిలో రేవంత్ సర్కార్ పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 28 నెలల కాంగ్రెస్ పాలనలో ఒక్క ప్రాజెక్టు కట్టకుండా బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన వాటికి ప్రారంభోత్సవాలు చేస్తూ కాలయాపన చేస్తున్నదని ఆరోపించారు. ఇప్పుడు మూసీ సుందరీకరణ పేరిట పేదల భూములను లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు సీఎం రేవంత్రెడ్డి కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ హయాంలో అతితక్కువ ఖర్చుతో మూసీ సుందరీకరణ ఎలా చేసి చూపించారో పలు కళాశాలలు, పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులకు గెల్లు శ్రీనివాస్ వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రూ.లక్షన్న కోట్లతో సుందరీకరిస్తామని ప్రజాధనాన్ని దోచుకునేందుకు పక్కా ప్లాన్తో ముందుకెళ్తున్నదని విద్యార్థులకు తెలిపారు.