అబిడ్స్, సెప్టెంబర్ 14: వినాయక చవితి సందర్భంగా ధూల్పేట్ పరిసర ప్రాంతాల నుంచి గణేశ్ ప్రతిమల తరలింపు కొనసాగుతున్నది. ప్రతి సంవత్సరం ధూల్పేట్ పరిసర ప్రాంతాల్లో ప్రతిమలను తయారు చేసి విక్రయాలు చేపడుతారు. వేలాది విగ్రహాల తయారీ, విక్రయాలు జరుగుతాయి. నిత్యం ప్రతిమలను కొనుగోలు చేసేందుకు నగరంలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలతో పాటు జిల్లాలకు చెందిన మండప నిర్వాహకులు సైతం వస్తున్నారు. 18న వినాయక చవితి కావడంతో దూర ప్రాంతాలకు చెందిన వారు ధూల్పేట్కు వచ్చి ప్రతిమలను కొనుగోలు చేస్తున్నారు. పెద్ద ప్రతిమలను వ్యాపారులు క్రేన్ల సహాయంతో లారీల్లోకి ఎక్కించి తరలిస్తున్నారు.
వినాయక చవితి సమీపిస్తుండటంతో ఇప్పటికే తయారైన వినాయక ప్రతిమలకు కళాకారులు తుది మెరుగులు దిద్ది విక్రయాలు చేపడుతున్నారు. పలు చోట్ల నుంచి ఉత్సవ నిర్వాహకులు ధూల్పేట్కు చేరుకుని ప్రతిమలను కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో సందడి నెలకొంది. కళాకారులు తయారు చేసిన వినాయక ప్రతిమలను ధూల్పేట్ పరిసర ప్రాంతాల్లో షెడ్లను ఏర్పాటు చేసి విక్రయాలు చేపడుతున్నారు. ట్రాఫిక్ను క్రమబద్ధీకరించేందుకు ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులు, వ్యాపారులు చర్యలు తీసుకుంటున్నారు.